ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 9 July 2013

నేనో ఐఐటియన్‌ని... కానీ అందుకు గర్వపడటంలేదు!

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు   తెచ్చుకున్నంతమాత్రానే భవిత ఉజ్వలంగా మారిపోయినట్టు కాదు. డ్రాపవుట్లుగా మిగిలే ప్రమాదం... పొంచే వుంటుంది! విద్యార్థులు అక్కడి క్యాంపస్‌ జీవితం గురించి ముందస్తుగానే ఒక అవగాహనతో ఉండటం మేలు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ రూర్కీ ఐఐటీలో పేపర్‌ అండ్‌ పల్ప్‌ టెక్నాలజీ చదువుతున్న నూతక్కి శరత్‌ తమ క్యాంపస్‌ పరిస్థితులను ఇలా విశ్లేషిస్తున్నాడు...


నదేశంలో ప్రాముఖ్యం కలిగిన, ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఐఐటీలు. అందులో ప్రవేశించాలనేది ఎందరో విద్యార్థులు స్వప్నించే విశేషం. ఆ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి కఠినమైన శిక్షణ పొందుతారు. నేను జేఈఈలో సఫలమైన వాళ్ళలో ఒకణ్ణి. ఈ ప్రవేశపరీక్ష ప్రాతిపదికగా సీట్లు కేటాయించే సంస్థలు పదిహేడు. అందులో పదిహేను ఐఐటీలు. మిగతా రెండు కూడా వీటితో పోలిస్తే ఇంచుమించు అదే స్థాయిలోనివే. ఈ సంస్థలు విద్యార్థులకు అత్యున్నత సదుపాయాలు, మంచి ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులను అందిస్తాయి. ఇవన్నీ నిజాలే అయినప్పటికీ, విద్యార్థులూ, తల్లిదండ్రులూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇంకా వేరే ఉన్నాయి.

పైన ఉన్న శీర్షిక నేనేమి రాయబోతున్నానో చెబుతుంది. అవును, సాధించినదానికి నేనేమీ గర్వపడడం లేదు. అందరిలాగే నేనూ ఈ ప్రవేశాన్ని ఒక కలగా భావించాను. క్యాంపస్‌లోకి ప్రవేశించేవరకు అంతా బాగానే ఉంది. నిజానికి నాకు ఎన్‌ఐటీ, జంషెడ్‌పూర్‌లో ఇంకో అవకాశం ఉంది. అది ఉపయోగించుకోలేకపోయాను.

'ఐఐటియన్స్‌ అందరికీ మంచి ఉద్యోగాలు దొరుకుతాయి' అని సాధారణంగా అందరూ భావిస్తుంటారు. ఈ అభిప్రాయం సరైనది కాదు. అది కేవలం మన బ్రాంచి మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి 'ఐఐటియన్లందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయి' అనేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే అనేక ఇతర ప్రైవేటు కళాశాలల విషయంలో కూడా ఇదే నిజం.

ఏ బ్రాంచి అయినా సరే, ఐఐటీల నుంచి ఉద్యోగాలు పొందిన వారు సగటున సంవత్సరానికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. 'అమృత' లాంటి ప్రైవేటు కళాశాలల్లో చదివినవారు కూడా దాదాపుగా ఇంతే సంపాదిస్తున్నారు. మీరు వినే- సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయల ఉద్యోగాలు వందలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దానికోసం మన జీవితాన్ని పణంగా పెట్టలేము, అవును కదా?

కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌ (ఈసీఈ) ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఈ బ్రాంచుల్లో ఉంటేనే అందరూ గొప్పగా అనుకునే ఐఐటియన్‌ కింద లెక్క. నేను ఈ సంస్థలు నాణ్యత లేవని చెప్పటం లేదు. కానీ ఎక్కువగా ఆశించి నిరాశ పడవద్దని మాత్రమే చెబుతున్నాను. నా అభిప్రాయాలు ప్రతికూలంగా ఉన్నట్లు మీకు అనిపించినా, నియామకాలకు సంబంధించి నేను చెప్పదలచుకున్నదీ, నాకు అనిపించిందీ మాత్రం ఇదే!

