ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 14 May 2012

మీరు టెట్ రాస్తున్నారా?

టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఈ సారి ఉద్విగ్న భరితంగా జరగనుంది. టెట్‌ కేవలం అర్హతా పరీక్షే కాకుండా డీఎస్సీలో 20 మార్కుల వెయిటేజీ కూడా ఉంటుంది. తద్వారా డీఎస్సీలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది టెట్‌ స్థాయిలోనే అభ్యర్థులకు దాదాపు తెలిసిపోతుంది. మరో 17 రోజుల్లో టెట్‌ పరీక్ష జరగబోతుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఉండటం సహజం. ఈ కొద్దిపాటి సమయాన్ని టెట్‌లో గరిష్ఠ మార్కులు సాధించడానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

చాలామంది అభ్యర్థులు టెట్‌లో అర్హత మార్కులు 'ఎలాగోలా' వస్తే చాల్లే అని, స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తి శక్తియుక్తుల్ని వినియోగించరు. నామమాత్రంగా చదువుతారు. ఇది సరైన ధోరణి కాదు. ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలో 'ఎలాగోలా బతికేద్దాం అని ఇక్కడికి రాలేదు' అని హీరో అంటాడు చూడండి, అలాగే మీరు కూడా ఉన్నత లక్ష్యంతో టెట్‌ యుద్ధానికి సిద్ధమవండి. డీఎస్సీలో ప్రభావం చూపే టెట్‌లో మీ మార్కుల లక్ష్యం పైన పట్టికలో చూపించిన విధంగా ఉండాలి.

పేపర్‌ కఠినత్వం సగటు స్థాయిగా ఉందనుకుంటే... మొత్తం మీద 115 - 120 మధ్య స్కోరు చేయగల్గితే డీఎస్సీలో మంచి వెయిటేజీ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్థాయిలో మీ ప్రిపరేషన్‌ ఉంటే విజయవంతం అయినట్లే. లేకుంటే ఈ 17 రోజుల్లో ఏమి చేసి లక్ష్యం సాధించాలో తెలుసుకుందాం.

శిశు వికాసం - పెడగాజి
సిలబస్‌ కింద చాలా అంశాలు ఉండటంతో ఈ విభాగంపై అభ్యర్థులు సాధారణంగా కొంత వ్యతిరేకత పెంచుకుంటారు. 2012 జనవరి టెట్‌లో పెడగాజి (10 ప్రశ్నలు), అభ్యసనం (8), శిశువికాసం (8), వైయక్తిక భేదాలు (2), మూర్తిమత్వం (2) ప్రశ్నలు అడిగారు. పాఠ్యాంశాల విభజన మళ్లీ దాదాపుగా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ విభాగంపై ఇంకా సరైన పట్టు దొరకలేదు అనుకునేవారు, ఉన్న సమయంలో కింది అంశాలపై దృష్టిపెట్టడం మంచిది.

* పెడగాజిలోని సిలబస్‌ని జనరల్‌గా చదవండి. అక్కడక్కడ మెథడ్స్‌ అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్ని కూడా అనుసంధానం చేసుకొని చదివితే రెండు విధాలుగా ప్రయోజనం లభిస్తుంది.

* 'అభ్యసనం' విభాగంలో ప్రశ్నలు అన్నీ బీఎడ్‌ / డీఎడ్‌ పుస్తక సమాచారంలోనివే కాబట్టి, అకాడమీ పుస్తకాల సహాయంతో అభ్యసన భావనలు బాగా చదవాలి.

* 'శిశువికాసం' విభాగంలో... వికాసం - పెరుగుదల ప్రధానాంశాలుగా కన్పిస్తున్నాయి. ఈ విభాగంలో 1-5 పాఠాలను క్షుణ్నంగా చదివి, 6, 7, 8 పాఠాల్ని సాధారణ స్థాయిలో చదివితే సరిపోతుంది.

