ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 24 June 2013

ఎలా సాధించారు... ఈ టాపర్లు?

ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీటు తెచ్చుకోవటమే గొప్ప విజయం. అలాంటిది ఆ ప్రవేశపరీక్షలో అందరికంటే ముందు నిలిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించటం మామూలు విషయం కాదు! దేశవ్యాప్తంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షించే జేఈఈ  అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో- భావనలపై స్పష్టత, లోతైన అవగాహన, అనువర్తన సామర్థ్యాలు ప్రధానం. వీటి సమ్మేళనంతో ప్రథమ, ద్వితీయ ర్యాంకులను కైవసం చేసుకున్న సాయి సందీప్‌, రవిచంద్రలు 'చదువు'తో తమ అనుభవాలు పంచుకున్నారు!


కల నిజమైంది!
రాష్ట్రస్థాయి ఎంసెట్‌లో స్టేట్‌ టాపర్‌... జాతీయస్థాయి ఐఐటీ ప్రవేశపరీక్షలో ఆలిండియా టాపర్‌! విశిష్టమైన ఈ 'డబుల్‌' సాధించిన పి. సాయిసందీప్‌రెడ్డి 'మొదటి నుంచీ నా గురి ఐఐటీపైనే' అని ముందే సంకల్పం ప్రకటించాడు. తన కలను అపురూప స్థాయిలో నిజం చేసుకున్నాడు. తన విజయప్రస్థానం ఎలా సాగిందో అతడి మాటల్లోనే...

 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అఖిలభారత స్థాయి మొదటి ర్యాంకు ముందుగా వూహించిందే! ఫలితం తెలిశాక ఆరు సంవత్సరాల కష్టం ఫలించిందని సంతృప్తి కలిగింది. అయితే ఇదంతా ఇష్టపడే చదివాను.

జేఈఈ మెయిన్స్‌కు వారం ముందునుంచీ నా ఆరోగ్యం బాగా లేదు. దీంతో పరీక్ష సరిగా రాయక ఫలితం ఆశించినట్టు రాలేదు. విచారంగా అనిపించింది. ఇలాంటి సమయంలో నిరాశతో కుంగిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకవసరమైన ప్రోత్సాహాన్ని ఆ సమయంలో అమ్మా నాన్నా అందించారు. దీంతో పట్టుదలగా నెలన్నర చదివాను.

మ్యాథ్స్‌లో ఒక జవాబును తప్పుగా బబ్లింగ్‌ చేశాను. అది గమనించినప్పటికీ బాల్‌పెన్‌ వాడాలనే నిబంధన వల్ల ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం లేకుండాపోయింది. ఐదు మార్కులు పోయాయి. బాధ వేసినా 'పోతే పోయింది' అని సమాధానపర్చుకున్నాను. ఆ ప్రభావం మిగతావాటిపై పడకుండా జాగ్రత్తపడ్డాను. ఫస్ట్‌ర్యాంకు వచ్చాక మాత్రం ఆ లోటు పోయింది!

ఈ ర్యాంకు సాధించటానికి నా సరదాలన్నీ పూర్తిగా త్యాగం చేశాననుకోవద్దు. రెండు వారాలకో సినిమా చూసేవాణ్ణి. హారీపోటర్‌ కథల పుస్తకాలు ఇష్టంగా చదివేవాణ్ణి.

గుడివాడ విశ్వభారతిలో ఏడోతరగతి నుంచే ఈ ఐఐటీ ప్రయాణానికి తొలి అడుగులు పడ్డాయి. నాకు అబ్దుల్‌కలామ్‌ స్ఫూర్తి. ఇంజినీర్‌ని కావాలని మొదట్నుంచీ లక్ష్యంగా ఉండేది. అందుకే స్కూల్‌ రోజుల్లో కూడా గణితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాణ్ణి. ఇక ఐఐటీ ప్రవేశపరీక్షకు అసలైన కృషి శ్రీ చైతన్య నారాయణలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం నుంచీ మొదలైంది.

కృషే ప్రధానం
ర్యాంకుల మీద మొదట్లో నాకేమీ దృష్టి లేదు. సిలబస్‌ మొత్తం పూర్తిగా అర్థం చేసుకోవాలి. చేతనైనంత వరకూ బాగా కృషి చేయాలి అనేదే ప్రధానంగా ఉండేది. ఏ విద్యార్థికైనా సెకండియర్‌కి వచ్చేటప్పటికి ఒక అవగాహన వస్తుంది. ఏ టాపిక్‌ రిఫర్‌ చేయాలి, ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, రివిజన్‌కు ఎంత సమయం కేటాయించాలి... ఇవన్నీ తెలుస్తాయి.

నా ఉద్దేశంలో ఐఐటీ ప్రవేశపరీక్షలో విజయానికి పాత్ర వహించే బోధన, ప్రిపరేషన్ల నిష్పత్తి 10: 90. అంటే సరైన మార్గదర్శకత్వంలో విద్యార్థి చాల సాధన చేయాలి. ఐఐటీ ప్రవేశపరీక్షలో కెమిస్ట్రీ స్కోరింగ్‌.. ముఖ్యంగా ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ సమయం దీనికి కేటాయించి చదివాను.

