ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday 23 January 2013

ఎంసెట్... నీట్ - సన్నద్ధత ఎలా?





    ఎంసెట్‌-నీట్‌... ఏ పరీక్ష రాయాల్సివచ్చినా, ఒకవేళ రెండూ రాయాల్సివచ్చినా బైపీసీ విద్యార్థులు తయారుగా ఉండటం మేలు. అనుకూల అంశాలను గుర్తుచేసుకుంటూ ఆశావహ దృక్పథంతో ప్రణాళిక వేసుకోవాలి; ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత కొనసాగించాలి!

ఇంటర్మీడియట్‌ బైపీసీ విభాగంలోని ప్రవేశపరీక్షలకు దాదాపు 1,25,000 మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పరీక్షల్లో ఏది ఖరారవుతుందనే విషయంపై అనిశ్చితి ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తుండటమే సరైన చర్య.

బైపీసీ విభాగంలో జరిగే పోటీ పరీక్షల్లో సబ్జెక్టుపై అవగాహన ఎంత అవసరమో ఆత్మవిశ్వాసం అంతకంటే ఎక్కువ అవసరమవుతోంది. ప్రణాళికతో తయారు కాగలిగితే ఈ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

జరగబోయే నీట్‌, ఎంసెట్‌ రెండు పరీక్షలూ ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లలో ప్రవేశాలు నీట్‌ ద్వారా జరిగితే; మిగిలిన కోర్సులైన యునానీ, ఆయుర్వేదిక్‌, హోమియోపతి, అగ్రికల్చరల్‌ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్‌, ఫార్మసీ, నర్సింగ్‌ లాంటి కోర్సుల్లో ప్రవేశం ఎంసెట్‌ ద్వారా జరిగే అవకాశం ఏర్పడుతోంది. నీట్‌ గురించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడేలోపు సంశయం కంటే సన్నద్ధత  చాలా అవసరం.

ఎంసెట్ 2012 : 
మార్కుల, ర్యాంకుల విశ్లేషణ 


తయారయ్యేదెలా?
* సీనియర్‌ ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి, మార్చి మొదటివారంలో థియరీ పరీక్షలూ ప్రారంభమవుతున్నాయి కాబట్టి సీనియర్‌ ఇంటర్‌ ఆఖరి పరీక్ష మార్చి 19వ తేదీ వరకూ రెండో సంవత్సరం సిలబస్‌కే పరిమితమై చదవాలి.

* ఇంటర్‌ పరీక్షకు VSAQప్రశ్నలపై బాగా తయారైతే అది ఎంసెట్‌కు కూడా ప్రయోజనం.

* చాలామంది ఈ సమయంలో మొదటి సంవత్సరం సిలబస్‌ పునశ్చరణ అని సమయాన్ని నష్టపరుచుకుని సీనియర్‌ సిలబస్‌ పూర్తికాక ఒత్తిడికి గురవుతుంటారు. అలా కాకుండా మార్చి 19 వరకూ ఆబ్జెక్టివ్‌తో కలిపి రెండో సంవత్సరం సిలబస్‌ సంపూర్ణంగా పూర్తిచేయగలిగితే ఆ తర్వాత ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణకు కావలసిన సమయం దొరుకుతుంది.

* ఇంటర్‌ అకాడమీ పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదివినా సరిపోతుంది. నీట్‌కు అయితే అదనంగా బోటనీ, జువాలజీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కూడా కచ్చితంగా చదవాలి. అయితే ఈ అదనపు అంశాలు మార్చి 19 తర్వాత చదువుకోవచ్చు.

* ఇంటర్‌ పరీక్షల ముందు నెలరోజులు పాఠాలు వినడం కంటే విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి ప్రయత్నిస్తే అధికలాభం. సందేహాలు వస్తే వెంటనే అధ్యాపకుల సాయంతో నివృత్తి చేసుకోవచ్చు.

* కొంతమంది ఒక వారం ఒక సబ్జెక్టు పూర్తిచేయాలని ప్రయత్నిస్తూవుంటారు. అయితే ఒకే సబ్జెక్టు అంత ఎక్కువ కాలం చదివితే అవగాహనలోపం ఏర్పడవచ్చు. ఇతర సబ్జెక్టులు ఎక్కువకాలం చదవలేదు కాబట్టి మనసులో వాటిపై భయం పెంచుకుని, ఆ సబ్జెక్టులు కూడా సరిగా చదవలేరు. అందుకే వీలైనంతవరకూ ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులూ చదవాలి (పరీక్షల సమయంలో తప్పించి).

