ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 29 October 2012

ఐఐటీ బాటలో మెలకువగా... మెరుగ్గా!

ఐఐటీ ప్రవేశపరీక్షలో 2013లో ప్రవేశ పెడుతున్న మార్పులను తల్చుకుని బెంబేలు పడటం కంటే వాటిని సవ్యంగా అర్థం చేసుకోవాలి. తగినట్టుగా సంసిద్ధమవాలి. ఇదే విద్యార్థుల కర్తవ్యం!
 

‘ఐఐటీ ప్రవేశపరీక్ష కొరకరాని కొయ్యే', 'ఐఐటీల్లో సీటు సాధించటం మరింత కఠినం', 'ఐఐటీ ప్రవేశపరీక్ష అందని ద్రాక్ష'- ఇలాంటి వ్యాఖ్యలు ఇటీవల తరచూ వినపడుతున్నాయి. వీటినిచూసి చాలామంది అధైర్యం పెంచుకుంటున్నారు కూడా. ఇది సరి కాదు. పరీక్ష నిర్వహణలో కొత్త మార్పులు ప్రవేశపెట్టినపుడు వాటిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే అయోమయం, ఆందోళన తగ్గిపోతాయి. పరీక్షను దీటుగా, మెరుగ్గా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసమూ ఏర్పడుతుంది.

ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రవేశపెడుతున్న మార్పులు- పరీక్ష నిర్వహణ పద్ధతిలో జరుగుతున్నవే తప్ప పరీక్ష నమూనాలో కానీ, సిలబస్‌లో కానీ జరుగుతున్న మార్పులు కావు. సబ్జెక్టును క్షుణ్ణంగా చదువుకుని, భావనలపై అవగాహన పెంచుకునే విద్యార్థులు ఈ మార్పుల కారణంగా నష్టపోయేదేమీ లేదు. అందుకని వారు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!

నాటి పరీక్షలే...
ఇంతవరకూ ఉన్న ఏఐఈఈఈ లాగా జేఈఈ-2013 మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది. అలాగే ఇంతవరకూ ఉన్న ఐఐటీ-జేఈఈలాగా జేఈఈ-2013 అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంటుంది. కాకపోతే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ముఖద్వారం (గేట్‌వే) అవుతుంది. ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈలు ఎంతోకాలంగా విద్యార్థులు రాస్తున్న పరీక్షలే కాబట్టి ఇంక ఆందోళన దేనికి?

అయితే ఇంటర్మీడియట్‌ మార్కులకు ప్రాధాన్యం పెరిగిందనేది గమనించాలి. ఈ ఒక్క విషయంలో విద్యార్థులు తగిన జాగ్రత్త తీసుకుంటే ఐఐటీల్లో ప్రవేశం ఏమంత కష్టం కాదు. ప్రవేశపరీక్షలో జరగబోతున్న మార్పులు అర్హతా నిబంధనలకు సంబంధించిన సాంకేతికపరమైనవే కానీ సబ్జెక్టు పరమైనవి కాదు!

ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే...
1) ఇంటర్‌ లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఆ సంవత్సరం ఉత్తీర్ణులైన టాప్‌ 20 పర్సంటైల్‌ విద్యార్థుల్లో ఉండాలి.
2) జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకు సాధించాలి. అంతేకాకుండా మొదటి లక్షా యాబైవేలమందిలో ఒకడవ్వాలి.
3) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ర్యాంకు సాధించాలి.

తుది పరీక్ష అయిన అడ్వాన్స్‌డ్‌లో సాధించే ర్యాంకు ఆధారంగానే సీటును కేటాయిస్తారు. మొదటి రెండూ eligibility conditions గానే ఉంటాయి. అంటే జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు, ఇంటర్‌ మార్కులకు ఐఐటీలో సీటు కేటాయించడంలో ప్రాధాన్యం ఉండదు.