* తరగతి గది, పాఠశాల, ఉపాధ్యాయుడు, పిల్లలు, పరిసరాలు మొదలైన అంశాలను, వాటి గురించి ఊహించుకుంటూ చదివితే పెడగాజిలో మార్కులు సులభంగా సాధించవచ్చు.

తెలుగు భాష
2011 టెట్‌ పేపర్‌ చూసి చాలామంది అభ్యర్థులు ఈ విభాగాన్ని సులభంగా భావించారు. కానీ 2012 (జనవరి) పేపర్‌ చూసి కారణాలు ఏవైనప్పటికీ బాగా ఒత్తిడికి లోనయ్యారు. నిజానికి 'తెలుగు భాష' కింద ఇచ్చిన 30 ప్రశ్నలలో అత్యధిక ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. కాకపోతే వ్యాకరణ ప్రశ్నల్ని కంటెంట్‌ ఆధారంగా అడగటం (సాధారణ ఉదాహరణలలో కాకుండా), వాడుకలో లేని పదాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒత్తిడికి లోనై ఉంటారు. 'శిశు విషాణం' అర్థం, బహువ్రీహి సమాసానికి ఛాయిస్‌లో ఇచ్చిన పదాలు, 'ఉప్పు' కోసం ఇచ్చిన పొడుపు కథ... ఇబ్బందులు కలిగించాయని భావించవచ్చు. ఏది ఏమైనా టెట్‌లో అత్యధిక స్కోరు సాధించటం లక్ష్యం కాబట్టి అభ్యర్థులు కింది అంశాలపై దృష్టి పెట్టాలి.
* సిలబస్‌లో పేర్కొన్న పాఠ్యాంశాల అధారంగా పద్యాల్ని తెలుగు వ్యాకరణ అంశాలతో అనుసంధానం చేసుకొని అధ్యయనం చేయాలి. నేరుగా వ్యాకరణ అంశాలు చదవకూడదు.

* పెడగాజి కింద 6 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వ్యాకరణం చదివి, 'అంతా చదివేశాం' అనుకోకుండా భాషా బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు తెలుగు పండితులకు ఉండాల్సిన లక్షణాలపై కూడా పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌ భాష
అధికశాతం అభ్యర్ధులు ఈ విభాగాన్ని సహజంగా కష్టమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్ధులు దీని గురించి ఒత్తిడికి లోనవుతారు. కంటెంట్‌లో ఎక్కువ మార్కులు సాధిద్దామని ఇంగ్లిష్‌ భాషను దాదాపు వదిలేస్తారు. ఇప్పటికే బాగా ప్రిపేరై ఉంటే మంచిదే. ఇంకా సరైన పట్టు సాధించకుంటే అందుబాటులో ఉన్న సమయంలో కింది అంశాలపై దృష్టిపెట్టి కనీసం 10 మార్కుల వరకు అదనంగా పొందే అవకాశం ఉంది. ముందుగా 2012 (జనవరి) ప్రశ్నల్ని పరిశీలిస్తే, ఎగ్జామినర్‌ పెట్టుకున్న ప్రమాణాలు ఇలా ఉన్నాయి.

వాడుకలో ఉపయోగించే పదాల్ని కాకుండా క్లిష్ట పదాల్ని ఎక్కువగా వినియోగించటం వల్ల ప్రశ్నే అర్థం కాకపోవటంతో అభ్యర్ధులు బాగా మార్కులు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే అభ్యర్థులకు ఇంగ్లిష్‌ పేపర్‌, చందమామ (జూనియర్‌) లాంటివి చదివే అలవాటు ఉండాలి. ఈ 17 రోజుల్లో అది సాధ్యం కాదు కాబట్టి... ఇచ్చిన సిలబస్‌ సంబంధిత పాఠ్యగ్రంధాల్ని రోజూ కనీసం ఓ గంట పెద్దగా చదవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. చదివేటప్పుడే అర్థం కాని పదాలుంటే డిక్షనరీ ద్వారా అర్థం తెలుసుకోవాలి. ఈ అర్థాలను ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటూ పునశ్చరణ చేయటం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. గత పరీక్షను పరిశీలిస్తే..

