ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday 9 January 2013

మే 10న ఎంసెట్‌


ఈనాడు హైదరాబాద్‌ :ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సుల ప్రవేశపరీక్షల తేదీలతోపాటు ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ నిర్వహణ, తరగతుల ప్రారంభం తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. ఇలా జరగడం ఉన్నత విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం.

సుప్రీంకోర్టు ఆదేశాలతో 'అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)' జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఏడు ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించారు. నిరుడు ఎంసెట్‌ మే 12న జరగ్గా, ఈసారి రెండు రోజులు ముందుగా మే 10న జరుగనుంది. ఐసెట్‌ అదే నెల 17న ఉంటుంది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇంజినీరింగ్‌(పీజీఈసెట్‌) తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయి. ఎడ్‌సెట్‌(బీఈడీ), వ్యాయామవిద్య(పీఈసెట్‌), న్యాయవిద్య(లాసెట్‌, పీజీలా) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం(ఈసెట్‌) తరగతులు జులైలో వేర్వేరు తేదీల్లో మొదలవుతాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్‌, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయప్రకాష్‌రావు, ఇతర అధికారులతో కలసి ఉపముఖ్యమంత్రి ఈ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలిపారు.



2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లోనే చేపడతామని స్పష్టంచేశారు. రుసుములు, ప్రవేశాల నియంత్రణ సంఘం(ఏఎఫ్‌ఆర్‌సీ) పటిష్ఠతకు సంబంధించిన చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ సీట్ల భర్తీపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. బోధనా రుసుములు చెల్లించకుంటే జనవరి 21 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలను మూసేస్తామన్న యాజమాన్యాల ప్రకటనపై విలేఖరులు ప్రశ్నించగా- దానిపై తానేమీ మాట్లాడనని రాజనర్సింహ బదులిచ్చారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు పూర్తికావొచ్చాయన్నారు. చివరిసారిగా ప్రాంతీయ, రాష్ట్రస్థాయి బృందాల తనిఖీలను జరపబోతున్నామని వివరించారు. తనిఖీ నివేదికలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన: ఈసారి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎంసెట్‌ ర్యాంకులను ప్రకటిస్తామని అజయ్‌జైన్‌, జయప్రకాష్‌రావు వెల్లడించారు. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు మలివిడత కౌన్సెలింగ్‌లో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. ఏటా అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తొలుత మార్కులను ప్రకటించి, ఈ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంసెట్‌ ర్యాంకులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈదఫా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే అధికారులు ర్యాంకులను ప్రకటించబోతున్నారు.


No comments:

Post a Comment