అర్హతా నిబంధనల్లో తేడా
ఈ పరీక్షలన్నిటికీ చదివే సిలబస్‌ ఒకటే అయినా బహుముఖ వ్యూహం అవసరం. ఇక్కడ విద్యార్థులు గమనించదగ్గ విషయం ఏమిటంటే- ఎన్‌ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ; ఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ ఉన్న అర్హత నిబంధనల్లో వ్యత్యాసం!

ఎన్‌ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికి బోర్డు పరీక్షలో టాప్‌ 20 పర్సంటైల్‌ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంస్థల్లో సీటు కేటాయించడం కోసం ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌ మార్కుల వెయిటేజీ నార్మలైజేషన్‌ జరిగిన తర్వాతే ఉంటుంది.

ఐఐటీల్లో సీటు పొందడానికి ఇంటర్‌ మార్కులతో, జేఈఈ మెయిన్స్‌ ర్యాంకుతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. కానీ జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిలో మొదటి లక్షాయాబైవేలమందిలో, ఇంటర్లో ఉత్తీర్ణులైనవారిలో టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి. ఇవీ అర్హతా నిబంధనలు. వీటిని అర్థం చేసుకుని తగిన ప్రిపరేషన్‌ వ్యూహం రూపొందించుకోవాలి.

సబ్జెక్టుపరంగా ప్రాధాన్యం
మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలకు సమ ప్రాధాన్యమే ఉంది. అయితే సబ్జెక్టుపరంగా ఆలోచిస్తే- భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు మన రాష్ట్ర విద్యార్థులకు కఠినంగా ఉంటాయి. అందుకనే వీరు దీనిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది.

గణితం స్కోరింగ్‌ సబ్జెక్టని తెలిసిందే. మంచి ర్యాంకు సాధనకు ఈ సబ్జెక్టును నమ్ముకోవాల్సిందే. మూడో ప్రాధాన్యం రసాయనశాస్త్రానిది. ఎందుకంటే- మిగిలిన రెండు సబ్జెక్టుల్లో ఎక్కువగా కాల్‌క్యులేషన్‌ ఆధారిత ప్రశ్నలుంటే దీనిలో కంటెంట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాల్‌క్యులేషన్లలో పొరపాట్లు జరిగే అవకాశం అధికం. ఇక ఇంటర్‌ పరీక్షలో కూడా టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి కాబట్టి ఈ మూడు సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి.

లాభం... నష్టం
తగిన ప్రతిభా సామర్థ్యాలు లేకున్నా కోచింగ్‌ బలంతోనో, ఊహించి సమాధానాలు రాసి తమ అదృష్టబలంతోనో ఐఐటీల్లో సీటు పొందాలనుకున్న విద్యార్థులకే ఈ మార్పుల వల్ల నష్టం. సబ్జెక్టును చదివే ప్రతిభావంతులకు మాత్రం ఎలాంటి నష్టమూ ఉండదు.

ఐఐటీ-జేఈఈ సన్నద్ధతలో పడి ఇంతవరకూ విద్యార్థులు ఏఐఈఈఈని నిర్లక్ష్యం చేసేవారు. అటు ఐఐటీల్లో సీటు రాక, ఇటు ఏఐఈఈఈ సరిగా రాయక రెండు రకాలుగానూ నష్టపోయేవారు. ఇప్పుడా ప్రమాదం లేదు. ఎందుకంటే ఏఐఈఈఈ (జేఈఈ-మెయిన్స్‌), ఐఐటీ-జేఈఈ (జేఈఈ-అడ్వాన్స్‌డ్‌)కి స్క్రీనింగ్‌ పరీక్ష మారింది. ఇది కూడా విద్యార్థులకు లాభదాయకమే. ఈ మార్పుల వల్ల ఇంటర్‌ మార్కులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీనివల్ల తాము నష్టపోకుండా ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

ఎక్కణ్ణుంచి ఆరంభించాలి?  www.eenadu.net లో చదువు పేజీని చూడండి.