* నేరుగా పదాలకు వ్యతిరేక, సమానార్థాలు అడగకుండా ఒక వాక్యంలో ఏదో ఒక పదం ఎంచుకొని పరిశీలించడం జరిగింది. పైన పేర్కొన్న మెలకువ దీనికి కూడా ఉపయోగపడుతుంది.

* గ్రామర్‌ అంశాలపై ఆధారపడిన ప్రశ్నలు అధికంగా ఉన్నాయి. అందువల్ల పరీక్ష వరకు రోజుకో అంశానికి 1 గంట సమయం కేటాయించి సాధన చేయడం అవసరం.

* పెడగాజి కింద ఇచ్చిన 6 ప్రశ్నలు సాధారణ స్థాయివే. అభ్యర్థి తాను టీచర్‌ అయితే బోధన చేయడానికి ఎలాంటి మెలకువలు పాటించాలి అని ఆలోచిస్తూ అధ్యయనం చేస్తే చాలు. కొద్దిపాటి శ్రమతో ఈ విభాగం నుంచి 4-5 మార్కులు సులభంగా సాధించవచ్చని మరవద్దు. 10 గంటల సమయం కేటాయిస్తే ఈ విభాగంపై పట్టు కచ్చితంగా ఏర్పడుతుంది.

టెట్‌ పేపర్‌ 1 రాసినా, పేపర్‌ 2 రాసినా, ఈ విభాగాల ప్రిపరేషన్‌ని ఇదే శైలిలో అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

 ఈ 17 రోజుల్లో చేయాల్సినవి...
* ప్రతి విభాగంపై స్థూల అవగాహనని పెంచుకునే దిశలో చదవాలి.
* కీలక పాఠ్యాంశాలకే పరిమితం అవ్వండి.
* కీలక పాఠ్యాంశాలపై పట్టు ఉంటే మిగిలిన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి.
* 14, 15 తేదీలలో ఒకట్రెండు నమూనా పరీక్షలు రాయండి. మార్కులు బేరీజు వేసుకొని, లోపాల పరిష్కారం కోసం మిగతా 15 రోజుల్ని కేటాయించండి.
* 'చదివింది బాగుంది' అని స్వీయ ప్రేరణ పొందుతూ అసంతృప్తిని దూరం చేయండి.
* పరీక్షకు వారం ముందు ఎలాంటి నమూనా పరీక్షలు రాయవద్దు.

* 'ఇవి తరువాత చదువుదాం' అనే వాయిదాలు వద్దు. ఇదే ఆఖరి రివిజన్‌ అనుకుంటూ ఒక్కో అంశం ముగించేయండి.
* కీలక అంశాలు కాకపోతే కొత్త పాఠ్యాంశాలు చదవడం ఈ దశలో వద్దు.
* ఇతరులతో పోల్చుకుంటూ ఒత్తిడికి లోనై, జ్ఞాపకశక్తికి ఇబ్బందులు కలగజేయవద్దు.

* మార్కెట్లో దొరికే అనేక పుస్తకాలలో విస్తృత సమాచారం ఉంది. ఆ సమాచారం చూసి 'ఇది చదవలేదు, అది చదవలేదు' అని టెన్షన్‌కు గురికావద్దు. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలు, తెలుగు అకాడమి పుస్తకాలకే ప్రస్తుతం పరిమితం అవ్వండి.

* ఇంపార్టెంట్‌ బిట్స్‌ అంటూ వాటిని చదవద్దు. బిట్‌బ్యాంక్‌ లాంటివి పునశ్చరణకు ఉపయోగించాలే కాని వాటిని ప్రధానంగా చదవద్దు.

పూర్తి కథనం కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.

