ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 31 December 2012

మంచి ర్యాంకు సాధించేదెలా? .. యండమూరి వీరేంద్రనాథ్ సూచనలు!



విద్యార్థులకు రానున్నది పరీక్షా సమయం! కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగ నియామకం పొందాలన్నా రాతపరీక్షలకు సిద్ధం కావాల్సిందే! ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్‌ సర్వీసుల వంటివి లక్ష్యంగా పెట్టుకునేవారు సుదీర్ఘకాలం పఠనం సాగించగలగాలి. మంచి మార్కులకైనా, మేటి ర్యాంకులకైనా శ్రద్ధగా చదవటం ముఖ్యం. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొనే వాస్తవ సమస్యలేమిటి? వాటిని తొలగించే ఆచరణాత్మక సూచనలేమిటి? 

ప్రసిద్ధ రచయితా, వ్యక్తిత్వ వికాస నిపుణుడూ యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం!


విజయం సాధించడం అంటే కష్టపడటం కాదు. కొన్ని అయిష్టమైన విషయాల్ని ఇష్టాలుగా చేసుకోవడం!
ఒక విద్యార్థి చదువుకోవాలి. అదే సమయానికి టీవీలో సినిమా వస్తూంది. సినిమా ఇష్టం. చదువు అయిష్టం! అయిష్టాన్ని ఇష్టం చేసుకోవటం కష్టమయినపుడు చదువు కష్టమవుతుంది.

పొద్దున్న ఎనిమిదింటికి లేవడంకన్నా ఆరింటికి లేచి వాకింగ్‌ చేస్తే బావుంటుంది. ఆ విషయం తెలుసుకోవడమే విజయం! అప్పుడు... చేస్తున్న పనే గొప్ప తృప్తిని కలిగిస్తుంది. అప్పుడిక 'విజయం' కష్టం అవదు. ఇష్టం అవుతుంది.

తెలివీ... మార్కులూ
తెలివైన విద్యార్థి తగినంత ప్రయత్నం చేయక మంచి మార్కులు పొందకపోవచ్చు. అలాగే మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి తెలివైనవాడు కాకపోవచ్చు; కేవలం కష్టపడి చదివేవాడైవుండొచ్చు.

గణితం, అకౌంట్స్‌ చదవాలంటే తెలివితేటలుండాలి. జంతుశాస్త్రం, మెడిసిన్‌ చదవటానికి కృషి, జ్ఞాపకశక్తి అవసరం. ఈ చిన్నపాటి వాస్తవం గుర్తించక చాలామంది విద్యార్థులు తాము ఏ రంగాల్లో పైకొస్తారో గ్రహించక వేరే ఆకర్షణీయమైన కోర్సులను ఎంచుకుంటుంటారు.

వాయిదా పద్ధతుంది...
చివరి నిమిషం దాకా చదవటం వాయిదా వేసేవారుంటారు. ఈ academic procrastinators 'సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా'మంటూ సాకులు చెప్తుంటారు. ఇలాంటివారికి గది శుభ్రంగా లేదనే చిన్న కారణం చాలు, పుస్తకం పక్కన పడెయ్యటానికి!

ఇలాంటి వాయిదా మనస్తత్వాన్ని తొలగించుకోవటానికి కొన్ని కిటుకులు:

* ప్రతిభావంతుల సాహచర్యంలో ఉండండి. మీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని గమనిస్తూ వారికి ప్రేరణ ఎలా వస్తోందో అవగాహన చేసుకోండి.

* విజయం రుచి తెలిస్తే బద్ధకం పారిపోతుంది. ఒక ఫస్ట్‌ ర్యాంకర్‌ తన స్థాయిని ఎలా నిలబెట్టుకుంటాడంటే... ఉపాధ్యాయుల అభినందనలతో, తల్లి మౌన ప్రశంసతో, తండ్రిలో కనపడే I am proud of youభావంతో!

* ఒక సబ్జెక్టును చదివాక, కాస్త విరామం తీసుకుని మరో సబ్జెక్టుకు మారటం వల్ల చాలా తాజాగా ఉండొచ్చు. చదవటం విసుగనిపిస్తే రాయండి. చరిత్రతో విసిగిపోతే దాన్ని మార్చి, గణితం సాధన మొదలుపెట్టండి (గ్రూప్స్‌, సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులు).

ఆహ్లాదకర వాతావరణం
ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తగ్గించేస్తుంది. మన జ్ఞానేంద్రియాలు సౌకర్యంగా ఉన్నపుడు మనం మరింత విశ్రాంతి అనిపిస్తుంది. అందుకే...

కళ్ళు: టేబుల్‌ లైట్‌ కింద చదవండి. ఆకలి లేకపోయినా వంట గదిలోకి వెళ్ళటం, లేకపోతే 'కొద్ది నిమిషాలు' టీవీ చూడటం (అది అక్కడితో ఆగదు) వద్దు. మరింత విశ్రాంతి కావాలంటే... చదివే గదిలో ప్రపంచ పటం పెట్టుకుని ఆసక్తికరమైన ప్రదేశాలూ, నదులూ, దేశాలను పరిశీలిస్తుండండి.

సువాసన: దుర్గంధం వెదజల్లే డ్రెయినేజి దగ్గర కూర్చుని మీరు చదవలేరు. మల్లెల వాసన నిద్రమత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది. వాసన మనసుపై ప్రభావం చూపిస్తుంది. నా అనుభవంలో సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే అది మెరుగైన మనఃస్థితి (మూడ్‌)ని సృష్టిస్తుంది. దేవాలయ ప్రాంగణంలోని సుగంధం దీనికో ఉదాహరణ.

ఆహారం: రాత్రుళ్ళు చదవదల్చుకున్నపుడు అరటిపళ్ళు, మిఠాయిలు, జంక్‌ ఫూడ్‌, చికెన్‌ తినకూడదు. ఇవి మెదడునుంచి ఆక్సిజన్‌ను జీర్ణవ్యవస్థకు దారి మళ్ళించి నిద్ర కలగజేస్తాయి.

ప్రార్థన: చదవటం మొదలుపెట్టేముందు కొద్దినిమిషాలు కదలకుండా నిలబడాలి. దీన్ని 'మెదడును శుభ్రపరుచుకోవటం' అనొచ్చు. బయటి శబ్దాలు ఇబ్బందిపెడుతుంటే చెవుల్లో దూది/ ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకోండి. చదివేటపుడు సంగీతం వినకపోతే మంచిది. ఒకే సంగీతవాద్యం నుంచి వచ్చే మృదువైన సంగీతం పర్వాలేదు. సాహిత్యంతో ఉన్న పాటలు అసలు వద్దు.

వాతావరణం: అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. గజిబిజి లేని మనసుతో చదువు కొనసాగించండి. అమితాబ్‌, ఐశ్వర్యలను మీరు గుర్తుపెట్టుకోగలిగినపుడు ఆర్కిమెడిస్‌నూ, పైథాగరస్‌నూ కూడా జ్ఞాపకం తెచ్చుకోగలరు!


యాబైశాతం సన్నద్ధత
మెరుగ్గా చదివే అలవాట్లను పెంచుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్టే!
* స్టడీ టేబుల్‌/చాప దగ్గర కొద్ది క్షణాలు నిలబడాలి. కళ్ళు మూసుకుని, ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక కరాటే ఆటగాడు విన్యాసాలకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవుతాడో.. అలాగన్నమాట! మెదడు అనే పలకను శుభ్రం చేయటం లాంటిదిది. మొదట్లో ఇది ఆచరణకు అనుకూలం కాదనిపిస్తుంది. ఓపికను పరీక్షిస్తుంది. దీన్ని మూడు నాలుగు వారాలు సాధన చేస్తే, చక్కని ఫలితాలు ఉంటాయి.

* రాత్రివేళ మీ రీడింగ్‌ టేబుల్‌ దగ్గర అవసరమైన అన్ని వస్తువులూ... పుస్తకాలు, నీళ్ళు లాంటివి పెట్టుకోవాలి. లేకపోతే వీటికోసం వెతకటానికి విలువైన మీ ప్రభాత సమయం వృథా అవుతుంది.

* చదివేటపుడు గది తలుపులు మూసివేయండి. ఏకాగ్రత తగ్గినపుడు పుస్తకంకేసి చూస్తూ అలాగే ఉండిపోకుండా, పుస్తకాన్ని పక్కన పెట్టండి. తాజా గాలి పీల్చుకుని, గదిలోనే పచార్లు చేయండి... చదవటమే ఈ పచార్లకంటే మెరుగనిపించేదాకా!

* ఏదో ఒక సాకుతో చదువుకోవటం వాయిదా వేయాలనే కోరిక సగటు విద్యార్థిలో సాధారణంగా కనిపించే ధోరణి. అందుకే ఆసక్తికరమైన సబ్జెక్టుతో ప్రారంభించి నిస్సారంగా తోచే సబ్జెక్టును ఆ తర్వాత చదవండి. నాన్‌ డీటెయిల్డ్‌ కథతో మొదలుపెట్టి, కష్టమైన సబ్జెక్టులోకి వెళ్ళటంలాంటిది ఇది. చదవటం విసుగనిపిస్తే రాయండి. లేకపోతే గణితం సాధన చేయండి. రెండు ఆసక్తికరమైన సబ్జెక్టుల మధ్య ఒక అనాసక్తికరమైన సబ్జెక్టును చదవటం మంచిది.

* కష్టమైన కెమిస్ట్రీ ఫార్ములాలూ, ఫిజిక్స్‌ సూత్రాలూ గోడమీద అంటించుకోండి. (ఇతర సబ్జెక్టులవారు ఆ సబ్జెక్టులకు సంబంధించినవి). వాటిని అప్రయత్నంగానే గమనిస్తుంటారు కదా? కొద్దిరోజలుకే మీకు తెలియకుండానే అవన్నీ మీకు వచ్చేసినట్టు గ్రహించి ఆశ్చర్యపోతారు. ప్రపంచ పటాన్నో, దేశ/రాష్ట్ర పటాన్నో గోడకు వేలాడదీయండి. విశ్రాంతి తీసుకోవటానికి (రిలాక్స్‌) మ్యాపులను పరిశీలించటం ఓ చక్కని చిట్కా.

* ఆ రోజుకు చదవాల్సింది పూర్తిచేసినపుడు మీకు మీరే ఓ కానుక ఇచ్చుకోండి. ఉదా: 'ఈరోజు దీన్ని చదవటం పూర్తిచేస్తే రేపు సినిమాకు వెళ్తాను'.... ఇలా. ఎలాంటి పెండింగ్‌ లేకుండా, చదివే పోర్షన్‌ని పూర్తిచేసినప్పుడు... ఆ భావంతో నిద్రపోవటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరే వూహించుకోండి.

* విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తమకిష్టమైన సబ్జెక్టులు చదవటానికే కేటాయిస్తుంటారు. తాము కష్టంగా భావించేవాటికి కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.

* కేవలం చదువుకోవటానికి ఒక నిర్దిష్ట ప్రదేశం పెట్టుకోండి. కొంతకాలానికి చదవటం మీ స్వభావంలో భాగమైపోతుంది. మీరెప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్నా నేరుగా చదువులోకి ప్రవేశించగలుగుతారు.

* గ్రంథాలయాల్లోనూ, ఒంటరిగానూ చదివే అలవాటు పెంచుకోండి. పోచుకోలు కబుర్లకు అవకాశమున్న కంబైన్డ్‌ స్టడీ అంత ఉపయోగకరం కాదు.

* ఒక సబ్జెక్టును పూర్తిచేశాక, వెంటనే మరోటి మొదలుపెట్టొద్దు. ఐదు నిమిషాల విరామం ఇవ్వండి. దీన్ని 'మైండ్‌ హాలీడే' అంటారు.

* సబ్జెక్టులో సందేహాలు వస్తే వెంటనే తీర్చుకోవాలి. చిన్న అనుమానమే ముందుకు వెళ్తున్నకొద్దీ పెద్దసమస్యగా పరిణమించవచ్చు.

* ప్రతిరోజూ పుస్తకాలు చదవండి. సెలవు రోజు కూడా. సెలవులకు మీ తాతగారి వూరికి వెళ్ళినపుడు కూడా. కనీసం అరగంటైనా చదవాలి. ఇలా చేస్తే చదవటం మీ అభిరుచిగా మారుతుంది. అలాంటపుడు పరీక్షల ముందు గంటలకొద్దీ- విరామం లేకుండా చదివే అవసరం రాదు.


ఏం చదివినా గుర్తుండటం లేదా? 
సమయం సరిపోదు.. ఎందుకని? 
ఏకాగ్రత కుదరటం లేదా? ...

www.eenadu.net లో చదువు విభాగం  చూడండి.

Monday 17 December 2012

మార్పులకు తగ్గ వ్యూహం!


గ్రూప్‌-2 కార్యనిర్వాహక పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగార్థులకు కొత్త సవాలు ఎదురయింది. రెండు పరీక్షలు రాయాల్సిరావటమే కాదు; ప్రధాన పరీక్ష లక్ష్యాత్మక (ఆబ్జెక్టివ్‌) పద్ధతి నుంచి వివరణాత్మక (డిస్క్రిప్టివ్‌) విధానంలోకి మారిపోయింది. ఈ మార్పులకు తగిన వ్యూహం రూపొందించుకోవటం తక్షణ కర్తవ్యం!
ప్పటివరకూ గ్రూప్‌-1 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్‌-1 (ఎ)గా; గ్రూప్‌-2 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్‌-1 (బి)గా మారుస్తున్నట్లు (జీవో ఎంఎస్‌ నంబర్‌ 622) ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రూప్‌-1 రాతపరీక్ష ద్వారా ఎంపిక జరిగే ఉద్యోగాల పరిధి బాగా విస్తృతమయింది. కానీ ఇప్పటివరకూ గ్రూప్‌-2పై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు డీలా పడ్డారు.మారిన పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధత వ్యూహాన్ని మార్చుకోవాలంటే ఈ పరీక్షల స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి.ఏ రకమైన డిగ్రీ అయినా శ్రేణి, శాతంతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులైతే దరఖాస్తుకు అర్హులే.

కొత్త అభ్యర్థులు
గత పరీక్షానుభవం లేకపోయినా కొత్త అభ్యర్థులు ప్రతి నోటిఫికేషన్లోనూ భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. 2008, 2011 నోటిఫికేషన్లలో తొలిసారే పరీక్ష రాసినప్పటికీ 50 శాతానికి పైగా ఉద్యోగాలను వారే సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరీక్షా విధానం, మారుతున్న ప్రశ్నల ధోరణి సీనియర్‌, జూనియర్‌ల మధ్య పెద్ద తేడాను సృష్టించటం లేదు. అందువల్ల కొత్త అభ్యర్థులు సైతం గ్రూప్‌-1 ఉద్యోగానికి ధీమాగా ప్రయత్నించొచ్చు.
* సన్నద్ధత సమయంలో 2/3 వంతు సమయాన్ని ప్రిలిమినరీకి కేటాయించాలి. పరీక్షకు నెలరోజుల ముందునుంచీ 100 శాతం సమయం ప్రిలిమినరీకి కేటాయించాలి.

* ఇప్పుడే ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే మిగిలిన 1/3 వంతు సమయాన్ని మెయిన్స్‌లో కనీసం 3 పేపర్లకు కేటాయించాలి.

* 'ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌ సన్నద్ధత' ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా అనుసరణీయం.

* బీటెక్‌/ గణిత నేపథ్యం ఉన్నవారు పేపర్‌-1,2,3,4 లను ఇప్పటినుంచే ప్రిలిమినరీతో కలిపి చదవటం మంచిది.

* ఆర్ట్స్‌ నేపథ్యమున్న అభ్యర్థులు పేపర్‌-1,4,5లపై బాగా దృష్టి పెట్టవచ్చు.

* ముఖ్యంగా వ్యాసరచన (పేపర్‌-1) కృషిని ఇప్పటినుంచే మొదలుపెడితే మిగిలిన పేపర్లలో వ్యాస సంబంధిత అంశాలను ఎలా అనుసంధానించుకోవచ్చో అర్థమవుతుంది. ఫలితంగా గ్రూప్‌-1 స్థాయికి తగిన భావనల పునాది ఏర్పడి 250-300/750 మార్కులకు సిద్ధమైనట్లే!

గ్రూప్‌-2 నుంచి గ్రూప్‌-1కి మారేందుకు మెలకువలు
* గ్రూప్‌-2 ప్రిపరేషన్లో భాగంగా జనరల్‌స్టడీస్‌ (పేపర్‌-1) చదివేవుంటారు కాబట్టి ప్రస్తుతం ప్రిలిమినరీ గురించి ఆలోచించవద్దు. ఈ పరీక్షకు 45 రోజుల ముందునుంచి చదివితే సరిపోతుంది.

* ప్రస్తుత సమయాన్ని మెయిన్స్‌ సన్నద్ధతకు వినియోగించండి.

* ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనిస్తే ప్రిపరేషన్‌ని ఎలా కొనసాగించాలో దిశానిర్దేశం ఏర్పడుతుంది. అందుకే 2008, 2011, 2012 సంవత్సరాల ప్రశ్నపత్రాలను ఒకసారి పరిశీలించండి.

* మెయిన్స్‌ 2,3,4 పేపర్లలోని ఒక మార్కు ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన (2,3,4 మార్కుల) ప్రశ్నలను గ్రూప్‌-2 స్థాయిలో తయారైన అంశాల ద్వారా ఎదుర్కోవచ్చు. ఇలాంటి వ్యూహంతో విజయానికి కావాల్సిన 65 శాతంలో 30 శాతం మార్కులు సాధించవచ్చని గమనించాలి.
ఉదా:
1. భారతదేశ దేవాలయ నిర్మాణ శైలికి ఉదాహరణలు?
2. భారతదేశ ఎన్నికల సంఘ అధికారాలు, విధులు?
3. సంస్కరణల అమలు అనంతరం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల సాపేక్ష వాటాలు
4. ఏపీ చిన్నతరహా పరిశ్రమల సమస్యలు
5. టెలి మెడిసిన్‌ అంటే?
6. కార్డోశాట్‌-2 రిజల్యూషన్‌ ఎంత?
7. అణుశక్తి నిర్వచనం
8. సామాజిక అడవులు- ఉపయోగం

* మెయిన్స్‌లో అనేక ప్రశ్నలకు సరైన జవాబులు రాయాలంటే ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) తెలిసుండాలి. వీటిపై పట్టున్న అభ్యర్థులే గతంలో కూడా రాణించారు. ఇప్పటివరకూ గ్రూప్‌-2 కోసం సిద్ధమైన ప్రాథమికాంశాలు ఇక్కడ బాగా ఉపయోగపడతాయి.