ఐఐటీలో పరీక్షావిధానం వూహించినట్టుగా ఉండదు. అనూహ్యమైన తీరులో ప్రశ్నలు వచ్చినా, దానికి సిద్ధంగా ఉండాలి. భయపడకుండా, ఒత్తిడికి గురవకుండా ఆ పరిస్థితికి తగ్గట్టుగా తయారై పరీక్ష రాయాలి.

ఆశావహుల సంగతి
ఐఐటీకి గురిపెడితే ఎంసెట్‌ లాంటి పరీక్షల్లోనైనా ర్యాంకు వస్తుందని ఐఐటీకి సన్నద్ధం కావడం మంచిది కాదు. అప్పుడు రెంటికీ దూరం కావాల్సివస్తుంది. ఎవరికి వారు తమ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేసుకుని దేనికి సన్నద్ధం కావాలో నిర్ణయించుకోవాలి.

ఐఐటీ ప్రవేశపరీక్షకు సిద్ధమవ్వాలనుకున్నవారికి కనీస స్థాయి తెలివితేటలు, కష్టపడే తత్వం అవసరం. సగటున రోజుకు 12 గంటలు చదవగలగాలి. మొదట లక్ష్యం పెట్టుకుని, టాపిక్‌వారీగా ప్రణాళిక వేసుకోవాలి. ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి. లోతుగా చదవాలి. పూర్తి ఏకాగ్రత అవసరం.

మొదటి సంవత్సరంలో సిలబస్‌ అన్ని అంశాలూ చదవాలి. తర్వాత కొన్ని టాపిక్స్‌ మీద కేంద్రీకరించి లోతుగా అధ్యయనం చేయాలి. ఏ విద్యార్థికైనా కొన్ని కాన్సెప్టులు అర్థం కాకపోవచ్చు. అది మామూలే. ఆ సందేహాలను అధ్యాపకుల దగ్గర తీర్చుకోవాలి. స్పష్టత తెచ్చుకోవాలి. గ్రాండ్‌ టెస్టుల ద్వారా తమ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ కృషి చేయాలో తెలుసుకోవచ్చు.

ఎలా చదివానంటే..
ఐఐటీ ప్రవేశపరీక్షకు ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు సరిపోవు. వాటిలో ప్రాథమికాంశాలుంటాయి. వాటినే ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ కోసం లోతుగా అధ్యయనం చేశాను. కళాశాల వారిచ్చిన మెటీరియల్‌కు అదనంగా కొన్ని పుస్తకాలు చదివాను.

మ్యాథ్స్‌: ఆర్‌.డి. శర్మ, ఎంటీజీ పబ్లికేషన్స్‌ సిరీస్‌ ఫిజిక్స్‌: హెచ్‌సీ వర్మ, ఐ.ఇ. ఇరొడొవ్‌ కెమిస్ట్రీ: అట్కిన్స్‌, వేడ్‌ జూనియర్‌, జేడీ లీ

పాత ప్రశ్నపత్రాలను సాధన చేశాను. అన్ని సబ్జెక్టులకూ క్లుప్తంగా నోట్స్‌ తయారు చేసుకున్నాను. రివిజన్‌లో- చాలా వేగంగా ఓసారి చూసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడింది.

ఏమిటి తేడా?
ఇంటర్మీడియట్‌లో/ ఎంసెట్‌లో తెలిసినవే వస్తాయి. చదివిన అంశాలను అప్త్లె చేయాల్సిన అవసరం ఉండదు. ఐఐటీ ప్రవేశపరీక్ష అలా కాదు. దీనిలో అప్లికేషన్‌ ప్రధానం. చదివిన కాన్సెప్టుల్ని అప్త్లె చేయగలగాలి.

ఇంటర్మీడియట్‌ తరహా పరీక్షకు అలవాటు పడటంవల్లనే విద్యార్థులకు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఎంతో క్లిష్టం అనిపిస్తోంది. నిజానికిది అంత కష్టం కాదు. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీఈ కంటే తక్కువే. చక్కని ప్రణాళికతో సమయం వృథా చేయకుండా కష్టపడితే ఎవరైనా ఐఐటీ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించవచ్చు.

saisandeep192@gmail.com



కోరిక తీరింది!
ఎంసెట్‌లో తొమ్మిదో ర్యాంకు...  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మరింత ముందుకు దూసుకువెళ్ళి ద్వితీయ ర్యాంకును సాధించాడు అద్దంకి రవిచంద్ర. వివిధ ప్రతిభా పరీక్షల్లో ఉపకార వేతనాలూ, అవార్డులూ, స్వర్ణ పతకాలూ పొందటం ఇతడి ప్రత్యేకత. ఐఐటీ ప్రవేశపరీక్షలో మేటి ర్యాంకు తెచ్చుకోవాలన్న చిరకాల లక్ష్యం చేరుకున్న రవిచంద్ర సన్నద్ధత తీరు... ఇతర విశేషాలూ తన మాటల్లోనే తెలుసుకుందాం!