* సిద్ధాంతపరమైన ప్రశ్నలు చదివినపుడు ఆకళింపు చేసుకోలేకపోతే కొంత సమయం లెక్కలు చేసి, మళ్ళీ సిద్ధాంతపరమైన భాగాలను చదివితే సరిపోతుంది.

* ఈ సమయంలో కొత్త అంశాలు చదవకుండా, చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటే ఆత్మస్త్థెర్యం పెంచుకోవచ్చు.

* ఎంసెట్‌ బైపీసీ విభాగంలో 160 మార్కులకు 115 మార్కులపైన సాధించగలిగితే సీటు సాధించినట్లే. ఆ మార్కులు పొందాలంటే బయాలజీలో 75, కెమిస్ట్రీలో 35, ఫిజిక్స్‌లో మిగిలిన మార్కులు సాధించగలిగితే సరిపోతుంది. పట్టున్న సబ్జెక్టులో అధిక మార్కులు సాధించటం ముఖ్యం!

పూర్తి కథనం కోసం  www.eenadu.net చదువు విభాగం చూడండి! 
   

Wednesday 9 January 2013

మే 10న ఎంసెట్‌


ఈనాడు హైదరాబాద్‌ :ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సుల ప్రవేశపరీక్షల తేదీలతోపాటు ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ నిర్వహణ, తరగతుల ప్రారంభం తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ప్రకటించింది. ఇలా జరగడం ఉన్నత విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం.

సుప్రీంకోర్టు ఆదేశాలతో 'అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)' జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఏడు ప్రవేశపరీక్షల తేదీలను వెల్లడించారు. నిరుడు ఎంసెట్‌ మే 12న జరగ్గా, ఈసారి రెండు రోజులు ముందుగా మే 10న జరుగనుంది. ఐసెట్‌ అదే నెల 17న ఉంటుంది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఇంజినీరింగ్‌(పీజీఈసెట్‌) తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయి. ఎడ్‌సెట్‌(బీఈడీ), వ్యాయామవిద్య(పీఈసెట్‌), న్యాయవిద్య(లాసెట్‌, పీజీలా) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం(ఈసెట్‌) తరగతులు జులైలో వేర్వేరు తేదీల్లో మొదలవుతాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్‌, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయప్రకాష్‌రావు, ఇతర అధికారులతో కలసి ఉపముఖ్యమంత్రి ఈ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలిపారు.



2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లోనే చేపడతామని స్పష్టంచేశారు. రుసుములు, ప్రవేశాల నియంత్రణ సంఘం(ఏఎఫ్‌ఆర్‌సీ) పటిష్ఠతకు సంబంధించిన చట్టాన్ని రానున్న శాసనసభ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ సీట్ల భర్తీపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఉత్తర్వులు జారీచేస్తామన్నారు. బోధనా రుసుములు చెల్లించకుంటే జనవరి 21 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలను మూసేస్తామన్న యాజమాన్యాల ప్రకటనపై విలేఖరులు ప్రశ్నించగా- దానిపై తానేమీ మాట్లాడనని రాజనర్సింహ బదులిచ్చారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు పూర్తికావొచ్చాయన్నారు. చివరిసారిగా ప్రాంతీయ, రాష్ట్రస్థాయి బృందాల తనిఖీలను జరపబోతున్నామని వివరించారు. తనిఖీ నివేదికలను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన: ఈసారి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎంసెట్‌ ర్యాంకులను ప్రకటిస్తామని అజయ్‌జైన్‌, జయప్రకాష్‌రావు వెల్లడించారు. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు మలివిడత కౌన్సెలింగ్‌లో అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. ఏటా అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తొలుత మార్కులను ప్రకటించి, ఈ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంసెట్‌ ర్యాంకులు సాధించే వారు తక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈదఫా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల ఆధారంగానే అధికారులు ర్యాంకులను ప్రకటించబోతున్నారు.