గ్రూప్‌-1 సీనియర్‌ అభ్యర్థులు
* గతంలో కూడా చాలామంది సీనియర్‌ అభ్యర్థులు ప్రిలిమినరీ కూడా పాసవని సందర్భాలున్నాయి. గ్రూప్‌-2 వారు 'ప్రాక్టీస్‌' కోసం ప్రిలిమినరీ రాయటం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం. గత గ్రూప్‌-2 అభ్యర్థులు ఇప్పుడు శ్రద్ధగా గ్రూప్‌-1 రాస్తారు కాబట్టి ప్రిలిమినరీ గట్టెక్కటం మరింత క్లిష్టంగా మారనుంది. అందుకు తగిన రీతిలో సిద్ధపడాలి.

* మెయిన్స్‌లో చేసిన తప్పిదాలను గతానుభవాలతో సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వస్తోంది. ప్రిలిమినరీకి రోజూ 2 గంటల సమయం కేటాయించి మెయిన్స్‌పై శ్రద్ధ పెట్టండి.

గ్రూప్‌-1 ఉద్యోగార్థులందరికీ...
* ప్రతిరోజూ వార్తాపత్రికల అధ్యయనం గ్రూప్‌-1లో రాణించేందుకు బాగా ఉపయోగపడుతుంది. 2012 గ్రూప్‌-1లో దినపత్రికల అధ్యయనం ద్వారా దాదాపు 280 మార్కులకు జవాబులు రాయగల్గిన పరిస్థితి ఏర్పడింది.

* సమాధానాలను సంక్షిప్తీకరించటం/ విపులీకరించటం చేయగల సామర్థ్యాలున్నవారు ఎగ్జామినర్లను మెప్పించగలుగుతున్నారు. తద్వారా ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారు.

* ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి సమయం కేటాయింపు ఉండాలి. పేపర్‌-2,3,4లలో సమయం చాలని సమస్య ఎదురవుతోంది. వీలైనన్ని నమూనా ప్రశ్నలను సమయ నియంత్రణతో రాయటం ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి.

* చాలామంది జిరాక్స్‌ నోట్సులూ, కోచింగ్‌ నోట్సులూ బట్టీ పడుతున్నారు. ప్రశ్న తీరు మారగానే జవాబు రాయలేకపోతున్నారు. సిలబస్‌లో ప్రతి అంశాన్నీ సమాజానికి అన్వయించటం, దాన్ని సమాధానంలో పొందుపర్చటం ముఖ్యం.

* ఒక పేపర్‌ ముఖ్యం, మరోటి అంత ముఖ్యం కాదు- ఇలాంటి భావనలు పెంచుకోకుండా అన్ని పేపర్లలోనూ సగటు మార్కుల కంటే కనీసం 5 మార్కులు (ఒక్కో పేపర్‌లో) తెచ్చుకుంటే విజయం తథ్యం!


స్త్థెర్యంతో సాగాలి

గ్రూప్‌-2 పరీక్షకు మాత్రమే సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రూప్‌-1 అభ్యర్థులతో సమానంగా పోటీపడలేమనీ, గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులన్నీ గ్రూప్‌-1 అభ్యర్థులే దక్కించుకుంటారనీ భయపడుతున్నారు. ఇది వాస్తవమే. కానీ పరీక్షకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా తయారై, గ్రూప్‌-1 పోస్టులనే సాధించగలమనే స్త్థెర్యంతో ముందుకు సాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

గ్రూప్‌-2 అభ్యర్థులంతా పరీక్షా పద్ధతి ఎలా ఉన్నా ముందుగా పాత పద్ధతిలోని మూడు పేపర్లకు సంబంధించిన సబ్జెక్టులన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేయాలి. దీంతో వారు గ్రూప్‌-2 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షను విజయవంతంగా రాయగలుగుతారు. ఆ తర్వాత ఇదే ప్రిపరేషన్‌తో సాధించిన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ, క్రమం తప్పకుండా రాయటం సాధన చేస్తే గ్రూప్‌-1 (ఎ) పోస్టు గానీ, గ్రూప్‌-1 (బి) పోస్టు గానీ సాధించే వీలుంటుంది.

వెయ్యి పోస్టులు
ఏపీపీఎస్‌సీ గత నోటిఫికేషన్లను గమనిస్తే గ్రూప్‌-1 పోస్టులు 300 ఉంటే గ్రూప్‌-2 కార్యనిర్వాహక పోస్టులు 600కు పైగా ఉంటాయి. అంటే ఒకేసారి, ఒకే పరీక్ష ద్వారా దాదాపు వెయ్యి పోస్టులకు పోటీ పడే అవకాశం! సరైన పంథాలో సిద్ధమైతే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు.

అంతే కాకుండా గ్రూప్‌-2 ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపితే గ్రూప్‌-1 పోస్టు పొందే అవకాశమూ ఉంటుంది. అంటే ఆశించినదానికంటే ఎన్నో రెట్లు అధిక ఫలితం సాధించే వీలు!


గ్రూప్‌-1 సన్నద్ధత అంటే ఆల్‌ఇన్‌వన్‌
ప్రణాళికాబద్ధంగా గ్రూప్‌-1 పరీక్షకు సన్నద్ధమైతే ఆల్‌ ఇన్‌ వన్‌ లాగా గ్రూప్‌-1 (ఎ), గ్రూప్‌-1 (బి), గ్రూప్‌-2 పరీక్షలన్నిటికీ సిద్ధమవుతున్నట్లే! ఎందుకంటే- ఇప్పుడు మార్చిన పద్ధతి ప్రకారం గ్రూప్‌-2 పరీక్ష నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లోని మూడు పేపర్లకు నిర్దేశించిన సిలబస్‌ మొత్తం గ్రూప్‌-1 (ఎ), (బి) పరీక్షకు సంబంధించిన మెయిన్‌ పరీక్షలో ఉంటుంది. అందుకే సిలబస్‌లోని సబ్జెక్టులను క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర, భారత రాజ్యాంగం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలపై పట్టు సాధించవలసిందే!

మెయిన్‌ పరీక్షలో 15 ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలను మూడు గంటల్లో రాయాల్సివుంటుంది. అందుకని ఇప్పటినుంచే రాయటం సాధన చేయాల్సివుంటుంది. గంటకు వెయ్యి పదాల చొప్పున 3 గంటల్లో 3,000 పదాలు రాయాలి.పద్ధతి కొత్తదైనా, పాతదైనా సాగించాల్సిన ప్రిపరేషన్‌ తీరు ఒకటే. పటిష్ఠమైన ప్రణాళిక, పట్టుదల, కృషి. వీటికి ఆత్మస్త్థెర్యం, ఉత్తమ మార్గదర్శకత్వం తోడైతే లక్ష్యం నెరవేరటంలో సందేహమే ఉండదు.

Monday 10 December 2012

'నీట్‌' పరీక్షలో గెలుపు సులువే!





మార్పు అనివార్యమైనపుడు దానికి తగ్గట్టుగా మనల్ని మల్చుకోకతప్పదు. సానుకూలవైఖరితో ముందడుగు వేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. 2013లో సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే ఎం.పి.సి., బై.పి.సి. విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పూర్తిమార్పులు చోటు చేసుకున్నాయి. ఎం.పి.సి. విద్యార్థులకు జేఈఈ- మెయిన్స్‌ మాదిరిగానే బై.పి.సి. వారికి 'నీట్‌' రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్పును తల్చుకుని బెంబేలుపడకుండా మంచి ర్యాంకు సాధనకు దీక్షతో సమాయత్తం కావాలి!


ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రభుత్వ, 25 ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో 5600 మెడికల్‌ సీట్లూ; మూడు ప్రభుత్వ, 18 ప్రయివేట్‌ డెంటల్‌ కళాశాలల్లో 1790 సీట్లూ ఉన్నాయి. అంటే మెడికల్‌, బీడీఎస్‌లతో కలిపి 7390 సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచి 'నీట్‌'లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారన్నమాట.
అయితే ఇప్పటికీ చాలామంది 'నీట్‌ ఉందా? ఎంసెట్‌ ఉందా? లేదా రెండూ ఉన్నాయా?' అనే సందిగ్ధంలో ఉన్నారు. రెండు పరీక్షలు జరిపే అవకాశమే లేదు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఒకే పరీక్ష ఉంటుంది. అయితే అది 'నీట్‌' అవడానికే అవకాశం ఎక్కువ!

ఎందువల్లనంటే- మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 2010లోనే దేశంలోని మెడికల్‌ కళాశాలలన్నిటికీ ఒకే ప్రవేశపరీక్ష జరగాలని ఒక స్పెషల్‌ గెజిట్‌ విడుదల చేసింది. (గెజిట్‌ నెం. MCI-31(1)/2010_Med/49068, dated 21.12.2010). దాన్ని అనుసరించి 2012లోనే ఉమ్మడి జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది.

అయితే వివిధ రాష్ట్రాలు 2012లో విద్యార్థులు సంసిద్ధం తయారుకాలేరని అభ్యంతరం చెప్పటం, కొన్ని సాంకేతిక కారణాల వల్లా మళ్ళీ ఒక స్పెషల్‌ గెజిట్‌ విడుదల చేశారు. పరీక్షను 2013 నుంచి జరుపుతామని నిర్ణయించారు. (గెజిట్‌ నెం.MCI-31(1)/2010_Med/62051, dated 15.02.2012). ఈ రెండు గెజిట్‌ల ఆధారంగా మెడికల్‌ కౌన్సిల్‌ 2013లో ప్రవేశపరీక్ష జరిపే దిశలో విధివిధానాలతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో పరీక్ష జరగడానికే అవకాశాలు అధికం. పరీక్ష తెలుగులో జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఎటువంటి మానసిక ఒత్తిడీ లేకుండా పరీక్షకు తయారుకావచ్చు.

ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే వాటినుంచి తయారీ విధానం గురించి ఆలోచించుకోవచ్చు.

 ఆన్‌లైన్‌ దరఖాస్తు
ఈ పరీక్షకు డిసెంబర్‌ 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు భర్తీ చేయాలి. దీనికోసం www.cbseneet.nic.inఅనే వెబ్‌పేజీని ఓపెన్‌ చేసి మొదటగా నమూనా దరఖాస్తును ప్రింట్‌ తీసుకోవాలి. దాన్ని నింపి, దాని ఆధారంగా మళ్ళీ ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తే తప్పులు చేసే అవకాశం ఉండదు.

నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు భర్తీ చేసిన తర్వాత దాన్ని A5 పేపరుపై ప్రింటు తీసుకోవాలి. వీటిని మూడు నుంచి ఐదు కాపీల వరకు ప్రింటు తీసుకొని వాటిపై ఫొటోగ్రాఫ్‌ అంటించి అటెస్టేషన్‌ చేయించాలి. ఫొటోగ్రాఫు నవంబరు ఒకటో తర్వాత తీసినదై ఉండాలి. ఫొటోగ్రాఫ్‌ కింద విద్యార్థిపేరు, ఫొటోతీసిన తేదీ ప్రింటు అయి ఉండాలి. ఆ ఫొటోగ్రాఫ్‌ని అంటించిన తర్వాత సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌/ గెజిటెడ్‌ ఆఫీసర్‌ చేత దానిపై సంతకం చేయించాలి. మిగిలిన సంతకాలు కూడా పూర్తిచేసి CBSE ఆఫీస్‌కు పంపించవలసి ఉంటుంది. ముందుగా ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేస్తే ఇక పూర్తిగా పరీక్షకు తయారయ్యే విధానంపైనే దృష్టి సారించవచ్చు.





సంసిద్ధమయ్యే విధమెలా?
ఎంసెట్‌కూ, నీట్‌కూ ఉన్న తేడాలు గమనించాలి. ఎంసెట్‌లో 160 ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించవలసి ఉంటుంది. నీట్‌లో 180 ప్రశ్నలుంటాయి. ఈ 180 ప్రశ్నలు మూడు సమవిభాగాలుగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల్లో 60 ప్రశ్నల చొప్పున ఉంటాయా లేదా బయాలజీ (బోటనీ + జువాలజీ) 90 ప్రశ్నలు, ఫిజిక్స్‌ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉంటాయా అనేది ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అయితే CBSE PMT పరీక్షలో 200 ప్రశ్నలు (50X4) ఉంటున్నాయి కాబట్టి 45 X4 అంటే బోటనీ 45, జువాలజీ 45, ఫిజిక్స్‌ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉండే అవకాశం ఎక్కువ.
ఎంసెట్‌ కంటే అదనంగా 20 ప్రశ్నలు పెరుగుతున్నందున పరీక్షలో వేగం కొంత పెంచుకోవాలి. అయితే జాతీయస్థాయి పరీక్షల్లో మనరాష్ట్ర ఎంసెట్‌ కంటే భౌతిక, రసాయనశాస్త్ర పేపర్లు సులభంగా ఉంటున్నాయి కాబట్టి పెద్దగా ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు.

రుణాత్మక మార్కులపై మన రాష్ట్ర విద్యార్థులకు అభ్యాసం లేదు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. జవాబు గుర్తించేటప్పుడు తెలియని ప్రశ్నలకు జవాబులు వదిలివేయడం మేలు. లేదా నాలుగు సమాధానాలను స్పష్టంగా చదివి; కనీసం రెండు జవాబులు ఆ ప్రశ్నకు వర్తించవని భావిస్తే మిగిలిన రెండింట్లో ఒకదాన్ని గుర్తించడానికి ఛాన్స్‌ తీసుకోవచ్చు. అంతేకానీ ఏమీ తెలియకుండా జవాబు గుర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.

1) రుణాత్మక మార్కులు ఉన్నాయి 2) ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఈ రెండు అంశాలనూ అధిగమించాలంటే ఎక్కువసార్లు పునశ్చరణ చేయాల్సిందే. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాయాలి.

సిలబస్‌లో వ్యత్యాసాలు
మన విద్యార్థుల పరంగా చూస్తే- నీట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో దాదాపు తేడా లేదనే చెప్పాలి. కానీ జీవశాస్త్రం (బయాలజీ)లో వ్యత్యాసం చాలా ఉంది. జాగ్రత్తపడవలసిన ఓ అంశం- ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్‌ మార్కు సాధిస్తేనే ర్యాంకు పొందే అవకాశం ఉండటం.

మన ఎంసెట్‌లో సీటు సాధించడానికి ఇటువంటి కనీసమార్కు లేదు కాబట్టి బయాలజీ, కెమిస్ట్రీ చదువుకొని కూడా ర్యాంకు సాధించగల్గుతున్నారు. అంటే బయాలజీలో 75 మార్కులు, కెమిస్ట్రీలో 35 మార్కులు సాధించి ఫిజిక్స్‌లో 2 లేదా 3 మార్కులు సాధించినవారు కూడా మెడికల్‌లో చేరే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్‌ మార్కు సాధించాలి కాబట్టి మూడు సబ్జెక్టులకూ సమప్రాధాన్యం ఇచ్చి తయారుకావాలి.

మన రాష్ట్రవిద్యార్థులకు సీట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌ విద్యార్థులు నేషనల్‌పూల్‌లో లేరు కాబట్టి ఈ రాష్ట్రాల్లో నూరు శాతం సీట్లు అదే రాష్ట్ర విద్యార్థులతోనే నింపుతారు. అంటే ఎంసెట్‌ స్థానంలో నీట్‌ జరుగుతుంది. సీట్లు నింపే పద్ధతీ, సీట్ల సంఖ్యా గతంలో మాదిరే ఉంటుంది. అయితే మన రాష్ట్రవిద్యార్థులు ఇతర డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోని ప్రయివేట్‌ కళాశాలలో కేటగిరి-సి సీట్లనూ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అదనంగా 300 వరకూ సీట్లు లభ్యం అవుతాయి.

'నీట్‌' మన రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు- ఈ ఐదు కేంద్రాల్లో మే 5న జరుగుతుంది. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో డైరక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పర్యవేక్షణలో జరుగుతుంది.
- పి.వి.ఆర్.కె. మూర్తి

(కటాఫ్ పర్సంటైల్ అంటే?   పునశ్చరణ అవసరం ఏమిటి?... వీటి కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.)

Saturday 8 December 2012

సివిల్స్‌ సమరానికి విభిన్న అస్త్రాలు




సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీలోని మొదటి పేపర్‌ పోటీపరీక్షలన్నిటిలోనూ సాధారణంగా కనపడేదే. ఈ సర్వీసుకు తగిన అభిరుచి అభ్యర్థుల్లో ఎంతమేరకు ఉన్నదో పరీక్షించేది రెండో పేపర్‌. ప్రిలిమినరీ విజయసాధనలో ఈ పేపర్‌ పాత్ర కీలకంగా మారింది. ఈ పేపర్‌ స్వభావం, తీరులను విశ్లేషిద్దాం!


విభిన్న పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను అంచనా వేసే రెండో పేపర్‌కు పకడ్బందీగా సిద్ధమవటం తప్పనిసరి. లేకపోతే మంచి స్కోరు సాధ్యం కాదు. ఏడు రకాల విభాగాలుండే ఈ పేపర్‌లో మొత్తం ప్రశ్నలు 80. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు.

ఒక్కో విభాగాన్ని ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టారో, సంసిద్ధమెలా అవాలో పరిశీలిద్దాం.

