ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday, 5 December 2011

గమ్యం... గ్రూప్‌-1

ఏడాది చివర్లో వెలువడిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఉద్యోగార్థులకు తీపి కబురునందించింది.

ఏపీపీఎస్‌సీ చరిత్రలోనే తొలిసారిగా నియామక ప్రకటనతో పాటే పరీక్ష తేదీలను ముందస్తుగా ప్రకటించటం విశేషం. ఈ అనుకూలాంశాన్ని అందిపుచ్చుకుని... పక్కా ప్రణాళికతో వెంటనే సన్నద్ధమవటమే అభ్యర్థుల కర్తవ్యం అని సూచిస్తున్నారు  కొడాలి భవానీ శంకర్ !

రాష్ట్రస్థాయిలో అత్యున్నతమైనవి గ్రూప్‌-1 ప్రభుత్వ సర్వీసులు. ఈ హోదాలను అందుకోవాలంటే మూడంచెల నియామక పరీక్షలో విజయం సాధించాల్సిందే. ఈ సర్వీసుల్లో ఎంపికైనవారికి విధాన నిర్ణయాల్లో, అమలులో కీలకపాత్ర పోషించే విశిష్ట అవకాశం లభిస్తుంది.
సమస్యలను విశ్లేషించగల నేర్పు, శ్రమించే తత్వం, సామాజిక సమస్యలపై స్పందించే సహానుభూతి ఉన్నవారు ఈ పోస్టుల్లో రాణిస్తారు.

మేధో శక్తి కంటే కష్టపడే స్వభావం అధికంగా ఉండేవారికే అవకాశాలు అధికం.

19 విభాగాల్లో 304 పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. డిసెంబరు 9 నుంచి జనవరి 8 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఎవరైనా అర్హులే. మే 27న ప్రిలిమ్స్‌, అక్టోబరు 3న మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు చూడాల్సిన వెబ్‌సైట్‌:  http://www. apspsc.gov.in/

నాటి అభ్యర్థుల పొరపాట్లు
తెలివైన వ్యక్తి కేవలం తన తప్పుల నుంచే గుణపాఠం నేర్చుకోడు. ఇతరుల పొరబాట్ల నుంచి కూడా నేర్చుకుంటాడు. 2008 గ్రూప్‌-1 ప్రకటనకు ఎన్నో ఆశలతో అక్షర యుద్ధం ప్రారంభించిన అభ్యర్థులు రకరకాల కారణాల వల్ల మధ్యలోనే నిష్క్రమించారు. అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం ఏ అభ్యర్థికైనా అవసరమే.

** ప్రయత్నించి చూద్దాం
నోటిఫికేషన్‌ వచ్చిన తొలిరోజుల్లో నిండుగా ఉండే స్ఫూర్తి వల్ల చాలామంది అభ్యర్థులు ఉత్సాహంగానే చదువుతారు. అయితే వీరిలో చాలామంది అప్పటికి వేరే ప్రత్యామ్నాయం లేక గ్రూప్స్‌ రాద్దామని నిర్ణయించు కొనేవారే. వందశాతం ఈ ఉద్యోగం పొందాలనీ, చివరివరకూ పోరాడాలనీ నిర్ణయించుకొని దిగేవారి సంఖ్య పది శాతం కూడా మించదు! అలా 'ప్రయత్నించి చూద్దాంలే' అనుకునే అభ్యర్థుల కోవకి మీరు కూడా చెందితే ఫలితం ఆశాజనకంగా ఉండదు. గ్రూప్స్‌లో విజయం యాదృచ్ఛికం కాదు. నిర్దిష్ట ప్రణాళికతో అలుపెరగకుండా సాగాల్సిన ప్రయాణం!

** అసలు సత్తా ఉందా?
ఒక అభ్యర్థి ఒకసారి ఇలా అడిగారు- 'నిరంతరం శ్రమించడం వల్ల ఉద్యోగం వచ్చేట్లయితే కొందరు 4, 5 సార్లు సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలు రాసినా, ఎందుకని వారికి విజయం రావడం లేదు?'. నిజమే, ఏళ్ల తరబడి ప్రిపరేషన్‌ తప్పనిసరి విజయాన్ని అందిస్తుందనేది అపోహ. 'జుట్టున్నమ్మకు ఏ కొప్పయినా అందమే' అనే నానుడి విన్నారా? ఇది కూడా అలాంటిదే. సహజ మానసిక సామర్థ్యాలు లేకుండా ఏళ్ల తరబడి పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం సున్నా. అసలు సత్తా ఉన్నా, పరీక్ష నాడిని పట్టుకోకుంటే మరోసారి రాయాల్సిందే. సామర్థ్యం ఉండి, పరీక్ష నాడి తెలుసుకుని దానికి తగిన శ్రమను అందిస్తే గెలుపు తథ్యమని గత గ్రూపు-1 టాపర్లు రవినాయక్‌, నారాయణరెడ్డిల విజయాలు తెలుపుతున్నాయి.

అందువల్ల నోటిఫికేషన్‌ వచ్చిందని ఆరాటపడకుండా, 'నిజంగా మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఏడాది కాలం పాటు ఓపిక పట్టగలమా? సామాజిక దృక్కోణంలో వివిధ విషయాల్ని అధ్యయనం చేయగలమా?' అని ఆలోచించి దిగాలి.

** అకడమిక్‌ మార్కుల్ని అతిగా...
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అకడమిక్‌ పరీక్షల్లో వచ్చిన 80- 90 శాతం మార్కుల్ని చూసి సివిల్స్‌, గ్రూప్స్‌లో తప్పక విజయం సాధిస్తారని అనుకుంటారు. అకడమిక్‌ అంటే ప్రత్యేక సిలబస్‌, పాఠ్యాంశాల్ని కలిగి ఉంటుంది. దాంతో 'బట్టీ' అభ్యర్థులు కూడా మంచి స్కోరు సాధించవచ్చు.

కానీ సివిల్స్‌, గ్రూప్స్‌ సిలబస్‌లో ప్రతి అంశాన్నీ బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌ వరకూ వివిధ కోణాల్లో చదివే నేర్పుండాలి. అలా కాకుండా మార్కెట్లో దొరికే ఏదో ఒక పుస్తకమో, కోచింగ్‌ సెంటర్లో నోట్సో చదవడం వల్ల ఉపయోగం ఉండదు.