అత్యున్నత వసతులు
ఇక క్యాంపస్‌ జీవితానికి వస్తే భారతదేశంలోని మిగతా ఇంజినీరింగ్‌ కళాశాలల కన్నా అత్యున్నత సౌకర్యాలున్న మాట వాస్తవం. ఇక్కడ విద్యార్థులకు 'ఇంటర్న్స్‌' ఇంకా బాగుంటాయి.

వ్యక్తిగత, వ్యక్తిత్వ అభివృద్ధికీ, నైపుణ్యాలను పెంచుకోవడానికీ ఇక్కడ అనంతమైన అవకాశాలుంటాయి. రకరకాల హాబీల క్లబ్బుల్లో పాల్గొనటం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఆ సంగతి చాలామందికి వాళ్ల కోర్సు పూర్తి అయ్యాక కానీ అర్థం కాదు. అదృష్టవశాత్తూ నాకది అర్థమైంది. పోటీపడిన ప్రతి అంశంలోనూ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. కేవలం పాల్గొన్నందుకు కూడా సర్టిఫికెట్లు ఇస్తారు. అవి తరువాత మన రెజ్యూమె తయారు చేసుకునేటప్పుడు ఉద్యోగావకాశాలకు చాలా సహాయకరంగా ఉంటాయి.

బోధనను అధికంగా ఆశించకండి
ఇక ఉపాధ్యాయుల విషయం. ఈ విషయంలో కూడా ఎక్కువ ఆశించనవసరం లేదు. ఎవరికి వారు చదువుకోవాల్సిందే. సబ్జెక్టు వరకూ చూస్తే వాళ్లు అత్యున్నత ప్రమాణాలు కలవారే అనడంలో సందేహం లేదు. కానీ వాళ్లలో కొందరికి బోధించడంలో నైపుణ్యం లేదు. మీరు దక్షిణ రాష్ట్రాలవారై ఉండి హిందీ అర్థం కానివారైతే, ఇలాంటి విద్యార్థులు ఉత్తర రాష్ట్రాల్లో చేరకముందే హిందీ నేర్చుకోవడం మంచిది. మీ ప్రొఫెసర్‌ అర్థం చేసుకోగల ఇంగ్లిషు మాట్లాడతారనీ, కనీసం ఇంగ్లిషయినా మాట్లాడతారని మాత్రం ఆశించవద్దు.

నా ఇంటర్‌ను ఓ కార్పొరేట్‌ కళాశాలలో పూర్తిచేశాను. అక్కడ చదివిన మిగతావారిలాగే అదొక విద్యాసంస్థలా కాక జైలులాగే నాకు అనిపించేది. అలాంటి వాతావరణం నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా వాతావరణంలోకి రావడంతో నాకు వూపిరి ఆడినట్లయింది. అక్కడ ఇరవై నాలుగు గంటలు చదువు, ఇక్కడ కావాల్సినంత స్వేచ్ఛ. ఏమైనా చేసే అవకాశం ఉందిక్కడ. అది కొంతమందిని తప్పుదారి పట్టిస్తుంది. ఐఐటీ డ్రాప్‌ అవుట్ల విషయంలో మన ఆంధ్ర విద్యార్థులు పేరు తెచ్చుకున్నారని అందరికీ తెలిసిన విషయమే.

ఇక్కడ లభించే స్వేచ్ఛను నేను తప్పు పట్టడం లేదు. అక్కడి జైలులాంటి జీవితాన్ని మాత్రమే తప్పు పడుతున్నాను. ఇంటర్‌లో పడిన పునాది జేఈఈని విజయవంతంగా పూర్తిచేయడానికి చాలా సహాయపడింది. అందులో సందేహం లేదు. కానీ జీవితానికి అదే సరిపోదు కదా!