కాంప్రహెన్షన్‌

పాలనలో భాగస్వామిగా ఉండే అధికారి తన విధులు సక్రమంగా నిర్వర్తించాలంటే అవగాహన శక్తి ముఖ్యం. ఒక నిర్దిష్ట పరిస్థితిలోని ముఖ్యాంశాలను గుర్తించి విశ్లేషించగల సత్తా, తగిన నిర్థారణకు వచ్చే విజ్ఞతా ఉండాలి. నివేదికలూ, సమాచారం పరిశీలిస్తూనే కార్యాచరణకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగం ఈ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అభ్యర్థులకు 2-3 పేరాగ్రాఫులు ఇచ్చి బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌) ప్రశ్నలకు జవాబులు రాయమంటారు.

ఇంటర్‌ పర్సనల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
పాలనాధికారుల విధుల్లో భావ ప్రసారానికి (కమ్యూనికేషన్‌) ప్రాముఖ్యం ఉంది. బృందంలో పనిచేయటం పెరిగిన ప్రస్తుత కాలంలో ఈ నైపుణ్యాలు పెంచుకుంటేనే విజయానికి దగ్గరవుతాము. ఉద్యోగుల్లో నిబద్ధత, పని సామర్థ్యం మెరుగుపరచటానికి సమర్థమైన భావప్రసారం చేయగలగాలి. ఆత్మవిశ్వాసం, సంబంధాల మెరుగుదల, ఇతరులకు ఆమోదయోగ్యమవటం... ఇవన్నీ సమర్థ కమ్యూనికేషన్‌ వల్లనే సాధ్యం. సివిల్‌ సర్వెంటుకు ఇది చాలా కీలకం.

ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరం జరిగే భావాల ప్రసారాన్నే ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలంటారు. భిన్న పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులతో తగిన విధంగా వ్యవహరించి ప్రజలు నిశ్చింతగా ఉండేలా చేయగలగాలి. ఆలకించటం, మాట్లాడటం, ఘర్షణను నివారించటం- ఇవి ఈ నైపుణ్యాలతో సాధించే సాధారణ ఫలితాలు.

ఈ విభాగంలో ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు.
ఉదా:1. How would you best console a bereaved person?

a) Do not talk about the dead person for fear of causing pain. b) Give him a sedative on a regular basis after consulting a doctor. c) Instead of speaking give him a sympathetic touch. d) Offer help with the practical tasks and be prepared to listen. (Answer) 

లాజికల్‌ రీజనింగ్‌, ఎనలిటికల్‌ ఎబిలిటీ
ఆలోచనల పనితీరుపై ఆధారపడి మనుషులను మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. 1) సరిగా, పొందికగా ఆలోచించలేనివారు 2) లోకజ్ఞానం, అనుభవం, తెలివితేటలు ఉపయోగించి నెగ్గుకువచ్చేవారు 3) దృఢంగా, తార్కికంగా ఆలోచించి ఇతరులకంటే శక్తిమంతంగా నిర్వహణ చేయగలిగేవారు. ఈ మూడో లక్షణమున్నవారే పాలనాధికారులుగా నేటి అవసరం.

ఈ నైపుణ్యాలను పరీక్షించేలాగానే ప్రశ్నలుంటాయి.

ఉదా:All big dams involve displacement of people and risk of serious harm to the ecology of the region. The claims of pro-big dam enthusiast cannot be sustained in terms of costs and benefits.

Assuming the truth of the passage, one can conclude from it that :

a) No big dam should ever be constructed whatever be the benefits arising out of it. b) All big dams from the very nature of its 'highness'destroy ecology or displace people. c) Big dam should only be undertaken provided it displaces the minimum number of people causes negligible damage to ecology and provide substantial benefits when completed. (Answer ) d) There are abundant alternatives to each water in scarcity areas such a way that , what big dams can offer, the alternatives can provide more efficiently at lesser cost.

డెసిషన్‌ మేకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
ప్రైవేటురంగంలోని ఉద్యోగి తీసుకునే నిర్ణయం కంటే సివిల్‌ సర్వెంట్‌ తీసుకునే నిర్ణయాలు ఎక్కువమంది ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. పరిస్థితుల మంచి చెడులను బేరీజు వేసి, సత్వర నిర్ణయాలు తీసుకోగలగాలి. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలకు ఉపయోగపడాలి. ఇలాంటివారిని గుర్తించటం సివిల్స్‌ నియామకాల లక్ష్యం.

డెసిషన్‌ మేకింగ్‌కు సన్నిహితంగా అనుసంధానమైవుండేది ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌. సివిల్‌ సర్వెంట్లందరూ ఈ నైపుణ్యాలనుపెంపొందించుకునివుండాలి. సమస్యను దాని ఆనుపానులు గ్రహించి, అందులో భాగమైవున్నవారి సహకారంతో పరిష్కరించాలి.

పరీక్షలో ఊహాత్మక సందర్భాలను ఇచ్చి ఈ నైపుణ్యాలను పరిశీలిస్తారు. అత్యుత్తమ నిర్ణయాన్ని ఎంచుకుని, సమాధానంగా గుర్తించాల్సివుంటుంది. నెగిటివ్‌ మార్కులుండవు.

ఉదా:1. You are having dinner with your colleagues. Suddenly one of your colleagues starts choking. What would be your first reaction?

a) Reach for his throat around the voice box with your thumb and forefinger. b) Ask him 'are you choking' and see if he is able to reply. (Answer ) c) Ask him to leave the dining area immediately and go to the rest room. d) Try to help him cough so that the obstruction is cleared.

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ
అందుబాటులో ఉన్న గణాంక సమాచారం ఆధారంగా పాలనాధికారులు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. డేటా విశ్లేషణ ఆధారంగా సరైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాల్సివుంటుంది.

ఈ విభాగంలో ప్రశ్నలు గ్రాఫులు, డయాగ్రమ్‌లు, సంకేతాలతో నిండివుంటాయి. యూపీఎస్‌సీ ప్రకారం మెంటల్‌ ఎబిలిటీ అనేది ఇంటలెక్చువల్‌ ఎబిలిటీ అని గ్రహించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌
సివిల్‌ సర్వెంట్లకు 'ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌' పరిజ్ఞానం తగినంత అవసరమని అందరూ అంగీకరిస్తారు. అభ్యర్థి ఆంగ్ల భాషా నైపుణ్యాలను ఈ విభాగం పరీక్షిస్తుంది. కొన్ని పేరాలు ఇచ్చి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు రాయమని అడుగుతారు. దీనికి సంబంధించి అభ్యాసాలకు పనికొచ్చే మెటీరియల్‌ విస్తృతంగానే లభ్యమవుతోంది.

పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి, తగిన వ్యూహం తయారుచేసుకోవాలి. దాన్ని దీక్షగా అమలుచేయాలి.


-  గోపాలకృష్ణ (డైరెక్టర్ , బ్రెయిన్ ట్రీ) 

(గత రెండేళ్ళ ప్రశ్నపత్రాల విశ్లేషణను eenadu.net చదువు విభాగంలో చూడండి).

Monday 29 October 2012

ఐఐటీ బాటలో మెలకువగా... మెరుగ్గా!

ఐఐటీ ప్రవేశపరీక్షలో 2013లో ప్రవేశ పెడుతున్న మార్పులను తల్చుకుని బెంబేలు పడటం కంటే వాటిని సవ్యంగా అర్థం చేసుకోవాలి. తగినట్టుగా సంసిద్ధమవాలి. ఇదే విద్యార్థుల కర్తవ్యం!
 

‘ఐఐటీ ప్రవేశపరీక్ష కొరకరాని కొయ్యే', 'ఐఐటీల్లో సీటు సాధించటం మరింత కఠినం', 'ఐఐటీ ప్రవేశపరీక్ష అందని ద్రాక్ష'- ఇలాంటి వ్యాఖ్యలు ఇటీవల తరచూ వినపడుతున్నాయి. వీటినిచూసి చాలామంది అధైర్యం పెంచుకుంటున్నారు కూడా. ఇది సరి కాదు. పరీక్ష నిర్వహణలో కొత్త మార్పులు ప్రవేశపెట్టినపుడు వాటిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే అయోమయం, ఆందోళన తగ్గిపోతాయి. పరీక్షను దీటుగా, మెరుగ్గా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసమూ ఏర్పడుతుంది.

ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రవేశపెడుతున్న మార్పులు- పరీక్ష నిర్వహణ పద్ధతిలో జరుగుతున్నవే తప్ప పరీక్ష నమూనాలో కానీ, సిలబస్‌లో కానీ జరుగుతున్న మార్పులు కావు. సబ్జెక్టును క్షుణ్ణంగా చదువుకుని, భావనలపై అవగాహన పెంచుకునే విద్యార్థులు ఈ మార్పుల కారణంగా నష్టపోయేదేమీ లేదు. అందుకని వారు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!

నాటి పరీక్షలే...
ఇంతవరకూ ఉన్న ఏఐఈఈఈ లాగా జేఈఈ-2013 మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది. అలాగే ఇంతవరకూ ఉన్న ఐఐటీ-జేఈఈలాగా జేఈఈ-2013 అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంటుంది. కాకపోతే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ముఖద్వారం (గేట్‌వే) అవుతుంది. ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈలు ఎంతోకాలంగా విద్యార్థులు రాస్తున్న పరీక్షలే కాబట్టి ఇంక ఆందోళన దేనికి?

అయితే ఇంటర్మీడియట్‌ మార్కులకు ప్రాధాన్యం పెరిగిందనేది గమనించాలి. ఈ ఒక్క విషయంలో విద్యార్థులు తగిన జాగ్రత్త తీసుకుంటే ఐఐటీల్లో ప్రవేశం ఏమంత కష్టం కాదు. ప్రవేశపరీక్షలో జరగబోతున్న మార్పులు అర్హతా నిబంధనలకు సంబంధించిన సాంకేతికపరమైనవే కానీ సబ్జెక్టు పరమైనవి కాదు!

ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే...
1) ఇంటర్‌ లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఆ సంవత్సరం ఉత్తీర్ణులైన టాప్‌ 20 పర్సంటైల్‌ విద్యార్థుల్లో ఉండాలి.
2) జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకు సాధించాలి. అంతేకాకుండా మొదటి లక్షా యాబైవేలమందిలో ఒకడవ్వాలి.
3) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ర్యాంకు సాధించాలి.

తుది పరీక్ష అయిన అడ్వాన్స్‌డ్‌లో సాధించే ర్యాంకు ఆధారంగానే సీటును కేటాయిస్తారు. మొదటి రెండూ eligibility conditions గానే ఉంటాయి. అంటే జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు, ఇంటర్‌ మార్కులకు ఐఐటీలో సీటు కేటాయించడంలో ప్రాధాన్యం ఉండదు.

అర్హతా నిబంధనల్లో తేడా
ఈ పరీక్షలన్నిటికీ చదివే సిలబస్‌ ఒకటే అయినా బహుముఖ వ్యూహం అవసరం. ఇక్కడ విద్యార్థులు గమనించదగ్గ విషయం ఏమిటంటే- ఎన్‌ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ; ఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ ఉన్న అర్హత నిబంధనల్లో వ్యత్యాసం!

ఎన్‌ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికి బోర్డు పరీక్షలో టాప్‌ 20 పర్సంటైల్‌ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంస్థల్లో సీటు కేటాయించడం కోసం ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌ మార్కుల వెయిటేజీ నార్మలైజేషన్‌ జరిగిన తర్వాతే ఉంటుంది.

ఐఐటీల్లో సీటు పొందడానికి ఇంటర్‌ మార్కులతో, జేఈఈ మెయిన్స్‌ ర్యాంకుతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. కానీ జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిలో మొదటి లక్షాయాబైవేలమందిలో, ఇంటర్లో ఉత్తీర్ణులైనవారిలో టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి. ఇవీ అర్హతా నిబంధనలు. వీటిని అర్థం చేసుకుని తగిన ప్రిపరేషన్‌ వ్యూహం రూపొందించుకోవాలి.

సబ్జెక్టుపరంగా ప్రాధాన్యం
మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలకు సమ ప్రాధాన్యమే ఉంది. అయితే సబ్జెక్టుపరంగా ఆలోచిస్తే- భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు మన రాష్ట్ర విద్యార్థులకు కఠినంగా ఉంటాయి. అందుకనే వీరు దీనిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది.

గణితం స్కోరింగ్‌ సబ్జెక్టని తెలిసిందే. మంచి ర్యాంకు సాధనకు ఈ సబ్జెక్టును నమ్ముకోవాల్సిందే. మూడో ప్రాధాన్యం రసాయనశాస్త్రానిది. ఎందుకంటే- మిగిలిన రెండు సబ్జెక్టుల్లో ఎక్కువగా కాల్‌క్యులేషన్‌ ఆధారిత ప్రశ్నలుంటే దీనిలో కంటెంట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాల్‌క్యులేషన్లలో పొరపాట్లు జరిగే అవకాశం అధికం. ఇక ఇంటర్‌ పరీక్షలో కూడా టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి కాబట్టి ఈ మూడు సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి.

లాభం... నష్టం
తగిన ప్రతిభా సామర్థ్యాలు లేకున్నా కోచింగ్‌ బలంతోనో, ఊహించి సమాధానాలు రాసి తమ అదృష్టబలంతోనో ఐఐటీల్లో సీటు పొందాలనుకున్న విద్యార్థులకే ఈ మార్పుల వల్ల నష్టం. సబ్జెక్టును చదివే ప్రతిభావంతులకు మాత్రం ఎలాంటి నష్టమూ ఉండదు.

ఐఐటీ-జేఈఈ సన్నద్ధతలో పడి ఇంతవరకూ విద్యార్థులు ఏఐఈఈఈని నిర్లక్ష్యం చేసేవారు. అటు ఐఐటీల్లో సీటు రాక, ఇటు ఏఐఈఈఈ సరిగా రాయక రెండు రకాలుగానూ నష్టపోయేవారు. ఇప్పుడా ప్రమాదం లేదు. ఎందుకంటే ఏఐఈఈఈ (జేఈఈ-మెయిన్స్‌), ఐఐటీ-జేఈఈ (జేఈఈ-అడ్వాన్స్‌డ్‌)కి స్క్రీనింగ్‌ పరీక్ష మారింది. ఇది కూడా విద్యార్థులకు లాభదాయకమే. ఈ మార్పుల వల్ల ఇంటర్‌ మార్కులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీనివల్ల తాము నష్టపోకుండా ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

ఎక్కణ్ణుంచి ఆరంభించాలి?  www.eenadu.net లో చదువు పేజీని చూడండి.

Tuesday 21 August 2012

విదేశాల్లో విద్య, ఉద్యోగాలకు మెలకువలు

    ఇంజినీరింగ్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశించేవారిలో , ఇప్పటికే చదువుతున్నవారిలో చాలామంది అభిలాష- విదేశాల్లో పీజీ చదవాలనీ, అక్కడే ఉద్యోగం సాధించి  స్థిరపడాలనీ! ప్రమాణాలు తీసికట్టుగా ఉంటున్న మన సగటు కళాశాలల్లో చదువుతున్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఏ మెలకువలు పాటించాలి? మార్గం ఎలా సుగమం చేసుకోవాలి ? ఇదిగో మార్గదర్శనం...

కోర్సులో ప్రవేశించిన దగ్గర్నుంచీ డిగ్రీ చేతికందేలోపు మూడు/నాలుగు సంవత్సరాల కాలం తక్కువేమీ కాదు. ఈ వ్యవధిని ఎంత ప్రయోజనకరంగా మల్చుకోగలం అన్నదానిపైనే కెరియర్‌, భావి జీవిత గమనం ఆధారపడివుంటాయి. ప్రవేశపరీక్ష వరకూ బాగా కష్టపడి చదివి కఠినమైన పోటీలో సీటు సంపాదించిన ప్రతిభావంతులైన విద్యార్థులే తర్వాత నిర్లక్ష్యధోరణితో ఫెయిలవుతున్న ఉదంతాలు ఐఐటీల్లో కూడా గమనించవచ్చు. ఈ పరిస్థితిలోకి జారిపోకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలి.


విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే అర్హతలూ, నైపుణ్యాలూ మెరుగైన స్థాయిలో ఉండాల్సిందే కదా! వేరే దేశంలో భిన్న సంస్కృతుల నేపథ్యం ఉన్నవారితో కలిసి పనిచేస్తే అది వృత్తిపరమైన ఎదుగుదలకూ, వ్యక్తిగత వికాసానికీ కూడా ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా కావొచ్చు; శాశ్వతంగా కావొచ్చు- విదేశాల్లో విధుల నిర్వహణ విశిష్ట అనుభవాన్ని సంపాదించిపెడుతుందని అక్కడ ఉద్యోగాల్లో కొనసాగుతున్న నిన్నటి ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఘంటాపథంగా చెపుతున్నారు.

విదేశాల్లో రాణించటానికి తోడ్పడే లక్షణాలేమిటి?

కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు
మనది ఆంగ్లం మాతృభాషగా ఉన్న దేశం కాదు. మన నిత్యవ్యవహారాలన్నీ మాతృభాష సాయంతోనే సజావుగా నడిచిపోతుంటాయి. ఇంగ్లిష్‌ పరీక్షలో చాలామంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ మన విద్యార్థుల్లో చాలామంది ఆంగ్లభాషా వాగ్ధాటి చాలా తక్కువ. ఇంగ్లిష్‌ అంతర్జాతీయ భాష కాబట్టి మనం ఏ దేశం వెళ్ళాలన్నా ఈ భాషపై పట్టు ఉండటం అవసరం.

కళాశాల విద్య కోసమే కాదు, దైనందిన జీవితంలో కూడా దీని ఆవశ్యకత ఎక్కువని తెలిసిందే. కాబట్టి స్వదేశంలో విద్యాభ్యాసం పూర్తికాకముందే ఆంగ్ల భాషా వ్యక్తీకరణలో నైపుణ్యం పెంచుకోవటానికి కృషి చేయటం ముఖ్యం.