నా ఐఐటీ ప్రయాణం హైదరాబాద్‌ నల్లకుంటలో శర్మ ఇన్‌స్టిట్యూట్‌లో ఎనిమిదో తరగతి నుంచి మొదలైంది. సీరియస్‌గా మాత్రం ఇంటర్మీడియట్‌ నుంచే...! ఐఐటీ ప్రవేశపరీక్షలో టాప్‌ టెన్‌లో ఏదో ఒక ర్యాంకు తెచ్చుకోవటం మొదట్నుంచీ నా లక్ష్యంగా ఉండేది. దీనికి ఉపాధ్యాయుల, అధ్యాపకుల ప్రోత్సాహం కారణం.
ఐఐటీ ప్రవేశపరీక్ష కోసం సిద్ధమవటం కష్టమనిపించలేదు. ఎందుకంటే సరదాగా చదివాను. సబ్జెక్టు మీద అమిత ఇష్టంతో చదివాను. టీవీ, ఇంటర్నెట్‌లు చూడటం తగ్గించాను. జేఈఈ మెయిన్స్‌లో మార్కులు తగ్గి టాప్‌ టెన్‌లో నాకు ర్యాంకు రాలేదు. దీంతో నిరాశ పెరిగి, ప్రేరణ మందగించింది. ఈ సంకట పరిస్థితిలో నా మిత్రులూ, తల్లిదండ్రులూ చక్కని వాతావరణం కల్పించారు. అడ్వాన్స్‌డ్‌కు మిగిలిన మిగతా ఒకటిన్నర నెలలూ బాగా చదవటానికి తోడ్పడ్డారు.

రెండు పరీక్షల భేదాలు
ఐపీఈకీ, ఐఐటీ ప్రవేశపరీక్షకూ తేడా చెప్పాలంటే... మొదటిది చదువుకుని, కొన్ని గుర్తుంచుకుని రాస్తే చాలు. జ్ఞాపకశక్తికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కానీ ఐఐటీ ఎంట్రన్స్‌కు జ్ఞాపకశక్తి మరీ అంత ఎక్కువ అవసరం లేదు. ఆలోచించగల సామర్థ్యం కావాలి. దీనిలో అనువర్తన (అప్లికేషన్‌) భాగం ఎక్కువ పరీక్షిస్తారు. ఎంసెట్‌కు వేగం కావాలి. అన్ని ప్రశ్నలూ అందరూ జవాబులు రాయగలరు. కానీ సమయం సరిపోకపోవటమే సమస్య. ఐఐటీ ఎంట్రన్స్‌కు అంత వేగం అక్కర్లేదు.

ఐపీఈకి సిద్ధమై ఐఐటీ ప్రవేశపరీక్ష రాయాలంటే కష్టం. దీనిలో చాలా లోతుగా చదవాలి కాబట్టి. ఐపీఈలో ప్రాథమికాంశాలను బట్టీకొట్టి రాసి మార్కులు తెచ్చుకోవచ్చు. ఐఐటీ కోసం జరిగే పరీక్షలో ఆ అంశాలను నిజజీవిత పరిస్థితుల్లో అనువర్తించగలగాలి.

శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థ వారిచ్చిన మెటీరియల్‌ 80 శాతం ఉపయోగపడింది. అది కాకుండా చదివినవి...

మ్యాథ్స్‌: టీఎంహెచ్‌ పబ్లిషర్స్‌- మ్యాథ్స్‌ ఫర్‌ ఐఐటీ జేఈఈ ఫిజిక్స్‌: ఇరొడొవ్‌ కెమిస్ట్రీ: బహదూర్‌, హిమాంశు పాండే, గోపీ టాండన్‌

ఇష్టముంటే సులభమే
ఐఐటీలో సీటు సాధించాలనుకునేవారికి సబ్జెక్టు మీద ఆసక్తి ఉండాలి. రోజూ సగటున 6-7 గంటల సమయమైనా సాధన చేస్తుండాలి. టాపర్‌గా నిలవాలంటే మాత్రం 10 గంటలు చదవాల్సిందే. దీంతో పాటు మంచి మార్గదర్శకత్వం ఉండాలి. సబ్జెక్టుకు సిద్ధమవటాన్ని ఇష్టంగా ఆస్వాదించాలి. అప్పుడు తెలియకుండానే సులువుగా అనిపిస్తుంది.

ఈ పరీక్షలో విజయానికి బోధన ప్రాముఖ్యం 20 శాతం మాత్రమే. మిగతా 80 శాతం విద్యార్థి సన్నద్ధత మీదే ఆధారపడివుంటుంది. పూర్వ ప్రశ్నపత్రాలు 5-6 సంవత్సరాలవి సాల్వ్‌ చేయాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో విశ్లేషించుకోవాలి. వాటిని సవరించుకోవటానికి అధ్యాపకుల సహాయం తీసుకోవాలి. 'ఎంత చదివాం' అన్నది కాదు. 'ఎంత సాధన చేశాం' అన్నదే ముఖ్యం. పరీక్షలో భయం, ఓవర్‌ యాంగ్జయిటీ ఉండకూడదు. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి.

ravichandra.addanki95@gmail.com