ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Thursday 19 July 2012

బ్రాంచి ఎంపికలో... మొగ్గుఎటు?

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు ముందుగానే బ్రాంచి ఎంపికపై అవగాహన ఏర్పరచుకోవడం తప్పనిసరి. పరిశ్రమల విస్తృతికి తగ్గట్టుగా ఎన్నో రకాల బ్రాంచిలు విద్యార్థులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తితో శ్రమించి చదివితే ఏ బ్రాంచి ద్వారానైనా ఉన్నతమైన కెరియర్‌ను అందుకోవచ్చు. విద్యార్థి కెరియర్‌ లక్ష్యాలు, అభిరుచి, భవిష్యత్తులో అవకాశాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని బ్రాంచీలు మీ ఆసక్తికి, లక్ష్యసాధనకు దగ్గరగా ఉంటాయి. అలాంటి వాటిని ఎంచుకుంటే మంచి కెరియర్‌కు మార్గం సుగమం అవుతుంది.


జాతీయ, అంతర్జాతీయ  ఆర్థిక వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌, తదితర సాంప్రదాయ అధ్యయన అంశాలను కోర్‌ బ్రాంచీలుగా పిలుస్తున్నారు. ఆధునిక పారిశ్రామిక రంగం ఆవిర్భావంతో కంప్యూటర్స్‌, ఐటీ, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, బయోటెక్నాలజీ, మెకట్రానిక్స్‌, తదితర బ్రాంచీలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థి తన ఆసక్తి, విద్యానేపధ్యం, స్థిరపడాలనుకుంటున్న రంగం, మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్రాంచీలను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఈసీఈకి నిరంతర డిమాండ్‌
ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచికి విద్యార్థుల నుంచి విపరీతంగా డిమాండ్‌ ఉంది. ఈసీఈ సంబంధిత పారిశ్రామిక, సేవా రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా టెలికాం రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం వృద్ధి చెందుతోంది. అనుకున్న సమయం కంటే వేగంగా, లక్ష్యానికి మించి ఫలితాలు ఈ రంగంలో కనిపిస్తున్నాయి. టెలికాం రంగంలో జరిపే పరిశోధన, అభివృద్ధి ఫలితాలు తక్షణం సాధారణ ప్రజానీకానికి చేరువలోకి వస్తున్నాయి. 3జీ, 4జీ, ఎల్‌టీఈ (లాంగ్‌ టర్మ్‌ ఎవల్యూషన్‌) లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుంది. వినియోగదారుల మార్కెట్‌ విస్తృతంగా ఉండటం, రోజురోజుకూ ఇది వృద్ధి చెందుతుండటం వల్ల ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి.

టెలికాం రంగంతోపాటు అనేక ఇతర పరిశ్రమలు, విభాగాలు ఈసీఈ విద్యార్థులకు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, మైక్రోవేవ్‌, శాటిలైట్‌, టెరెస్ట్రియల్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ లాంటి అనేక రకాల కమ్యూనికేషన్‌ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ప్రభుత్వ రంగంలోని బీఈఎల్‌, ఇస్రో, ఈసీఐఆర్‌, డీఆర్‌డీఓ లాంటి కంపెనీల్లో కూడా స్థిరపడవచ్చు. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సంబంధిత విభాగాల్లోకి కూడా ఈసీఈ విద్యార్థులు ప్రవేశించవచ్చు. తద్వారా ఉద్యోగ అవకాశాల పరిధిని పెంచుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో కూడా...
ఈసీఈ విద్యార్థులకు ప్రోగ్రామింగ్‌పై కూడా పట్టు ఉంటుంది. సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచి విద్యార్థులకు తీసిపోని రీతిలో ప్రోగ్రామింగ్‌ సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. తద్వారా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో కూడా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. అవకాశాలతోపాటు ఈసీఈ చదివే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులే మంచి అవకాశాలను పొందే పరిస్థితి ఉంది.

పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఈసీఈ విద్యార్థులకు విద్యావకాశాలు విస్తృతం. ఎం.టెక్‌. లేదా ఎం.ఎస్‌.లో వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, టెలి కమ్యూనికేషన్స్‌, సీఎస్‌ఈ, ఐటీ, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, పవర్‌ సిస్టమ్స్‌, అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రానిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, రాడార్‌, మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్‌, ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, తదితర స్పెషలైజేషన్‌లను ఎంచుకోవచ్చు. మనదేశంలో, విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులు చేసినవారికి అవకాశాలు బాగుంటాయి.

నిత్య జీవితంలో సివిల్‌

మనిషి నిత్యజీవితంతో ముడిపడి ఉన్న సబ్జెక్టు సివిల్‌ ఇంజినీరింగ్‌. మనం నిరంతం చూసే, ఉపయోగించే రోడ్లు, భవనాలు, పరిశుద్ధమైన నీరు, ప్రాజెక్టులు, వంతెనలు, ఎయిర్‌పోర్టులు, తదితరాలన్నీ కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫలాలే. ఇతర ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి సివిల్‌ ఇంజినీర్లు మానవ జీవితాన్ని సుఖవంతం చేయగలుగుతారు. దీనిలో భాగం కావాలంటే సివిల్‌ ఇంజినీరింగ్‌ చదవాలి. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చేపట్టే ప్రాజెక్టుల్లో పనిచేయడం ద్వారా వివిధ సమస్యలకు సృజనాత్మక రీతిలో పరిష్కారాలు కనుక్కోవడం సివిల్‌ ఇంజినీర్లకు సాధ్యమవుతుంది. మేథ్స్‌, సైన్స్‌, టెక్నాలజీ పరిజ్ఞానం ఈ అభ్యర్థులకు అవసరం. ఉన్నత విద్యలో అభ్యర్థులు తమకు ఇష్టమైన స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వీలుంది.

సివిల్‌ ఇంజినీరింగ్‌ ఎప్పటినుంచో కొనసాగుతోన్న సాంప్రదాయ సబ్జెక్టు. నిర్మాణాల ప్రణాళిక, రూపకల్పన, అమలు ఇందులో కీలకం. ఈ సబ్జెక్టు ద్వారా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌, అంచనా, సంబంధిత అంశాల్లో గట్టి పునాది ఏర్పడుతుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు బీటెక్‌ తర్వాత మనదేశంలో లేదా విదేశాల్లో ఉన్నత కోర్సులు చేయవచ్చు. స్ట్రక్చరల్‌, వాటర్‌ రిసోర్సెస్‌, ఎన్విరాన్‌మెంటల్‌, కన్‌స్ట్రక్షన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌, తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.

* బీటెక్‌ తర్వాత ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం, రైల్వేలు, రక్షణ, పీడబ్ల్యుడీ, తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలోని వ్యవసాయ, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, భూగర్భ జలవనరుల విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.
* ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఓఎన్‌జీసీ, సెయిల్‌, జిందాల్‌ గ్రూప్‌ కంపెనీలు కూడా సివిల్‌ ఇంజినీర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. స్వయంగా కన్సల్టింగ్‌ సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి అనువైనది


(ఇతర ముఖ్య బ్రాంచిల విశేషాలను eenadu.net లో చదువు పేజీ విభాగంలో చూడండి.)