సబ్జెక్టు పరిజ్ఞానం, కోర్సులు
మనదేశంలోని విధానానికి భిన్నంగా విదేశాల్లో విద్యావ్యవస్థ ఉంటుంది. ఇక్కడ సిద్ధాంతపరమైన దృష్టి అధికం. కానీ విదేశాల్లో ప్రయోగ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ లోపం సవరించుకునేందుకు అదనంగా మన విద్యార్థులు కృషి చేయాల్సిందే.

ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ బ్రాంచిల విద్యార్థులు విదేశాల్లోని ఈ కోర్సుల స్థాయి అందుకోవటానికి తమ అవగాహన సామర్థ్యాలను పెంచుకోకతప్పదు. అదనపు కోర్సుల, లాంగ్వేజెస్‌ పరిజ్ఞానం సాధించగలిగితే ఎల్లప్పుడూ ఉపయోగమే. విదేశాల్లో ఈ కోర్సుల నిర్మాణం ఇక్కడి కోర్సుల మాదిరి ఉండదు. ఎక్కడ చదివినా ఈ కోర్సులకు సంబంధించిన అదనపు పరిజ్ఞానం మాత్రం పెంపొందించుకోవాలి.

సరైన కోర్సు ఎంపిక
తమ స్నేహితుల, కుటుంబసభ్యులిచ్చిన సమాచారం, సలహాలపై ఆధారపడే ఎక్కువమంది కోర్సు/ బ్రాంచిలను ఎంచుకుంటుంటారు. ఇది సరైన ఎంపిక కాకపోయే ప్రమాదముంది. దీనికంటే తన ఆసక్తి, అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నించటం మేలు.

చదవబోయే కోర్సులో ఏమేం నేర్చుకోవాల్సివుంటుంది, కళాశాల తీరు ఎలా ఉంటుందీ... ఇవన్నీ పూర్తిగా తెలుసుకుని చేరటం వల్ల తర్వాతకాలంలో ఇబ్బందులు తలెత్తవు. పూర్తిగా కోర్సుమీద మనసు కేంద్రీకృతం చేయగలుగుతారు.

కోర్సు అంశాలు తన అవగాహనకూ, ధోరణికీ సరిపోవని భావిస్తే ఇతర బ్రాంచిలను ఎంచుకోవచ్చు. ఎందుకంటే... ఇష్టమైన సబ్జెక్టులోనే ఏ విద్యార్థి అయినా విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది. మెరుగైన కెరియర్‌కైనా, విదేశాలకు వెళ్ళటానికైనా ఇది పునాదిగా ఉపకరిస్తుంది.

విదేశాల్లో పరిస్థితులు
డిగ్రీ తర్వాత విదేశాల్లో కోర్సు/ఉద్యోగంలో ప్రవేశించదలిచినవారు తాము లక్ష్యంగా పెట్టుకున్న దేశంలోని పరిస్థితులను తెలుసుకోవాలి. వాతావరణ పరిస్థితులపై అవగాహన కూడా అవసరమే. చాలామంది విద్యార్థులు పరాయి దేశాలకు చేరుకున్నాక అక్కడి వాతావరణం సరిపడక వివిధ రుగ్మతలతో ఇబ్బందిపడుతుంటారు. చదువు/ విధినిర్వహణపై ఈ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం విస్మరించరానిది.

ఇతరదేశాల్లోని జీవన పరిస్థితులూ, వారి జీవన శైలి మనకంటే భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. మనదేశంలో బయట కూడా బిగ్గరగా మాట్లాడుకుంటుంటాం కదా? చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మౌనంగా ఉండటం సాధారణం. వీటిని గమనించి అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తమను మల్చుకోవాలి. విద్యార్థులకు ఆ దేశంలో బంధువులూ, స్నేహితులూ ఉంటే సాపేక్షంగా కొంత ఉపయోగకరం.

ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవటం కష్టమేమీ కాదు. ఆపై విదేశాల్లో పీజీ చేసినా, కొలువులో చేరినా ఆ ప్రస్థానం సాఫీగా విజయవంతంగా మారుతుంది.

కీలక నైపుణ్యాలు ముఖ్యం

విదేశీ విద్య, ఉద్యోగాలకు ఉపకరించే కొన్ని ప్రధాన నైపుణ్యాలపై విద్యార్థులు దృష్టిపెట్టటం మేలు. తాము ఎంచుకున్న రంగాన్ని బట్టి అవసరమైనవాటిని పెంపొందించుకోవటానికి ప్రయత్నించాలి.

భాష: స్పోకెన్‌, రిటన్‌ ఇంగ్లిష్‌లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం పెంచుకోవటం.

లేఖనం: బిజినెస్‌ లేఖలు, ఎజెండాలు, మినిట్స్‌ రాసే ప్రతిభను సానపెట్టుకోవటం.

కంప్యూటర్‌: వర్డ్‌ప్రాసెసింగ్‌, స్ప్రెడ్‌ షీట్లు, డేటాబేసెస్‌ ఉపయోగించటం, పవర్‌ పాయింట్‌, వెబ్‌ పరిశోధన.

నిర్వహణ:to-do lists తయారీ, ఎగ్జిక్యూటివ్‌ సమ్మరీ, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ ప్రణాళికలు

భావ వ్యక్తీకరణ: స్పష్టంగా, సమర్థంగా భావాలను తెలియజేసే నేర్పు, మార్కెటింగ్‌ వ్యూహాల పరిజ్ఞానం.

Thursday 2 August 2012

ఆధునిక అవకాశాలకు... బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌

    ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదివిన విద్యార్థులకు ఆకర్షణీయమైన వేతనంతో ఆధునిక కార్పొరేట్‌ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. 

నిపుణులైన అభ్యర్థుల కొరత ఈ రంగాల్లో అధికంగా ఉంది. దీన్ని భర్తీ చేయడానికి అనేక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవి... సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ (సీఎఫ్‌పీ), డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (డీబీఎఫ్‌), చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్‌ ్ట (సీఎఫ్‌ఏ). మనదేశంతోపాటు విదేశాల్లో ఉద్యోగాలు పొందడానికి, సొంతగా ప్రాక్టీస్‌ చేయడానికి ఈ కోర్సులు అవకాశం కల్పిస్తున్నాయి.

వ్యక్తుల ఆర్థిక జీవితానికి సంబంధించిసంపూర్ణ అవగాహనతో, వారి పెట్టుబడులు, బీమా, పన్నులు, పదవీ విరమణ, స్థిరాస్తులు, తదితర అంశాల్లో సమగ్రమైన సలహాలు ఇవ్వడం సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ల ప్రత్యేకత. సీఎఫ్‌పీ అనేది సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌. ఇప్పటికే కెరియర్‌లో స్థిరపడినవారు తమ విధి నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ కోర్సు చేయవచ్చు. విద్యార్హతలను, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్థిక సేవల రంగంలోని అనేక పెద్ద కంపెనీలు సైతం తమ ఎగ్జిక్యూటివ్‌లను ఈ ప్రోగ్రామ్‌కు స్పాన్సర్‌ చేస్తుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సీఎఫ్‌పీకి డిమాండ్‌ పెరుగుతోంది. 24 దేశాల్లో ఈ సర్టిఫికేషన్‌కు గుర్తింపు ఉంది.

ఆర్థిక రంగానికి సంబంధించిన వివిధ అంశాలను విస్తృతంగా, క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా సీఎఫ్‌పీలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో కీలకంగా మారుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో సుమారు 1600 మంది సీఎఫ్‌పీలు మాత్రమే ఉన్నారు. 2015 నాటికి కనీసం లక్ష మంది అవసరమవుతారని అంచనా. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ (ఎఫ్‌పీఎస్‌బీ) ఇండియా ఇందులో ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. అమెరికాకు చెందిన ఎఫ్‌.పి.ఎస్‌.బి.ఎల్‌.కు అనుబంధంగా ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా పనిచేస్తుంది. విదేశాల్లో ప్రాక్టీస్‌ చేయాలనుకునే సీఎఫ్‌పీలు ఆయా దేశాల సర్టిఫికేషన్‌ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

కోర్సు కాలంలో మంచి శిక్షణ ద్వారా పర్సనల్‌ ఫైనాన్స్‌లో ప్రత్యేక సామర్థ్యాలను సీఎఫ్‌పీలు పెంపొందించుకుంటారు. తద్వారా వీరికి ఫైనాన్స్‌ రంగంలోని అనేక విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీలైతే సొంతగా ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు. క్లయింట్ల సమస్యలను పరిష్కరించినందుకు, సలహాలు ఇచ్చినందుకు కమిషన్‌ కూడా లభిస్తుంది. ఏ సబ్జెక్టులతోనైనా ఇంటర్మీడియట్‌ / 10+2 పూర్తిచేసిన విద్యార్థులు సీఎఫ్‌పీకి పేరు నమోదు చేసుకోవచ్చు.

బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో డిప్లొమా
బ్యాంకింగ్‌ రంగంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోన్న కోర్సు డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో సుశిక్షితులైన నిపుణుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (ఐఐబీఎఫ్‌) దీన్ని రూపొందించింది. ఈ కోర్సుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) గుర్తింపు ఉంది. అన్ని రకాల బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, ఐటీ, బీపీఓ రంగాల్లో ప్రవేశ స్థాయి ఉద్యోగాలకు ఈ డిప్లొమా అభ్యర్థులను అర్హులుగా ఐబీఏ గుర్తించింది. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాలపై సమగ్ర అవగాహన కల్పించడంతోపాటు, విధి నిర్వహణకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలను పెంపొందిస్తారు. విద్యార్థులను ఉద్యోగాలకు పూర్తి స్థాయిల్లో సన్నద్ధులను చేయడం ఈ కోర్సు ప్రత్యేకత. ఈ అభ్యర్థులకు కంపెనీల్లో అంతర్గత శిక్షణ పెద్దగా అవసరం ఉండదు. అందుకే కంపెనీలు డీబీఎఫ్‌ అభ్యర్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి.

పరీక్ష, అర్హతలు: ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్మీడియట్‌ / 10+2 ఉత్తీర్ణులు ఐఐబీఎఫ్‌ నిర్వహించే 'డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఎగ్జామినేషన్‌' రాయడానికి అర్హులు. ఈ పరీక్షలో కింది సబ్జెక్టులు / పేపర్లు ఉంటాయి...

* Principles & Practices of Banking
*Accounting & Finance for Bankers
* Legal & Regulatory Aspects of Banking

ఒక్కో పేపర్‌లో సుమారు 120 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. సాధారణంగా నెగటివ్‌ మార్కులు ఉండవు. సబ్జెక్టు పరిజ్ఞానం, భావనలపై పట్టు, విశ్లేషణ, తార్కిక, సమస్యా పరిష్కార సామర్థ్యాలు, కేస్‌ ఎనాలిసిస్‌ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ఆదివారం ఒక పేపర్‌ చొప్పున వరుసగా మూడు ఆదివారాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు గల సీఎఫ్‌ఏ
ఫైనాన్స్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన కోర్సుగా చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ)కు గుర్తింపు ఉంది. ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది అత్యంత అనువైన కోర్సు. శిక్షణ మొదటి రోజు నుంచే ఉద్యోగానికి అవసరమైన సామర్థ్యాలను ఇందులో నేర్చుకుంటారు. ఇన్వెస్ట్‌మెంట్‌ రంగంలోని వైవిధ్యమైన అవకాశాలను అందుకోవడానికి అవసరమైన ఆచరణాత్మక జ్ఞానాన్ని సీఎఫ్‌ఏ ద్వారా పొందవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో సీఎఫ్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం గల ఈక్విటీలు, స్థిర ఆదాయం, డెరివేటివ్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, హెడ్జ్‌ ఫండ్‌లు, స్థిరాస్తి, తదితర ఆధునిక రంగాల్లో ఈ నిపుణులకు విస్తృతంగా అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా రంగాల్లో పోర్టిఫోలియో మేనేజర్లు, రిసెర్చ్‌ ఎనలిస్ట్‌లు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు, కన్సల్టెంట్లు, రిస్క్‌ మేనేజర్లు, రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు, కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ ఎనలిస్ట్‌లు, మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.

పరీక్ష, అర్హతలు: సీఎఫ్‌ఏ ప్రోగ్రామ్‌లో మొత్తం మూడు దశల పరీక్షలు ఉంటాయి. లెవెల్‌ 1లో ఇన్వెస్ట్‌మెంట్‌ టూల్స్‌, లెవెల్‌ 2లో అసెట్‌ వాల్యుయేషన్‌, లెవెల్‌ 3లో పోర్టిఫోలియో మేనేజ్‌మెంట్‌ అంశాలు ఉంటాయి. పరీక్షలోని వివిధ దశల్లో సబ్జెక్టుపై అవగాహన, విశ్లేషణ, అనువర్తనం, కాంప్రహెన్షన్‌, మూల్యాంకనం, తదితర సామర్థ్యాలను పరీక్షిస్తారు. పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవారు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు లేదా సంబంధిత రంగంలో నాలుగేళ్ల పని అనుభవం ఉన్నవారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ పాస్‌పోర్టు కూడా అవసరం.


త్వరగా ఉద్యోగం కావాలంటే...
ఇంటర్మీడియట్‌ తర్వాత కొద్దిపాటి శిక్షణ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సీఎఫ్‌పీ, డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (డీబీఎఫ్‌) వీలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా డీబీఎఫ్‌ చేసిన అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ఐఐబీఎఫ్‌ తన వెబ్‌సైట్‌లో పెడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఈ అభ్యర్థులను నియమించుకునే అవకాశం ఉంది. మళ్లీ రాతపరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. మనదేశంలో డీబీఎఫ్‌ చేసిన అభ్యర్థులు అందరికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాంకింగ్‌ రంగం మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నందున గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా ఈ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు కూడా తేలిగ్గా డీబీఎఫ్‌లో ఉత్తీర్ణులు కావచ్చు. ఏటా నవంబరు, మే నెలలో పరీక్షలు జరుగుతాయి.

సీఎఫ్‌పీ ఉత్తీర్ణులకు మనదేశంలో చాలా డిమాండ్‌ ఉంది. కెనడా లాంటి చిన్నదేశంలో 50 వేలమంది సీఎఫ్‌పీలు ఉంటే మనదేశంలో రెండువేల మంది కూడా లేరు. మనరాష్ట్రంలో వీరి సంఖ్య వందలోపే. కెనడాలో సీఎఫ్‌పీ నాలుగేళ్ల కోర్సు. మనదేశంలో ఆర్నెల్ల శిక్షణతో సీఎఫ్‌పీలో ఉత్తీర్ణత సాధించవచ్చు. అందుకే అనేకమంది విదేశీ విద్యార్థులు మనదేశంలో శిక్షణకు వస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు ఎవరూ నిరుద్యోగులుగా ఉన్న దాఖలాలు లేవు. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు వీరిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఇంటర్మీడియట్‌ తర్వాత స్వల్పకాలంలోనే ఉపాధి పొందడానికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది.


సీఎఫ్‌పీ, డీబీఎఫ్‌లతో పోల్చుకుంటే సీఎఫ్‌ఏ కొంచెం కఠినమైన పరీక్ష. సీఎఫ్‌ఏ పరీక్ష ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అన్ని దశలు పూర్తిచేయడానికి సుమారు రెండున్నరేళ్లు పడుతుంది. ఇందులో ఉత్తీర్ణులై కనీసం మూడేళ్లు అనుభవం సాధిస్తే అద్భుతమైన వేతనాలు లభిస్తాయి.



- డా|| సీఏ జి.వి.రావు, గౌరవ డైరెక్టర్‌,
శ్రీ నాగ్‌ మేధో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ స్టడీస్‌, హైదరాబాద్‌

Thursday 19 July 2012

బ్రాంచి ఎంపికలో... మొగ్గుఎటు?

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు ముందుగానే బ్రాంచి ఎంపికపై అవగాహన ఏర్పరచుకోవడం తప్పనిసరి. పరిశ్రమల విస్తృతికి తగ్గట్టుగా ఎన్నో రకాల బ్రాంచిలు విద్యార్థులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తితో శ్రమించి చదివితే ఏ బ్రాంచి ద్వారానైనా ఉన్నతమైన కెరియర్‌ను అందుకోవచ్చు. విద్యార్థి కెరియర్‌ లక్ష్యాలు, అభిరుచి, భవిష్యత్తులో అవకాశాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని బ్రాంచీలు మీ ఆసక్తికి, లక్ష్యసాధనకు దగ్గరగా ఉంటాయి. అలాంటి వాటిని ఎంచుకుంటే మంచి కెరియర్‌కు మార్గం సుగమం అవుతుంది.


జాతీయ, అంతర్జాతీయ  ఆర్థిక వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌, తదితర సాంప్రదాయ అధ్యయన అంశాలను కోర్‌ బ్రాంచీలుగా పిలుస్తున్నారు. ఆధునిక పారిశ్రామిక రంగం ఆవిర్భావంతో కంప్యూటర్స్‌, ఐటీ, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, బయోటెక్నాలజీ, మెకట్రానిక్స్‌, తదితర బ్రాంచీలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థి తన ఆసక్తి, విద్యానేపధ్యం, స్థిరపడాలనుకుంటున్న రంగం, మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్రాంచీలను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఈసీఈకి నిరంతర డిమాండ్‌
ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచికి విద్యార్థుల నుంచి విపరీతంగా డిమాండ్‌ ఉంది. ఈసీఈ సంబంధిత పారిశ్రామిక, సేవా రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా టెలికాం రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం వృద్ధి చెందుతోంది. అనుకున్న సమయం కంటే వేగంగా, లక్ష్యానికి మించి ఫలితాలు ఈ రంగంలో కనిపిస్తున్నాయి. టెలికాం రంగంలో జరిపే పరిశోధన, అభివృద్ధి ఫలితాలు తక్షణం సాధారణ ప్రజానీకానికి చేరువలోకి వస్తున్నాయి. 3జీ, 4జీ, ఎల్‌టీఈ (లాంగ్‌ టర్మ్‌ ఎవల్యూషన్‌) లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుంది. వినియోగదారుల మార్కెట్‌ విస్తృతంగా ఉండటం, రోజురోజుకూ ఇది వృద్ధి చెందుతుండటం వల్ల ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి.