రూర్కీ విషయానికి వస్తే ఒక మిడ్‌టర్మ్‌ పరీక్ష మాత్రమే ఉంటుంది. 25 శాతం మార్కులు క్లాస్‌వర్క్‌ సెషనల్స్‌కి కేటాయిస్తారు. ఇది ఒక్కో సబ్జెక్టుకు ఒక్కోలాగా ఉంటుంది. కానీ 25 శాతం అనేది సగటు సంఖ్య. తుది పరీక్షలకు 50 నుంచి 40 శాతం మాత్రమే కేటాయిస్తారు.


ఏ ఐఐటీలో అయినా గ్రేడ్స్‌ సాపేక్షిక ప్రాతిపదికన కేటాయిస్తారు. A+ అంటే పది పాయింట్లు. దానిని అనుసరించే A, B+, B, C+, C, D, F ఉంటాయి. అంటే 9, 8, 7, 6, 5, 4, 0 పాయింట్లు. ప్రతి సబ్జెక్టుకూ క్రెడిట్లు ఉంటాయి. ఉదాహరణకు లెక్కలకి నాలుగు క్రెడిట్లు. లెక్కల్లో B+ వస్తే దాని పాయింట్లు 8, క్రెడిట్ల చేత గుణీకరించి ఆ సబ్జెక్టు క్రెడిట్లు 8x4= 32 వస్తాయి. ఈ సబ్జెక్టు క్రెడిట్లు అన్నీ కూడి మొత్తం క్రెడిట్లతో భాగిస్తే చివరి సీజీపీఏ వస్తుంది. మనకొచ్చిన బ్రాంచితో సంతృప్తి చెందనివారికి బ్రాంచి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్లాసులో టాప్‌ 2% సీజీపీఏ స్కోరులో ఉండాలి.

విఫలమైతే పీడకలే
బ్యాక్‌లాగ్స్‌- ఐఐటీయన్‌ జీవితంలో భయోత్పాతం కలిగించే సంగతి ఇది. బ్యాక్‌లాగ్‌ లేకపోతే జీవితం ఇక్కడ సాఫీగా నడిచిపోతుంది. కానీ ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యావంటే అది ఒక పీడ కల అయిపోతుంది. బ్యాక్‌లాగ్‌ అసలేవీ లేకపోతే ఉపయోగమా అంటే అదీ కాదు. ఒక సబ్జెక్టులో ఉత్త D తో పాసైతే ఉపయోగం ఉండదు. D అంటే 10కి 4 సీజీపీఏ వచ్చినట్లు లెక్క. ప్లేస్‌మెంట్‌ దొరకాలంటే కనీసం C+ తెచ్చుకోవాల్సి ఉండగా, ఏ బ్యాక్‌లాగూ లేకుండా ఉత్త D తెచ్చుకుంటే ఫలితం ఏముంటుంది గనక?

చివరగా- మిమ్మల్ని కేవలం జేఈఈ పరీక్షకు మాత్రమే కాకుండా ఐఐటీ జీవితానికి కూడా తయారుకమ్మని నా సలహా. ఒక టర్మ్‌లో మీరు ఏమైనా చెయ్యండి. ఏమి చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. కనీసం పరీక్షలకు ఒక వారం ముందు చదవటం మొదలుపెట్టినా B కానీ B+ కానీ తెచ్చుకోవచ్చు. అలాగే ఐఐటీలో ఏ బ్రాంచి అయినా మంచిదే అనేది అపోహ మాత్రమే. పాత ఎన్‌ఐటీల్లో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో సీటు వస్తే గనక అది ఐఐటీల్లో చిన్న బ్రాంచి కంటే చాలా మెరుగు.

నా అభిప్రాయాలు మీలో కొంతమందికైనా ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తూ... సెలవ్‌.