టెలికాం రంగంతోపాటు అనేక ఇతర పరిశ్రమలు, విభాగాలు ఈసీఈ విద్యార్థులకు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, మైక్రోవేవ్‌, శాటిలైట్‌, టెరెస్ట్రియల్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ లాంటి అనేక రకాల కమ్యూనికేషన్‌ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ప్రభుత్వ రంగంలోని బీఈఎల్‌, ఇస్రో, ఈసీఐఆర్‌, డీఆర్‌డీఓ లాంటి కంపెనీల్లో కూడా స్థిరపడవచ్చు. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సంబంధిత విభాగాల్లోకి కూడా ఈసీఈ విద్యార్థులు ప్రవేశించవచ్చు. తద్వారా ఉద్యోగ అవకాశాల పరిధిని పెంచుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో కూడా...
ఈసీఈ విద్యార్థులకు ప్రోగ్రామింగ్‌పై కూడా పట్టు ఉంటుంది. సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచి విద్యార్థులకు తీసిపోని రీతిలో ప్రోగ్రామింగ్‌ సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. తద్వారా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో కూడా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. అవకాశాలతోపాటు ఈసీఈ చదివే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులే మంచి అవకాశాలను పొందే పరిస్థితి ఉంది.

పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఈసీఈ విద్యార్థులకు విద్యావకాశాలు విస్తృతం. ఎం.టెక్‌. లేదా ఎం.ఎస్‌.లో వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, టెలి కమ్యూనికేషన్స్‌, సీఎస్‌ఈ, ఐటీ, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, పవర్‌ సిస్టమ్స్‌, అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రానిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, రాడార్‌, మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్‌, ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, తదితర స్పెషలైజేషన్‌లను ఎంచుకోవచ్చు. మనదేశంలో, విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులు చేసినవారికి అవకాశాలు బాగుంటాయి.

నిత్య జీవితంలో సివిల్‌

మనిషి నిత్యజీవితంతో ముడిపడి ఉన్న సబ్జెక్టు సివిల్‌ ఇంజినీరింగ్‌. మనం నిరంతం చూసే, ఉపయోగించే రోడ్లు, భవనాలు, పరిశుద్ధమైన నీరు, ప్రాజెక్టులు, వంతెనలు, ఎయిర్‌పోర్టులు, తదితరాలన్నీ కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫలాలే. ఇతర ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి సివిల్‌ ఇంజినీర్లు మానవ జీవితాన్ని సుఖవంతం చేయగలుగుతారు. దీనిలో భాగం కావాలంటే సివిల్‌ ఇంజినీరింగ్‌ చదవాలి. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చేపట్టే ప్రాజెక్టుల్లో పనిచేయడం ద్వారా వివిధ సమస్యలకు సృజనాత్మక రీతిలో పరిష్కారాలు కనుక్కోవడం సివిల్‌ ఇంజినీర్లకు సాధ్యమవుతుంది. మేథ్స్‌, సైన్స్‌, టెక్నాలజీ పరిజ్ఞానం ఈ అభ్యర్థులకు అవసరం. ఉన్నత విద్యలో అభ్యర్థులు తమకు ఇష్టమైన స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వీలుంది.

సివిల్‌ ఇంజినీరింగ్‌ ఎప్పటినుంచో కొనసాగుతోన్న సాంప్రదాయ సబ్జెక్టు. నిర్మాణాల ప్రణాళిక, రూపకల్పన, అమలు ఇందులో కీలకం. ఈ సబ్జెక్టు ద్వారా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌, అంచనా, సంబంధిత అంశాల్లో గట్టి పునాది ఏర్పడుతుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు బీటెక్‌ తర్వాత మనదేశంలో లేదా విదేశాల్లో ఉన్నత కోర్సులు చేయవచ్చు. స్ట్రక్చరల్‌, వాటర్‌ రిసోర్సెస్‌, ఎన్విరాన్‌మెంటల్‌, కన్‌స్ట్రక్షన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌, తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.

* బీటెక్‌ తర్వాత ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం, రైల్వేలు, రక్షణ, పీడబ్ల్యుడీ, తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలోని వ్యవసాయ, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, భూగర్భ జలవనరుల విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.
* ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఓఎన్‌జీసీ, సెయిల్‌, జిందాల్‌ గ్రూప్‌ కంపెనీలు కూడా సివిల్‌ ఇంజినీర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. స్వయంగా కన్సల్టింగ్‌ సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి అనువైనది


(ఇతర ముఖ్య బ్రాంచిల విశేషాలను eenadu.net లో చదువు పేజీ విభాగంలో చూడండి.)

Monday 11 June 2012

ఐఐటీల కంటే బిట్స్‌ కే ఎక్కువ పోటీ !

నాణ్యమైన సాంకేతిక విద్యకు ప్రసిద్ధి చెందిన సంస్థ బిట్స్‌ పిలానీ. బిట్స్‌లో ఈ ఏడాది సగటున ఒక్కో సీటుకు 68 మంది పోటీ పడుతున్నట్టు అంచనా. ఐఐటీల్లో ఒక్కో సీటుకు 54 మంది పోటీలో ఉన్నారు.

విలువలతో కూడిన సైన్స్‌, ఇంజినీరింగ్‌ విద్యను అందించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, అత్యధిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించడం బిట్స్‌ పిలానీ ప్రత్యేకతలు. బిట్స్‌కు పిలానీతోపాటు గోవా, హైదరాబాద్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్‌ (బి.ఇ. ఆనర్స్‌), సైన్స్‌ (ఎం.ఎస్‌సి.) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలు వడింది. బిట్‌శాట్‌లో స్కోరు సాధించిన అభ్యర్థులు ప్రిఫరెన్స్‌లు ఇవ్వడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోరుకున్న బ్రాంచిలో సీటు లభిస్తుంది.

బిట్స్‌ సంస్థల్లో బి.ఈ. (ఆనర్స్‌), బి.ఫార్మసీ (ఆనర్స్‌), ఎం.ఎస్‌సి. (ఆనర్స్‌) కోర్సులున్నాయి. బిట్స్‌ పిలానీలో 800 సీట్లు, గోవాలో 600 సీట్లు, హైదరాబాద్‌లో 700 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
* బీఈ (ఆనర్స్‌)లో కెమికల్‌, సివిల్‌, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలు ఉన్నాయి.

* ఎం.ఎస్‌సి. (టెక్‌)లో ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌; ఎం.ఎస్‌సి. ఆనర్స్‌లో బయాలజీ, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, ఎకనమిక్స్‌ కోర్సులున్నాయి.

అనర్హతలు: 2011కి ముందే +2 పరీక్ష పాసైనవారు; మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో సబ్జెక్టువారీ 60 శాతం, సగటు 75 శాతం రానివారు; జూన్‌ 30లోగా +2 ఫలితాలు, మార్కుల జాబితాలు రానివారు; కేవలం కొన్ని లేదా ఒకటే సబ్జెక్టులో ఇంప్రూవ్‌మెంట్‌ రాసినవారికి బిట్స్‌లో ప్రవేశానికి అర్హత లేదు.

దరఖాస్తు నింపడంలో జాగ్రత్తలు
బిట్స్‌లో ప్రవేశం కోసం నిర్దేశించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులో 3 భాగాలు ఉంటాయి. అభ్యర్థి అప్లికేషన్‌ నంబర్‌ను క్లిక్‌ చేసిన వెంటనే ఇదివరకే బిట్‌శాట్‌ 2012కి నింపిన అప్లికేషన్‌లోని వివరాలన్నీ 1వ భాగంలోకి వాటంతట అవే వస్తాయి. 2వ భాగంలో అభ్యర్థి చదివిన కాలేజీ పేరు (+2), ఎగ్జామినేషన్‌ బోర్డు పేరు, పరీక్షకు హాజరైన / పాసైన సంవత్సరం, పరీక్ష ఫలితం వచ్చిన తేదీ, +2లో (ఇంటర్‌ సెకండియర్‌) కెమిస్ట్రీ (90కి), ఫిజిక్స్‌ (90కి), మేథమేటిక్స్‌ (150కి), ఇంగ్లిష్‌ (100కి)లో వచ్చిన మార్కుల్ని, పర్సంటేజీని కరెక్టుగా నింపాలి. అప్లికేషన్‌ నంబర్‌ ఇవ్వాలి.

* ఎంతో కీలకమైన 3వ భాగంలో విద్యార్థి తల్లి / తండ్రి సంతకం, రూ.200లకు తీసిన డీడీ (బిట్స్‌, పిలానీ పేరుతో ఎస్‌బీఐ/ యుకో/ ఐసీఐసీఐ/ ఎస్‌బీబీజే బ్యాంకులో) వివరాలను నింపాలి. దీనిలో క్రమ సంఖ్య, కోర్సు, క్యాంపస్‌ల వివరాలు ఉంటాయి.

దేశంలోని అన్ని బిట్స్‌ సంస్థల్లో కలిపి 2100 సీట్లు ఉంటాయి. కానీ బిట్‌శాట్‌ 2012కి సుమారు 1.35 లక్షల మంది పోటీపడ్డారు. అందులో 29 శాతం మంది మన రాష్ట్రం నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుమారు 700 మంది (33 శాతం) బిట్స్‌లో సీట్లు సాధిస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో సీట్లు పొందేవారి సంఖ్య 2 శాతంలోపే ఉంది. రాష్ట్రాల బోర్డు టాపర్లకు నేరుగా కావాల్సిన కోర్సులో ప్రవేశం కల్పించడం వల్ల ఏటా 20 నుంచి 30 మంది ఇలా బిట్స్‌లో చేరుతున్నారు.

ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ కీలకం
పరీక్ష రాసిన వెంటనే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు స్కోరు చేయడం ఒక ఎత్తయితే, ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ని తయారు చేయడం మరో ఎత్తు. విద్యార్థికి కోర్సులపై తగిన అవగాహన లేకపోయినా, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉన్నా నష్టపోయే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఒక విద్యార్థి ఐఐటీ జేఈఈలో 1000వ ర్యాంకు సాధించి కూడా ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ని సరిగా ఇవ్వకపోవడంతో తాను కోరుకున్న కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచిలో సీటు పొందలేకపోయాడు. ఇదే పరిస్థితి బిట్స్‌, ఏఐఈఈఈ విషయంలో కూడా పునరావృతమవుతూ ఉంది. అందువల్ల అభ్యర్థులు ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ ఇవ్వడంలో కొన్ని మెలకువలు పాటించాలి...

* విద్యార్థులు, తల్లిదండ్రులు... బిట్స్‌లో చదువుతున్న విద్యార్థుల్ని సంప్రదించి కోర్సుల వివరాలు, క్యాంపస్‌లో ఏ కోర్సుకు ఎలాంటి ప్లేస్‌మెంట్లు వస్తున్నాయి, మీ స్కోరుకి సీటు లభించే అవకాశం ఉన్న కోర్సులు, ప్రిఫరెన్స్‌ ఇవ్వడం గురించి ఆరా తీయాలి.

* ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌ సరిగా ఇవ్వడం అనేది కష్టంతో కూడుకున్నప్పటికీ, ఎంతో తెలివిగా చేయాల్సిన పని. పథకం ప్రకారం ప్రిఫరెన్స్‌ ఇస్తే స్కోరు తక్కువ వచ్చినవారికీ కోరుకున్న కోర్సులో సీటు దక్కవచ్చు.

* ఒకే స్కోరు సాధించినవారు ఎక్కువమంది ఉంటే ముందుగా మేథ్స్‌, తర్వాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీ +2 మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

* విద్యార్థి ఆశించిన కోర్సులో సీటు రావడం, రాకపోవడం అనేది ఆ కోర్సుకి ప్రిఫరెన్స్‌ ఇచ్చిన విద్యార్థుల సంఖ్య, మీ బిట్‌శాట్‌ స్కోరు, ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌లు, ఆ కోర్సుకు ఉండే డిమాండ్‌, గతంలో ప్లేస్‌మెంట్లపై ఆధారపడి ఉంటుంది.

 కటాఫ్‌లను పరిశీలిస్తే...
బిట్స్‌లో ఏ క్యాంపస్‌లో, ఏ కోర్సు చేసినా దాదాపు అందరికీ మంచి ప్లేస్‌మెంట్లు లభిస్తాయి. కటాఫ్‌ తక్కువగా ఉందని బి.ఫార్మసీని నిర్లక్ష్యం చేయకూడదు. మనకు కావాల్సిన కోర్సులో గతంలో సీట్లు ఎంతవరకు వచ్చాయో కటాఫ్‌లను పరిశీలిస్తే అర్థమవుతుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను దూరం పంపడానికి ఇష్టపడరు. అలాంటివారు క్యాంపస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యాంపస్‌ల వాతావరణ పరిస్థితుల్ని కూడా తెలుసుకోవడం అవసరం.

* ప్రోగ్రామ్‌ ప్రిఫరెన్స్‌లు ఒకే క్యాంపస్‌కి పరిమితమైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మన స్కోరుకి ఏయే కోర్సులు రావచ్చో గత నాలుగేళ్ల కటాఫ్‌ స్లోర్లని బట్టి అంచనా వేసుకోవచ్చు. అన్ని కోర్సులకూ గత నాలుగేళ్లలో కటాఫ్‌ల మధ్య తేడా 5 నుంచి 10 మధ్యే ఉంటోంది.

* కటాఫ్‌ బోర్డర్‌లో ఉండేవారు కీడెంచి మేలెంచడం మంచిది. మరిన్ని మెలకువలు తెలుసుకొని కోర్సుల ప్రాధాన్యతా క్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ క్రమాన్ని ఒకసారి ఇచ్చాక మళ్లీ మళ్లీ మార్చడం కుదరదు.

* విద్యార్థికి అభిరుచి ఉన్నది ఒక కోర్సులోనే అయినా, పది రకాల కోర్సుల ప్రాధాన్యతా క్రమాన్ని కటాఫ్‌లకు అనుగుణంగా తయారు చేసుకోవాలి. ఉదాహరణకు 310 మార్కులు వచ్చినవారు, తమకు 300 మార్కులే వచ్చాయనుకొని ప్రోగ్రామ్‌ల ప్రాధాన్యతా క్రమాన్ని తయారు చేసుకోవడం చాలా ఉత్తమం.

* ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నా బిట్స్‌లో చదవలేమనే బెంగ వద్దు. ఇక్కడ చదివేవారికి విద్యారుణం ఇవ్వడానికి అనేక బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. బ్యాంకులు అడ్మిషన్‌ల సమయంలో నేరుగా క్యాంపస్‌లకే వస్తాయి. ఇంకా 30 శాతం మందికి బిట్స్‌లో మెరిట్‌, మెరిట్‌ కమ్‌ నీడ్‌ లాంటి రకరకాల ఉపకార వేతనాలు అందుబాటులో ఉన్నాయి.

ఇటరేషన్లలో పాల్గొనవచ్చు
విద్యార్థులు ఇచ్చిన ప్రాధాన్యతా క్రమంలో పైపైకి మళ్లీ మళ్లీ (మొత్తం 4 సార్లు) వెళ్లడాన్ని 'ఇటరేషన్‌' అంటారు. మీరు కోరుకున్న కోర్సు దక్కలేదని నిరుత్సాహపడకుండా 4 ఇటరేషన్లలో పాల్గొనడం మంచిది. ఇటరేషన్లలో పైకి జరగడం అనేది వేర్వేరు క్యాంపస్‌లు, కోర్సుల్లో చేరే లేదా మానేసే విద్యార్థుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది.
* మీకు ఇష్టమైన కోర్సు రాకున్నా వేరే కోర్సులో చేరి రెండో సంవత్సరంలో కావాల్సిన కోర్సుని దక్కించుకోవచ్చు. ఎం.ఎస్‌సి. (ఆనర్స్‌)లో పిలానీలో ఎకనమిక్స్‌ కావాలనుకున్న వారికి అది రాకపోతే ప్రస్తుతానికి బయాలజీలో చేరవచ్చు. మొదటి సంవత్సరం కష్టపడి మంచి సీజీపీఏ సాధించి రెండో ఏడాది ఎకనమిక్స్‌లోకి మారవచ్చు. ఇంకా సులభంగా బి.ఇ. ఆనర్స్‌లోకి మారవచ్చు.

* బి.ఇ. (ఆనర్స్‌)లో ఒక కోర్సు నుంచి మరొక కోర్సు (ఉదాహరణకు.. సివిల్‌ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌కి వెళ్లడం)లోకి మారాలంటే చాలా ఎక్కువ సీజీపీఏ తెచ్చుకోవాలి.

* చాలామంది విద్యార్థులు ఎం.ఎస్‌సి. (టెక్‌) ఐదేళ్ల కోర్సు అనీ, ఐటీ కోర్సు అనీ భ్రమపడతారు. నిజానికి ఇది నాలుగేళ్ల కోర్సు, కంప్యూటర్‌ సైన్స్‌ (బి.ఇ)కి సమానమైన కోర్సు.

* అవసరం ఉన్నా, లేకున్నా 40 ప్రిఫరెన్స్‌లు ఇవ్వడంలో నష్టం లేదు. అయితే మొదటి 10 ప్రిఫరెన్స్‌ని చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇంకా సందేహాలు ఉంటే బిట్స్‌కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ముఖ్యమైన తేదీలను గమనిస్తూ ఉండాలి.

* 30 జూన్‌: రూ.200 డీడీ, అటెస్ట్‌ చేసిన టెన్త్‌, +2 / ఇంటర్‌ మార్కుల మెమోలు, 3 పేజీల ప్రింటెడ్‌ దరఖాస్తు The Admissions Office, BITS Pilani - 333031 కి స్పీడ్‌ లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా చేరడానికి చివరితేదీ.

* 1 జులై: అడ్మిషన్‌ లిస్ట్‌ ప్రకటన (ఇటరేషన్‌ -1)

* 10 జులై: అడ్వాన్స్‌ ఫీజు చెల్లించడానికి గడువు.

* 11 జులై: ఇటరేషన్‌ 2 అడ్మిషన్ల ప్రకటన

* 18 జులై: ఇటరేషన్‌ 2 అభ్యర్థులు మిగతా ఫీజు చెల్లించడానికి చివరితేదీ

* 19 జులై: ఇటరేషన్‌ 3 అడ్మిషన్ల ప్రకటన

* 31 జులై: ఇటరేషన్‌ 4 అడ్మిషన్ల ప్రకటన.

-  ANS  శంకరరావు

Monday 14 May 2012

మీరు టెట్ రాస్తున్నారా?

టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఈ సారి ఉద్విగ్న భరితంగా జరగనుంది. టెట్‌ కేవలం అర్హతా పరీక్షే కాకుండా డీఎస్సీలో 20 మార్కుల వెయిటేజీ కూడా ఉంటుంది. తద్వారా డీఎస్సీలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది టెట్‌ స్థాయిలోనే అభ్యర్థులకు దాదాపు తెలిసిపోతుంది. మరో 17 రోజుల్లో టెట్‌ పరీక్ష జరగబోతుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఉండటం సహజం. ఈ కొద్దిపాటి సమయాన్ని టెట్‌లో గరిష్ఠ మార్కులు సాధించడానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

చాలామంది అభ్యర్థులు టెట్‌లో అర్హత మార్కులు 'ఎలాగోలా' వస్తే చాల్లే అని, స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తి శక్తియుక్తుల్ని వినియోగించరు. నామమాత్రంగా చదువుతారు. ఇది సరైన ధోరణి కాదు. ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలో 'ఎలాగోలా బతికేద్దాం అని ఇక్కడికి రాలేదు' అని హీరో అంటాడు చూడండి, అలాగే మీరు కూడా ఉన్నత లక్ష్యంతో టెట్‌ యుద్ధానికి సిద్ధమవండి. డీఎస్సీలో ప్రభావం చూపే టెట్‌లో మీ మార్కుల లక్ష్యం పైన పట్టికలో చూపించిన విధంగా ఉండాలి.

పేపర్‌ కఠినత్వం సగటు స్థాయిగా ఉందనుకుంటే... మొత్తం మీద 115 - 120 మధ్య స్కోరు చేయగల్గితే డీఎస్సీలో మంచి వెయిటేజీ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్థాయిలో మీ ప్రిపరేషన్‌ ఉంటే విజయవంతం అయినట్లే. లేకుంటే ఈ 17 రోజుల్లో ఏమి చేసి లక్ష్యం సాధించాలో తెలుసుకుందాం.

శిశు వికాసం - పెడగాజి
సిలబస్‌ కింద చాలా అంశాలు ఉండటంతో ఈ విభాగంపై అభ్యర్థులు సాధారణంగా కొంత వ్యతిరేకత పెంచుకుంటారు. 2012 జనవరి టెట్‌లో పెడగాజి (10 ప్రశ్నలు), అభ్యసనం (8), శిశువికాసం (8), వైయక్తిక భేదాలు (2), మూర్తిమత్వం (2) ప్రశ్నలు అడిగారు. పాఠ్యాంశాల విభజన మళ్లీ దాదాపుగా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ విభాగంపై ఇంకా సరైన పట్టు దొరకలేదు అనుకునేవారు, ఉన్న సమయంలో కింది అంశాలపై దృష్టిపెట్టడం మంచిది.

* పెడగాజిలోని సిలబస్‌ని జనరల్‌గా చదవండి. అక్కడక్కడ మెథడ్స్‌ అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్ని కూడా అనుసంధానం చేసుకొని చదివితే రెండు విధాలుగా ప్రయోజనం లభిస్తుంది.

* 'అభ్యసనం' విభాగంలో ప్రశ్నలు అన్నీ బీఎడ్‌ / డీఎడ్‌ పుస్తక సమాచారంలోనివే కాబట్టి, అకాడమీ పుస్తకాల సహాయంతో అభ్యసన భావనలు బాగా చదవాలి.

* 'శిశువికాసం' విభాగంలో... వికాసం - పెరుగుదల ప్రధానాంశాలుగా కన్పిస్తున్నాయి. ఈ విభాగంలో 1-5 పాఠాలను క్షుణ్నంగా చదివి, 6, 7, 8 పాఠాల్ని సాధారణ స్థాయిలో చదివితే సరిపోతుంది.

* తరగతి గది, పాఠశాల, ఉపాధ్యాయుడు, పిల్లలు, పరిసరాలు మొదలైన అంశాలను, వాటి గురించి ఊహించుకుంటూ చదివితే పెడగాజిలో మార్కులు సులభంగా సాధించవచ్చు.

తెలుగు భాష
2011 టెట్‌ పేపర్‌ చూసి చాలామంది అభ్యర్థులు ఈ విభాగాన్ని సులభంగా భావించారు. కానీ 2012 (జనవరి) పేపర్‌ చూసి కారణాలు ఏవైనప్పటికీ బాగా ఒత్తిడికి లోనయ్యారు. నిజానికి 'తెలుగు భాష' కింద ఇచ్చిన 30 ప్రశ్నలలో అత్యధిక ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. కాకపోతే వ్యాకరణ ప్రశ్నల్ని కంటెంట్‌ ఆధారంగా అడగటం (సాధారణ ఉదాహరణలలో కాకుండా), వాడుకలో లేని పదాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒత్తిడికి లోనై ఉంటారు. 'శిశు విషాణం' అర్థం, బహువ్రీహి సమాసానికి ఛాయిస్‌లో ఇచ్చిన పదాలు, 'ఉప్పు' కోసం ఇచ్చిన పొడుపు కథ... ఇబ్బందులు కలిగించాయని భావించవచ్చు. ఏది ఏమైనా టెట్‌లో అత్యధిక స్కోరు సాధించటం లక్ష్యం కాబట్టి అభ్యర్థులు కింది అంశాలపై దృష్టి పెట్టాలి.
* సిలబస్‌లో పేర్కొన్న పాఠ్యాంశాల అధారంగా పద్యాల్ని తెలుగు వ్యాకరణ అంశాలతో అనుసంధానం చేసుకొని అధ్యయనం చేయాలి. నేరుగా వ్యాకరణ అంశాలు చదవకూడదు.

* పెడగాజి కింద 6 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వ్యాకరణం చదివి, 'అంతా చదివేశాం' అనుకోకుండా భాషా బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు తెలుగు పండితులకు ఉండాల్సిన లక్షణాలపై కూడా పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌ భాష
అధికశాతం అభ్యర్ధులు ఈ విభాగాన్ని సహజంగా కష్టమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్ధులు దీని గురించి ఒత్తిడికి లోనవుతారు. కంటెంట్‌లో ఎక్కువ మార్కులు సాధిద్దామని ఇంగ్లిష్‌ భాషను దాదాపు వదిలేస్తారు. ఇప్పటికే బాగా ప్రిపేరై ఉంటే మంచిదే. ఇంకా సరైన పట్టు సాధించకుంటే అందుబాటులో ఉన్న సమయంలో కింది అంశాలపై దృష్టిపెట్టి కనీసం 10 మార్కుల వరకు అదనంగా పొందే అవకాశం ఉంది. ముందుగా 2012 (జనవరి) ప్రశ్నల్ని పరిశీలిస్తే, ఎగ్జామినర్‌ పెట్టుకున్న ప్రమాణాలు ఇలా ఉన్నాయి.

వాడుకలో ఉపయోగించే పదాల్ని కాకుండా క్లిష్ట పదాల్ని ఎక్కువగా వినియోగించటం వల్ల ప్రశ్నే అర్థం కాకపోవటంతో అభ్యర్ధులు బాగా మార్కులు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే అభ్యర్థులకు ఇంగ్లిష్‌ పేపర్‌, చందమామ (జూనియర్‌) లాంటివి చదివే అలవాటు ఉండాలి. ఈ 17 రోజుల్లో అది సాధ్యం కాదు కాబట్టి... ఇచ్చిన సిలబస్‌ సంబంధిత పాఠ్యగ్రంధాల్ని రోజూ కనీసం ఓ గంట పెద్దగా చదవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. చదివేటప్పుడే అర్థం కాని పదాలుంటే డిక్షనరీ ద్వారా అర్థం తెలుసుకోవాలి. ఈ అర్థాలను ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటూ పునశ్చరణ చేయటం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. గత పరీక్షను పరిశీలిస్తే..

* నేరుగా పదాలకు వ్యతిరేక, సమానార్థాలు అడగకుండా ఒక వాక్యంలో ఏదో ఒక పదం ఎంచుకొని పరిశీలించడం జరిగింది. పైన పేర్కొన్న మెలకువ దీనికి కూడా ఉపయోగపడుతుంది.

* గ్రామర్‌ అంశాలపై ఆధారపడిన ప్రశ్నలు అధికంగా ఉన్నాయి. అందువల్ల పరీక్ష వరకు రోజుకో అంశానికి 1 గంట సమయం కేటాయించి సాధన చేయడం అవసరం.

* పెడగాజి కింద ఇచ్చిన 6 ప్రశ్నలు సాధారణ స్థాయివే. అభ్యర్థి తాను టీచర్‌ అయితే బోధన చేయడానికి ఎలాంటి మెలకువలు పాటించాలి అని ఆలోచిస్తూ అధ్యయనం చేస్తే చాలు. కొద్దిపాటి శ్రమతో ఈ విభాగం నుంచి 4-5 మార్కులు సులభంగా సాధించవచ్చని మరవద్దు. 10 గంటల సమయం కేటాయిస్తే ఈ విభాగంపై పట్టు కచ్చితంగా ఏర్పడుతుంది.

టెట్‌ పేపర్‌ 1 రాసినా, పేపర్‌ 2 రాసినా, ఈ విభాగాల ప్రిపరేషన్‌ని ఇదే శైలిలో అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

 ఈ 17 రోజుల్లో చేయాల్సినవి...
* ప్రతి విభాగంపై స్థూల అవగాహనని పెంచుకునే దిశలో చదవాలి.
* కీలక పాఠ్యాంశాలకే పరిమితం అవ్వండి.
* కీలక పాఠ్యాంశాలపై పట్టు ఉంటే మిగిలిన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి.
* 14, 15 తేదీలలో ఒకట్రెండు నమూనా పరీక్షలు రాయండి. మార్కులు బేరీజు వేసుకొని, లోపాల పరిష్కారం కోసం మిగతా 15 రోజుల్ని కేటాయించండి.
* 'చదివింది బాగుంది' అని స్వీయ ప్రేరణ పొందుతూ అసంతృప్తిని దూరం చేయండి.
* పరీక్షకు వారం ముందు ఎలాంటి నమూనా పరీక్షలు రాయవద్దు.

* 'ఇవి తరువాత చదువుదాం' అనే వాయిదాలు వద్దు. ఇదే ఆఖరి రివిజన్‌ అనుకుంటూ ఒక్కో అంశం ముగించేయండి.
* కీలక అంశాలు కాకపోతే కొత్త పాఠ్యాంశాలు చదవడం ఈ దశలో వద్దు.
* ఇతరులతో పోల్చుకుంటూ ఒత్తిడికి లోనై, జ్ఞాపకశక్తికి ఇబ్బందులు కలగజేయవద్దు.

* మార్కెట్లో దొరికే అనేక పుస్తకాలలో విస్తృత సమాచారం ఉంది. ఆ సమాచారం చూసి 'ఇది చదవలేదు, అది చదవలేదు' అని టెన్షన్‌కు గురికావద్దు. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు, తెలుగు అకాడమి పుస్తకాలకే ప్రస్తుతం పరిమితం అవ్వండి.

* ఇంపార్టెంట్‌ బిట్స్‌ అంటూ వాటిని చదవద్దు. బిట్‌బ్యాంక్‌ లాంటివి పునశ్చరణకు ఉపయోగించాలే కాని వాటిని ప్రధానంగా చదవద్దు.

పూర్తి కథనం కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.

Monday 7 May 2012

సివిల్స్ లో ... ఏపీ టాపర్‌ గెలుపు గాథ!

సివిల్‌ సర్వీస్‌ సాధించటమంటే అదెంతో ప్రత్యేకం. అందులోనూ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవటం మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. ఏడాది వ్యవధిలో 90వ ర్యాంకు నుంచి 9వ ర్యాంకుకు ఎదిగిన పట్టుదలా, కృషీ కృష్ణ భాస్కర్‌ ది! తన విజయగాథలోని మలుపులూ, విశేషాలను 'చదువు' పాఠకులకు తనే స్వయంగా వివరిస్తున్నాడీ టాపర్‌!

మ్మా నాన్నలు ఐఏఎస్‌ అధికారులు! ఇంకేం? సివిల్స్‌ను నా కెరియర్‌గా ఎంచుకోవటం చాలా సహజమని అందరూ ఊహించారు. కిందటి సంవత్సరం సివిల్స్‌లో 90వ ర్యాంకు తెచ్చుకోగానే సివిల్స్‌లో చేరటం 'బాల్యం నుంచీ నా కల' అయివుంటుందని చాలామంది అంచనాకు వచ్చారు!
కానీ వాస్తవం వేరు. సివిల్స్‌ ఆలోచన నాకు కలిగింది కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే... ప్రైవేటు రంగంతో సంబంధం ఏర్పడిన తర్వాతే!

పాఠశాల చదువు ఒకచోటే ఉండటం మంచిదని సాధారణ అభిప్రాయం. అమ్మానాన్నల బదిలీల మూలంగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా పాఠశాలల్లో నేను చదవాల్సివచ్చింది. ఇలా వివిధ ప్రాంతాలు మారటం నాకు మేలే చేసింది. ప్రతి స్కూల్లోనూ విభిన్న వాతావరణం, సదుపాయాల్లో తేడాలు, రకరకాల మనుషులు, ఉపాధ్యాయులు... విస్తృత అనుభవాలు సంపాదించుకోగలిగాను. ఐఏఎస్‌ను సాధించాలనే అభిలాషకు ఇవి అంతర్లీనంగా పనిచేశాయనిపిస్తుంది. ఈ వృత్తిలోనే కదా వైవిధ్యకరమైన అనుభవాలకు ఆస్కారముండేది... నిస్సారమైన క్షణాలకెప్పుడూ తావుండనిది!

ఐఐటీలో బీటెక్‌
బేగంపేట- హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్లో 1998లో నా పదో తరగతి పూర్తయింది. తర్వాత రత్న జూనియర్‌ కాలేజీలో చేరాను. ఐఐటీ ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ (ఎలక్ట్రికల్‌)లో ప్రవేశించాను. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కొద్దికాలం ఓ ప్రముఖ సంస్థలోని పరిశోధన విభాగంలో పనిచేశాను. నా అర్హతలు పెంచుకోవాలని నిర్ణయించుకుని 2008లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) లో చేరాను... మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో!

ఐఎస్‌బీ అంటే తెలిసిందే కదా? అక్కడి గ్రాడ్యుయేట్లలో చాలామంది భారీ వేతనాలతో ప్రైవేటు కొలువుల్లో చేరిపోతుంటారు. ఇక్కడే సివిల్‌ సర్వీసెస్‌ గురించి ఆలోచనలు నాలో మొదలయ్యాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం 'ఉద్యోగ భద్రత' గురించి దృష్టిపెట్టేలా చేసిందనుకోండీ. అమ్మానాన్నలతో చర్చించాను. నిర్ణయాన్ని నా విచక్షణకే వారు వదిలేశారు.

ప్రైవేటు ఉద్యోగంలో చేరకపోవటం వల్ల విలువైన సమయాన్నీ, అనుభవాన్నీ కోల్పోతున్నానని తెలుసు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కొలువుల్లో చేరనివారికి ఒకటి రెండు సంవత్సరాల తర్వాత తగిన ఉపాధి అవకాశాలుండవు కదా!

అయినప్పటికీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సిద్ధమై, అత్యుత్తమంగా రాయాలని నిర్ణయించుకున్నాను!

రీక్ష రాయాలని నిశ్చయించుకున్నాక నా మేనేజ్‌మెంట్‌ తరగతుల్లో సంపాదించిన పరిజ్ఞానంపై ఆధారపడ్డాను. Why winners winగురించి చాలా సెషన్లు జరిగేవి. వీటన్నిటిలోనూ ఒక వాస్తవం కనపడేది. విజేతలందరూ తామెంచుకున్న రంగాల్లో నిపుణులు. బాగా కష్టపడతారు. మౌలికాంశాలను విస్మరించరు.

విపరీతమైన పోటీ ఉండే సివిల్స్‌ పరీక్ష రాయదల్చినపుడు అభ్యర్థికి సరైన వాతావరణం, సరైన mentor ఉండాలి. ఢిల్లీలో కొన్ని ఇన్‌స్టిట్యూషన్లు చూశాను కానీ హైదరాబాద్‌ వాతావరణమే సౌకర్యంగా ఉంటుందనిపించింది. అన్నిటికీ మించి ఒక Mentorను ఎంచుకోవటం ముఖ్యమనేది తెలిసింది. అంటే... మన ఎదుగుదలపై నిజమైన ఆసక్తి ఉండి శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రేరణను అందించగలిగే వ్యక్తి! ఆ వ్యక్తి తండ్రి కావొచ్చు, పొరుగు వ్యక్తి, అధ్యాపకుడు, స్నేహితుడి తండ్రి.. ఎవరైనా కావొచ్చు. స్నేహితుల సలహా మేరకు బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణను కలిశాక, నా mentorను ఆయనలో గుర్తించాను.

సుదీర్ఘంగా సాగిన కౌన్సెలింగ్‌లో ఆప్షనల్స్‌ను ఎంచుకోవటం చాలా కీలకమని ఆయన వివరించారు. లాభనష్టాలను బేరీజు వేసుకుని, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలను ఎంచుకున్నాను. మొదటి సబ్జెక్టు- పరీక్ష తీరు, జనరల్‌స్టడీస్‌ను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. రెండో సబ్జెక్టు- సమాజాన్నీ, దాని సమస్యలను ఆకళింపు చేసుకోవటానికి ఉపకరించింది. అదీ గాక రుజువైన 'ట్రాక్‌ రికార్డు', తక్కువ సమయంలో చాలామంది విద్యార్థులు అర్హత సాధించిన చరిత్ర ఈ సబ్జెక్టులకుంది. ఈ ఆప్షనల్స్‌ను తీసుకుని తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించిన కార్తికేయ మిశ్రా (IIM Ahmedabad)నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.

ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు రెంటికీ ఉమ్మడి విధానంలో శిక్షణ తరగతులకు హాజరయ్యాను. ఐదు నెల్లకంటే ఎక్కువ సమయం కోచింగ్‌కి హాజరవ్వటానికి కేటాయించదల్చలేదు. ఎందుకంటే... ఈ పరీక్షకు spoon feeding కంటే స్వీయ సన్నద్ధతే ముఖ్యమని నాకు తెలుసు. అందుకే ఐదు నెల్ల శిక్షణ తర్వాత ప్రిలిమినరీకి సొంత టైమ్‌ టేబుల్‌ తయారు చేసుకున్నాను.

నా మొదటి ప్రయత్నంలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విషయంలో చాలా కృషి చేయాల్సివచ్చింది. ప్రిలిమినరీ కోసం సూక్ష్మ అంశాలను సైతం అవగాహన చేసుకోవాలి కదా! (ఆ ఏడాది ప్రిలిమ్స్‌లో ఒక ఆప్షనల్‌, జనరల్‌ స్టడీస్‌ ఉన్నాయి). ఆప్షనల్‌ కవర్‌ చేశాక, జనరల్‌ స్టడీస్‌మీద దృష్టి పెట్టాను.

ప్రిలిమినరీ నెగ్గాను.

తర్వాత వెంటనే ఆంత్రపాలజీపై మనసు కేంద్రీకరించాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలకు సంబంధించి writing practiceఎంతో చేశాను. మౌలిక పాఠ్యపుస్తకాలపై, ఆప్షనల్స్‌ స్టడీ మెటీరియల్‌పై ఆధారపడ్డాను. జనరల్‌స్టడీస్‌లో పదాల పరిమితి, ప్రశ్నపత్రం తీరు ముందుగా తెలియదు కాబట్టి ఆ ప్రిపరేషన్‌ను ఆ open ended గానే సాగించాను. అదృష్టవశాత్తూ ఆప్షనల్స్‌లో ఎక్కువ ప్రశ్నలు అంచనాల మేరకే వచ్చాయి. తేలిగ్గానే వాటికి జవాబులు రాశాను.

మెయిన్స్‌ ఫలితాలు వచ్చాక ఇంటర్వ్యూకు సిద్ధమయ్యాను. బయోడేటా, కరంట్‌ అఫైర్స్‌పై సన్నద్ధమవ్వాలనే సూచన పాటించాను. రెండు నమూనా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. 'ఏం చెపుతున్నావన్నది కాకుండా ఎలా చెపుతున్నావన్నదే ప్రధానం' అని నా mentorపదేపదే చెప్పారు. నిజాయతీగా ప్రవర్తించటం కూడా ముఖ్యమనేది మరో అంశం. ఈ వ్యూహం ఫలించి నా తొలి ప్రయత్నంలో 90వ ర్యాంకు సాధించాను. (ఆప్షనల్స్‌లో బాగా స్కోర్‌ చేశాను. ఇంటర్వ్యూలో 330కు 230 మార్కులు వచ్చాయి.) ఐఏఎస్‌కు అర్హత పొందుతానని భావించాను. అయితే 'రిస్క్‌' తీసుకోవద్దన్న సలహా మేరకు మళ్ళీ ప్రిలిమినరీకి సిద్ధమయ్యాను. అదే మంచిదైంది. ఎందుకంటే... మూడు మార్కుల తేడాతో ఐఏఎస్‌ తప్పిపోయి, ఐపీఎస్‌ వచ్చింది.


ఆగస్టులో ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చాయి. అక్టోబర్లో మెయిన్స్‌. రెండోసారి మెయిన్స్‌ రాయటం మొదటిసారంత కష్టమనిపించలేదు. తొలి ప్రయత్నంలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడింది. జనరల్‌స్టడీస్‌ కోసం ప్రాథమికాంశాలను మరోసారి సరిచూసుకున్నాను; కరంట్‌ అఫైర్స్‌ చదువుతూపోయాను. మెయిన్స్‌ రాసి, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ పోలీస్‌ అకాడమీ (హైదరాబాద్‌)లో ప్రవేశించాను.

పోలీస్‌ సర్వీసెస్‌లో శిక్షణ అద్భుతమైన అనుభవం. శారీరకంగా, మానసికంగా అవసరమైన క్రమశిక్షణను ఇది అందిస్తుంది. నా శిక్షణను చాలా ఆస్వాదిస్తూ వచ్చా. మార్చిలో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించారు. ఐపీఎస్‌ కఠోర శిక్షణ మూలంగా ఇంటర్వ్యూకు తక్కువ సమయం చిక్కినా స్వీయ క్రమశిక్షణ నా ప్రిపరేషన్‌ ప్రణాళికకు సహాయపడింది. ఇంటర్వ్యూలో factual based questionsఅడిగారు. అడిగిన ప్రశ్నలకు న్యాయం చేసేలా జవాబులు చెప్పాననుకుంటున్నాను. అందుకే దేశంలో అత్యుత్తమ పది ర్యాంకర్లలో ఒకడిగా నిలిచాను. అభ్యర్థులందరికీ నా సలహా ఒకటే. పరీక్షపై సరైన దృక్పథం పెంచుకోండి. అది పరీక్షలో మీ ర్యాంకును/ విజయాన్ని నిర్ణయిస్తుంది!

email: krishna.bhaskar@gmail.com

Monday 30 April 2012

అభిరుచితో అందలం...ఇంజినీరింగ్‌


ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. తమ కుమారుడు / కుమార్తెను ఏ కోర్సులో చేర్చితే వారి భవిష్యత్తు బాగుంటుంది, విదేశాల్లో ఉపాధి అవకాశాలకు వీలుంటుంది అనే అంశాలపై తల్లిదండ్రులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 


ప్రాంగణ నియామకాలు (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌) జరుగుతున్న కళాశాలల గురించి తెలుసుకుంటూ, వాటిలో సీటు దక్కాలంటే ఏ స్థాయి ర్యాంకు సాధించాలో పిల్లలకు గుర్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పర్యవేక్షణ, వారి ఆలోచనల మేరకు ఇంటర్‌ వరకు చదివినా... ఉపాధికి కీలకంగా భావిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యలో మాత్రం విద్యార్థుల అభిరుచికి ప్రాధాన్యం తప్పనిసరిగా ఇవ్వాలని వివిధ రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించవచ్చు? ఉన్నత జీవనానికి విద్యార్థి దశ నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలపై దిగ్గజ కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఏమంటున్నారు?

దేశ భౌగోళిక పరిస్థితులు, అత్యధిక జనాభా రీత్యా సదుపాయాల మెరుగుకు ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవారంగాలు (ఐటీఈఎస్‌), ఆటోమేషన్‌, టెలీ కమ్యూనికేషన్‌ వ్యాప్తి అధికమవుతోంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాల్లో టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పాస్‌పోర్ట్‌ దరఖాస్తు కూడా ఇ-సేవాకేంద్రాల్లో చేస్తున్నామంటే టెక్నాలజీ విస్తృతి వల్లే. ఈ పరిణామాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఇతర రంగాల్లోనూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కొరత ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

* మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున సివిల్‌ ఇంజినీర్లకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
* తయారీ రంగంలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ నిపుణుల అవసరం ఉంటుంది. ఏరోస్పేస్‌ రంగంలోనూ డిజైనింగ్‌ నిపుణులకు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.
* అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రవేశం వల్ల కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సులు చదివిన వారు కూడా ఐటీ ఉద్యోగాల్లో ఇమిడిపోతున్నారు.
* రోజువారీ పనులను మొబైల్‌ సాయంతో చేయగలిగే టెక్నాలజీ, కంప్యూటర్‌ నిర్వహణ ఖర్చులు తగ్గించే క్లౌడ్‌ విస్తృతి పెరుగుతోంది. కాబట్టి ఐటీ రంగంలో రాబోయే 2 దశాబ్దాలలోనూ మంచి ఉపాధి అవకాశాలే లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి సామర్థ్యాలు కావాలి?
దేశంలోని ప్రధాన ఐటీ సంస్థలకు అత్యధిక ఖాతాదారులు విదేశాల్లో ఉంటారు. వారికి కావాల్సిన ప్రాజెక్టులను ఐటీ కంపెనీలు ఇక్కడే రూపొందిస్తుంటాయి. అందుకే ఐటీ ఉద్యోగుల్లో 80 శాతం మంది ఇక్కడ పనిచేస్తుంటే, 20 శాతం మంది ఖాతాదారులకు సమీపంగా విదేశాల్లో పనిచేస్తుంటారు. విదేశీ సంస్థలకు ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అక్కడి బాధ్యులతో సమాచారం ఇచ్చి, పుచ్చుకునే (కమ్యూనికేషన్‌) బాధ్యత ఆ ప్రాజెక్టు చేపట్టిన బృంద సభ్యులే వహించాలి. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడటం వేరు. వారి హావభావాలకు అనుగుణంగా స్పందించవచ్చు. కనీసం ఆ వ్యక్తి ఎలా ఉంటారో కూడా తెలీకుండా ఫోన్‌, ఇ మెయిల్‌, ఛాటింగ్‌ పద్ధతుల్లో సమాచార మార్పిడి జరగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతుంది. ఎదుటివారిని ఆకట్టుకునేలా కమ్యూనికేషన్‌ ఉండాలి. అందుకే భావ ప్రకటనా సామర్థ్యం ఐటీ రంగంలో అత్యంత ముఖ్యం.

* ఏం చేస్తున్నాము, ఇంకా ఏమి కావాలి అనే అంశాలను వివరంగా, తడబాటు లేకుండా విశ్లేషించగలగాలి. సాంకేతికంగా అభ్యర్థిలో ఎంత నైపుణ్యం ఉన్నా, చెప్పలేకపోతే ఫలితం ఉండదు.
* వ్యాకరణ దోషాలు లేకుండా ఇంగ్లిష్‌లో సమాచారాన్ని పంపగలగాలి.
* ఒక్కో ప్రాజెక్టు ఒక్కో దేశంతో చేయాల్సి రావచ్చు. జర్మనీ, జపాన్‌, అమెరికా.. ఇలా ఒక్కో దేశానికి ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. అందుకు అనుగుణంగా వారితో మెలగాల్సి ఉంటుంది.
* జావా, ఎస్‌ఏపీ, డాట్‌ నెట్‌ లాంటి 20 రకాల కంప్యూటర్‌ లాంగ్వేజీలపై ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌లో అభ్యసించిన టెక్నాలజీతో పాటు ఎప్పటికప్పుడు కొత్త సామర్థ్యాలు నేర్చుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీలను త్వరగా గ్రహించగలగాలి.
* ఫలానా దేశం ప్రాజెక్టు వచ్చింది, వచ్చే వారంలో వెళ్లాలి అని కంపెనీ సూచించినప్పుడు, వెంటనే బయలుదేరగలగాలి. ఇంజినీరింగ్‌ దశలోనే దీనికి పునాది వేసుకోవాలి. సొంత ఇల్లు / బంధువుల వద్ద ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చే వారికంటే, హాస్టల్‌లో ఉండేవారు కొత్తవారితో త్వరగా కలిసిపోతారని, ఎక్కడికైనా వెళ్లేందుకు సంకోచించరన్నది కంపెనీల అభిప్రాయం.
* దేశాలతో పాటు ఖాతాదారుల రంగాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. బ్యాంకింగ్‌, తయారీ, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌ వంటి రంగాలకు ప్రాజెక్టులు చేయాల్సి రావచ్చు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొని అప్పగించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయగలగాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఇది సాధ్యం. విద్యార్థి దశ నుంచే దీనిపై దృష్టిపెట్టి వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి.

కళాశాలల పాత్ర కీలకం
వ్యక్తిగత మేథావితనం (బ్రిలియన్స్‌) కంటే ఒక బృందంగా విజయవంతం అయితేనే ఐటీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ప్రాజెక్టు పరిమాణానికి అనుగుణంగా ఒక్కో బృందంలో 5, 10, 50 మంది వరకు సభ్యులుగా ఉండవచ్చు. వీరంతా బృందంగా పనిచేస్తేనే ప్రాజెక్టు సక్రమంగా పూర్తవుతుంది. కళాశాలల్లో వ్యక్తిగత మూల్యాంకనానికే ప్రాధాన్యం లభిస్తోంది. ఈ పద్ధతిలో మార్పు అవసరం. కొన్ని కళాశాలలు మాత్రమే విద్యార్థులు బృందాల్లో పనిచేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిపెడుతున్నాయి.

ఎంతో ఒత్తిడి ఉండే ఐటీ ఉద్యోగంలో రాణించాలంటే మానసిక, శారీరక ఆరోగ్యం అత్యంత కీలకం. 20-30 ఏళ్ల వయస్సులో ఒత్తిడి తట్టుకుని పనిచేసినా, అనంతరం బీపీ, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మొబైల్‌, ల్యాప్‌టాప్‌పై పనిచేస్తున్నందున, ఎక్కడ ఉన్నా విధులకు అందుబాటులో ఉంటారు. దీనివల్ల కార్యాలయ విధులు, ఇంటి బాధ్యతల మధ్య విభజన చెరిగిపోతోంది. 24 గంటలూ ఫోన్‌ / కంప్యూటర్‌కు అతుక్కుపోకుండా, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఉండే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. యోగా, వ్యాయామం లాంటి వాటికి సమయం కేటాయించాలి. ఆఫీసు, వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సంరక్షణకు సరైన రీతిలో ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి దశ నుంచే దీన్ని అలవరచుకోవాలి.

* రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. విద్యార్థి దశలో రాత్రి 10-5 గంటల మధ్య నిద్రపోవాలి. విధుల్లో చేరాక నైట్‌షిఫ్ట్‌ ఉన్నా, అనువైన సమయంలో 7 గంటలు నిద్ర మానకూడదు.
* ఇంజినీరింగ్‌ నుంచే అభిరుచులను 1-2 అంశాలకు పరిమితం చేసుకోవాలి.
* మొబైల్‌, టీవీ, కంప్యూటర్‌ వినియోగించకుండా రోజులో కనీసం గంట లేదా అరగంట సమయం కుటుంబసభ్యులు లేదా సన్నిహితులతో నాణ్యంగా, ఆహ్లాదంగా గడపడం అలవర్చుకోవాలి.

కంప్యూటర్స్‌తో తేలిగ్గా ఉపాధి
బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణతతోనే ఐటీ రంగంలో ఉపాధి పొందే అవకాశం ఉంది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో అయితే మంచి కళాశాలల్లో పీజీ చేస్తేనే ఉన్నతోద్యోగాలు లభిస్తాయి. అందుకే ఇతర కోర్‌ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు కూడా చాలామంది ఐటీలో ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

* విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం కూడా ఐటీ ప్రాధాన్యం పెరగడానికి మరో కారణం. ప్రారంభ వేతనాలు కూడా ఈ రంగంలోనే అధికం. కానీ ఇవే కీలకమని భావించి, విద్యార్థికి ఇష్టం లేకుండా కంప్యూటర్‌ సైన్స్‌ / ఐటీ కోర్సులో చేరితే ఇబ్బందులు ఎదురుకావచ్చు.
* వేగంగా విశ్లేషించగలగడం, సత్వర నిర్ణయాలు తీసుకునే చాతుర్యం, గణితంపై ఆసక్తి ఉన్నవారు ఐటీ రంగంలో రాణిస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ చదివిన వారికి ఈ రంగం అనుకూలిస్తుంది.

ఎంపిక పద్ధతులివీ...
ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో జరిగే ప్రాంగణ నియామకాలతో పాటు కోర్సు పూర్తయ్యాక కూడా రాత పరీక్ష, బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌), ఇంటర్వ్యూ ద్వారా కంపెనీలు తమకు కావాల్సిన అభ్యర్థులకు ఎంపిక చేసుకుంటున్నాయి.

* రాత పరీక్షలో ఇంజినీరింగ్‌ పరిజ్ఞానంతో పాటు లాజికల్‌, క్విక్‌ థింకింగ్‌, మ్యాథ్స్‌పై ప్రశ్నలుంటాయి. కొన్ని కంపెనీలు మాత్రం తమకు అవసరమైన టెక్నాలజీలో కనీస నైపుణ్యాలు ఉన్నాయో లేదో కూడా పరీక్షిస్తున్నాయి.
* ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న అంశాలను ఎదుటివారితో ఎలా పంచుకుంటారనే విషయాన్ని పరీక్షించేందుకు బృంద చర్చ నిర్వహిస్తున్నారు.
* ఇంటర్వ్యూల్లో విద్యార్థులను టెక్నాలజీపై మరీ లోతుగా ప్రశ్నలు అడగరు. వారు చేసిన ప్రాజెక్టు వివరాలను ఆత్మవిశ్వాసంతో వివరించగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యంగా పరిశీలిస్తారు.

ఎంత శాతం మార్కులు అవసరం?
ప్రాంగణ నియామకాలు జరిగే వివిధ కళాశాలల్లో, అక్కడ ఎంపిక చేసుకునే విద్యార్థుల సగటు మార్కులు మారిపోతుంటాయి. కనీసం 65 శాతం మార్కులకు పైగా ఉన్నవారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.

దిగ్గజ కంపెనీలు ప్రాంగణ నియామకాలను అత్యున్నత విద్యాసంస్థలతో ప్రారంభిస్తాయి. ఐఐటీలు, ఐఐఎస్‌సీ, బిట్స్‌, నిట్‌, యూనివర్సిటీ ప్రాంగణ కళాశాలలు, పేరొందిన ప్రైవేటు కళాశాలలు.. ఈ క్రమంలో కళాశాలలకు వెళ్తాయి. ప్రైవేటు కళాశాలల ఎంపికలో, స్వతంత్ర సంస్థలు ఇచ్చే ర్యాంకులను, అక్కడి మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏటా కొత్త కళాశాలలను జత చేస్తుంటారు.

* ఒక కళాశాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల పనితీరును ఏడాది తరవాత పరిశీలిస్తారు. వారి పనితీరును ప్రామాణికంగా తీసుకుని, మరుసటి ఏడాది ఆయా కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరపాలో, వద్దో నిర్ణయించుకుంటారు.


కంపెనీలు అభ్యర్థుల్లో  గమనిస్తున్న లోపాలు ....  www.eenadu.net లో చూడండి.

Thursday 26 April 2012

కొత్త కోర్సులతో మేనేజ్‌మెంట్‌కు మహర్దశ!


మేనేజ్‌మెంట్‌ కెరియర్‌పై ఆసక్తి గల ఇంటర్మీడియట్‌ / 10+2 విద్యార్థులకు రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అవి... 1. మేనేజ్‌మెంట్‌లో డ్యుయల్‌ డిగ్రీ 2. ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / ఫార్మసీలతో కలిపి అందించే ఇంటెగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ. ఈ కోర్సులకు 2012-13 విద్యా సంవత్సరం నుంచే అనుమతి ఇవ్వనున్నట్టు ఏఐసీటీఈ చైర్మన్‌ ఎస్‌.ఎస్‌.మంథా ఇటీవల ప్రకటించారు. అమెరికా, యూకేలలో ఇలాంటి కోర్సులు బాగా అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో కూడా వీటికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఏఐసీటీఈ చొరవ తీసుకోవడం శుభ పరిణామం

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులతోపాటు మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగవుతాయి. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం... ఇంటర్‌/ +2 తర్వాత బీబీఏ + ఎంబీఏ డ్యుయల్‌ డిగ్రీ చేయవచ్చు. ఈ కోర్సులో మూడేళ్లు పూర్తిచేసినవారికి బ్యాచిలర్‌ డిగ్రీ, నాలుగేళ్లు చదివినవారికి అప్లయిడ్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ ఇస్తారు. ఈ డిగ్రీతో అవసరమైతే ఉద్యోగంలో చేరవచ్చు. కొన్నాళ్లు పనిచేసిన తర్వాత, రిజిస్ట్రేషన్‌ గడువులోగా మరో ఏడాది కోర్సు చేస్తే మాస్టర్స్‌ డిగ్రీ లభిస్తుంది.
ఈ కోర్సుల ప్రత్యేకతలు
విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి విభిన్న కోర్సులు చేయడానికి ఏఐసీటీఈ నిర్ణయం వీలు కల్పిస్తుంది. మేనేజ్‌మెంట్‌ విద్యను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఈ కోర్సులకు కింది ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవి...

* నిర్దిష్ఠ కాలం తర్వాత కోర్సు నుంచి వైదొలగిన వారికి సంబంధిత డిగ్రీ వస్తుంది. ఉదాహరణకు డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లో మూడేళ్ల తర్వాత కోర్సు నుంచి వైదొలగితే బీబీఏ వస్తుంది.
* కోర్సు మధ్యలో వైదొలగినా, రిజిస్ట్రేషన్‌ వ్యవధి పూర్తయ్యేలోగా మళ్లీ వచ్చి మిగతా భాగాన్ని పూర్తిచేయవచ్చు.
* యూజీ నుంచి పీజీ కోర్సుకు వెళ్లడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు.
* రెండు డిగ్రీలు వేర్వేరుగా చేస్తే పట్టే సమయం, అయ్యే ఖర్చుకంటే తక్కువ వ్యవధి, ఖర్చుతో ఆయా డిగ్రీలను సాధించవచ్చు.

ఉన్నత విద్యను ప్రణాళికా బద్ధంగా చదవడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఖర్చులు, సమయం పరంగా చూస్తే ఆర్థికంగా వెనుకబడిన వారికి వీటివల్ల ప్రయోజనం ఉంటుంది.


బహుముఖ పరిజ్ఞానంతో భవిష్యత్తు
సమస్యను బహుముఖ దృక్పథం నుంచి ఆలోచించి పరిష్కరించాలంటే వివిధ సబ్జెక్టుల్లో పరిజ్ఞానం అవసరం. అందుకే మల్టీ డిసిప్లీనరీ కోర్సులకు భవిష్యత్తులో డిమాండ్‌ పెరగనుంది. ఇంజినీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీతోపాటు మేనేజ్‌మెంట్‌ చదివిన వారికి ప్రత్యేక విలువ ఉంటుంది. అలాగే బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్‌ చేసిన అభ్యర్థులు సంపూర్ణ సామర్థ్యాలతో మేనేజర్లు అయ్యే అవకాశం ఉంటుంది. సబ్జెక్టును చాలాకాలం చదువుతారు కాబట్టి మేనేజ్‌మెంట్‌ సిద్ధాంతాలు, ఆచరణ, వృత్తిపై లోతైన అవగాహన ఏర్పరచుకోవచ్చు.

ప్రస్తుతం అందిస్తోన్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులు సంబంధిత బ్రాంచిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఐదేళ్ల డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ కోర్సుల ద్వారా అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను మరింత సమగ్రంగా తయారుచేయవచ్చు. మాస్టర్స్‌ డిగ్రీలో అందించే స్పెషలైజేషన్‌ అంశాలను ప్రణాళికా బద్ధంగా యూజీలో పొందుపరచడం ద్వారా మంచి కోర్సులు తయారవుతాయి. ఆర్నెళ్ల ఇంటర్న్‌షిప్‌ రూపంలో ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ అందించడం ఈ కోర్సుల మరో లక్ష్యం. సాధారణ పద్ధతిలో బీటెక్‌/ బీఫార్మ్‌, ఎంబీఏ చేయాలంటే ఆరేళ్లు పడుతుంది. డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ పద్ధతుల్లో ఐదేళ్లలోనే సమగ్రమైన నిపుణులను తయారు చేయడం వీలవుతుంది.

గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులు కంపెనీల్లో రకరకాల టీమ్‌లు, బాధ్యతల్లో పాలుపంచుకుంటారు. ఈ నేపధ్యంలో నిర్వహణ సామర్థ్యాలు, నైతికత, విలువలు, క్రమశిక్షణ, తదితర అంశాలు చాలా కీలకంగా మారతాయి. డ్యుయల్‌ డిగ్రీలు, ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా ఈ లక్షణాలను, సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. ఒకదానికొకటి సంబంధం ఉన్న విభిన్న అంశాల్లో పరిజ్ఞానం గల అభ్యర్థులు కంపెనీలకు చాలా అవసరం. దీనితోపాటు అభ్యర్థి కెరియర్‌ ఆసక్తిని కూడా దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను రూపొందించడం ఐదేళ్ల కోర్సుల్లో వీలవుతుంది.

మనదేశంలో డ్యుయల్‌ డిగ్రీలు
అమెరికా, యునైటెక్‌ కింగ్‌డమ్‌లలో డ్యుయల్‌ డిగ్రీ ఇంటెగ్రేటెడ్‌ కోర్సులు చాలా సంస్థల్లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అమెరికా విద్యాసంస్థలు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, యేల్‌, డ్యూక్‌, కార్నెల్‌, న్యూయార్క్‌ యూనివర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, తదితర సంస్థలు మేనేజ్‌మెంట్‌లో డ్యుయల్‌ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. టెక్నాలజీ + మేనేజ్‌మెంట్‌, నర్సింగ్‌ + హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, లా + మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు కూడా చాలా విదేశీ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి.

మనదేశంలో కూడా ఇటీవలి కాలంలో మాస్టర్స్‌, డాక్టొరల్‌ స్థాయుల్లో ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లు ప్రారంభమయ్యాయి. అనేక ప్రైవేటు సంస్థలు వీటిని అందిస్తున్నాయి. అలాంటి కొన్ని ప్రోగ్రామ్‌ల వివరాలు...

* బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ మనదేశంలో డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లను ప్రారంభించిన తొలితరం సంస్థ. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా బిట్స్‌ ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షిస్తోంది.

* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ బీఏ- ఎల్‌ఎల్‌బీ, బీకాం -ఎల్‌ఎల్‌బీ, బీబీఏ- ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కోర్సులు చేసినవారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

* ఐఐఎస్‌సీ బెంగళూరు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌, తదితర ప్రముఖ సంస్థలు డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి.

* ఐఐఎంలలో ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును మొదట ప్రారంభించిన సంస్థ ఐఐఎం -ఇండోర్‌. కంటెంట్‌ పరంగా ఇది మంచి ప్రోగ్రామ్‌.

* ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ ముంబయి, ఎన్‌ఎంఐఎంఎస్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లక్నో, వీఐటీ యూనివర్సిటీ, తదితర సంస్థలు ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌-ఎంబీఏ కోర్సును నిర్వహిస్తున్నాయి.

* అలహాబాద్‌ యూనివర్సిటీ కూడా ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మిగతా రెగ్యులర్‌ యూనివర్సిటీలు కూడా ఇదో బాటలో నడిచే అవకాశం ఉంది.

సరైన సామర్థ్యాలు లేకపోవడం వల్ల సాధారణ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని పరిశ్రమలు ఎప్పటినుంచో అంటున్నాయి. ఏఐసీటీఈ ప్రకటించిన డ్యుయల్‌, ఇంటెగ్రేటెడ్‌ డిగ్రీలు ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో లభించని అనేక సామర్థ్యాలు అభ్యర్థులకు ఈ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా సమకూరుతాయి.

ఈ కోర్సుల ప్రయోజనాలూ, ప్రతికూలతల  గురించి www.eenadu.net చదువు విభాగంలో చూడండి.

Tuesday 17 April 2012

ఎంపీసీ విద్యార్థులూ... మీ కోసమే!


    ఎంపీసీ విద్యార్థులు ఒక్కొక్క ప్రవేశపరీక్షను పూర్తి చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. ఐఐటీ- జేఈఈ రాసిన అనుభవ సారాన్ని మిగతా పరీక్షలకు ఎలా అన్వయించుకోవాలి? పకడ్బందీగా ఏ విధంగా సన్నద్ధం కావాలి? పరిశీలిద్దాం!
త నాలుగైదు సంవత్సరాల పేపర్లతో పోలిస్తే ఉదయం జరిగిన ఐఐటీ-జేఈఈ పేపరు- 1 సులభంగా ఉంది. కానీ, మధ్యాహ్నం జరిగిన పేపరు - II ని అభ్యర్థులు క్లిష్టంగా భావించారు. దీంతో ఈ పోటీలో ఎక్కడ ఉంటామో అనే ఒక సందిగ్ధావస్థలో పడిపోయారు.

మొదటి పేపరు బాగా సులభంగా ఉంది కాబట్టి జేఈఈలో మరీ ఇంత సులభమైన ప్రశ్నలు ఇవ్వరని ఎక్కువగా ఆలోచించి కొన్ని తప్పులు చేశారు. అదేవిధంగా పేపరు - II బాగా క్లిష్టంగా ఉండటంతో అక్కడ కూడా అధికంగానే తప్పులు చేశారు.

ఈ పోటీ పరీక్షలన్నిటిలో ర్యాంకు సాపేక్షంగానే ఉంటుంది. పరీక్ష ఏ విధంగా ఉన్నా అభ్యర్థి వాటిని తీసుకునే పద్ధతి ఒకే విధంగా ఉండాలి. అప్పుడు ఇంకా జరగబోయే ఏఐఈఈఈ, ఐశాట్‌, బిట్‌శాట్‌ లాంటి పరీక్షల్లో కూడా అనుకొన్న ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.

1. ప్రశ్న సులభంగా ఉంటే దానిని విపరీత అర్థాలు తీసి తప్పు జవాబులు గుర్తించకూడదు. ఉదా. భౌతికశాస్త్రంలో ఫిజికల్‌ ఆప్టిక్స్‌లో మొదటి పేపరులో ఇచ్చిన ప్రశ్న సాధారణ విద్యార్థి కూడా చాలా సులభంగా చేయగలది. దానిని అంత సులభంగా ఇవ్వరు, ఎక్కడో ఏదో మెలిక ఉంటుందని చాలామంది తప్పుగా గుర్తించారు.

అదేవిధంగా అకర్బన రసాయన శాస్త్రంలో పాఠ్యపుస్తకంలోని వ్యాఖ్యలను యథాతథంగా ఇచ్చినప్పటికీ చాలామంది తప్పు గుర్తించారు.

2. ఒక్కోసారి పేపరు కష్టంగా ఉందని అనిపించవచ్చు. 'ఇది సాపేక్ష పరీక్ష కాబట్టి మిగిలిన విద్యార్థుల కంటే ఒక ప్రశ్న అదనంగా చేయగలిగినా సీటు సాధించినట్లే' అనే దృక్పథంతో ఆలోచించాలి. ఇలా చేస్తే తప్పకుండా మంచి ర్యాంకు సాధించుకోవచ్చు.

ముందుగానే 'కటాఫ్‌' ప్రకటన
ఐఐటీ-జేఈఈ ప్రారంభమయిన తర్వాత ఫలితాల ముందే కటాఫ్‌ ప్రకటించడం అనేది తొలిసారి ఈ ఏడాదే జరిగింది. జనరల్‌ కేటగిరీలో సబ్జెక్టు కటాఫ్‌ 10 శాతంగా, మొత్తం కటాఫ్‌ మార్కులు 35 శాతంగా నిర్ణయించారు. ఓబీసీలో అయితే జనరల్‌ కేటగిరిలో 90 మార్కులు కటాఫ్‌గా, ఎస్‌.సి./ఎస్‌.టి./వికలాంగుల కేటగిరీ అయితే జనరల్‌ కేటగిరీ కటాఫ్‌లో 50 శాతం మార్కులు వీరి కటాఫ్‌గా ప్రకటించారు.



ప్రతి సబ్జెక్టులో 136 మార్కుల చొప్పున మొత్తం రెండు పేపర్లలో కలిపి 408 మార్కులకు పరీక్ష జరిగింది. ఈ కటాఫ్‌ మార్కుల పైన వచ్చిన ప్రతి అభ్యర్థికీ ర్యాంకు వస్తుంది. కానీ ఐఐటీలలో సీటు సాధించుకునే ర్యాంకు అంటే మాత్రం జనరల్‌ కేటగిరీలో 170 మార్కులపైనే సాధించవలసి ఉంటుంది.

ఏ మార్కుకు ఏ ర్యాంకు?
ఐఐటీ-జేఈఈలో సుమారుగా ఏ మార్కుకు ఏ ర్యాంకు వచ్చే అవకాశం ఉందో ఓ అంచనా ఇక్కడ చూద్దాం. ఇది కేవలం విద్యార్థి అవగాహన కోసమే కానీ కచ్చితమైన నిర్థారణ కాదు.



ఈ విశ్లేషణలో అర్థం చేసుకోవలసింది- పేపరు సులభంగా ఉంటే సీటు సాధించుకోవడానికి సాధించవలసిన మార్కు పెరుగుతుంది. పేపరు క్లిష్టంగా ఉంటే ఆ మార్కు తగ్గుతుంది. కానీ సాపేక్షంగా విద్యార్థి స్థాయి మారదు. ఈ విషయం అర్థం చేసుకుని పరీక్ష కాల వ్యవధిలో ఒక అవగాహనతో తెలిసిన ప్రతి ప్రశ్నకూ తప్పు లేకుండా సమాధానాలు గుర్తించగలగాలి. అప్పుడు పరీక్ష ఏదయినా కచ్చితంగా నెగ్గినట్లే!

ఏఐఈఈఈ సంగతి?
ఏఐఈఈఈ ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 29నే కాబట్టి ఈ మిగిలిన పది రోజుల్లో కొత్త అంశాలను చదవడానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. వీలైనన్ని నమూనా గ్రాండ్‌ టెస్టులు రాస్తుండాలి. ప్రతి పరీక్షలో చేసిన తప్పులు విశ్లేషించుకోవాలి.

ఈ పరీక్ష రాసే ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకోవాల్సిన అంశం- ప్రశ్నపత్రంలో అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయాల్సిన అవసరం లేదు. నేర్చుకున్న అంశాలను తప్పు లేకుండా సక్రమంగా గుర్తించగలిగితే సరిపోతుంది.

*  అధికశాతం రెండో సంవత్సర సిలబస్‌లోనే ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందుకే ద్వితీయ సంవత్సర సిలబస్‌కు సమయం ఎక్కువ కేటాయించుకుంటే మేలు.
*  ఆన్‌లైన్‌లో పరీక్షకు దరఖాస్తు చేసివున్నట్లయితే వీలైనన్ని నమూనా పరీక్షలు కంప్యూటర్‌పై అభ్యాసం చేయాలి. 65 శాతం పైన మార్కులు సాధించగలిగితే మంచి ఎన్‌.ఐ.టి.లో సీటు సాధించినట్లే!


బిట్ శాట్ సంసిద్ధమయ్యే  తీరు తెలుసుకోవడానికి  ఈ వారం ఈనాడు ‘చదువు’ ఇంటర్నెట్ ఎడిషన్ చూడండి-    http://archives.eenadu.net/04-16-2012/Specialpages/chaduvu/chaduvuinner.aspx?qry=topstory1