Monday 7 May 2012

సివిల్స్ లో ... ఏపీ టాపర్‌ గెలుపు గాథ!

సివిల్‌ సర్వీస్‌ సాధించటమంటే అదెంతో ప్రత్యేకం. అందులోనూ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవటం మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. ఏడాది వ్యవధిలో 90వ ర్యాంకు నుంచి 9వ ర్యాంకుకు ఎదిగిన పట్టుదలా, కృషీ కృష్ణ భాస్కర్‌ ది! తన విజయగాథలోని మలుపులూ, విశేషాలను 'చదువు' పాఠకులకు తనే స్వయంగా వివరిస్తున్నాడీ టాపర్‌!

మ్మా నాన్నలు ఐఏఎస్‌ అధికారులు! ఇంకేం? సివిల్స్‌ను నా కెరియర్‌గా ఎంచుకోవటం చాలా సహజమని అందరూ ఊహించారు. కిందటి సంవత్సరం సివిల్స్‌లో 90వ ర్యాంకు తెచ్చుకోగానే సివిల్స్‌లో చేరటం 'బాల్యం నుంచీ నా కల' అయివుంటుందని చాలామంది అంచనాకు వచ్చారు!
కానీ వాస్తవం వేరు. సివిల్స్‌ ఆలోచన నాకు కలిగింది కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే... ప్రైవేటు రంగంతో సంబంధం ఏర్పడిన తర్వాతే!

పాఠశాల చదువు ఒకచోటే ఉండటం మంచిదని సాధారణ అభిప్రాయం. అమ్మానాన్నల బదిలీల మూలంగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా పాఠశాలల్లో నేను చదవాల్సివచ్చింది. ఇలా వివిధ ప్రాంతాలు మారటం నాకు మేలే చేసింది. ప్రతి స్కూల్లోనూ విభిన్న వాతావరణం, సదుపాయాల్లో తేడాలు, రకరకాల మనుషులు, ఉపాధ్యాయులు... విస్తృత అనుభవాలు సంపాదించుకోగలిగాను. ఐఏఎస్‌ను సాధించాలనే అభిలాషకు ఇవి అంతర్లీనంగా పనిచేశాయనిపిస్తుంది. ఈ వృత్తిలోనే కదా వైవిధ్యకరమైన అనుభవాలకు ఆస్కారముండేది... నిస్సారమైన క్షణాలకెప్పుడూ తావుండనిది!

ఐఐటీలో బీటెక్‌
బేగంపేట- హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్లో 1998లో నా పదో తరగతి పూర్తయింది. తర్వాత రత్న జూనియర్‌ కాలేజీలో చేరాను. ఐఐటీ ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ (ఎలక్ట్రికల్‌)లో ప్రవేశించాను. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కొద్దికాలం ఓ ప్రముఖ సంస్థలోని పరిశోధన విభాగంలో పనిచేశాను. నా అర్హతలు పెంచుకోవాలని నిర్ణయించుకుని 2008లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) లో చేరాను... మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో!

ఐఎస్‌బీ అంటే తెలిసిందే కదా? అక్కడి గ్రాడ్యుయేట్లలో చాలామంది భారీ వేతనాలతో ప్రైవేటు కొలువుల్లో చేరిపోతుంటారు. ఇక్కడే సివిల్‌ సర్వీసెస్‌ గురించి ఆలోచనలు నాలో మొదలయ్యాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం 'ఉద్యోగ భద్రత' గురించి దృష్టిపెట్టేలా చేసిందనుకోండీ. అమ్మానాన్నలతో చర్చించాను. నిర్ణయాన్ని నా విచక్షణకే వారు వదిలేశారు.

ప్రైవేటు ఉద్యోగంలో చేరకపోవటం వల్ల విలువైన సమయాన్నీ, అనుభవాన్నీ కోల్పోతున్నానని తెలుసు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కొలువుల్లో చేరనివారికి ఒకటి రెండు సంవత్సరాల తర్వాత తగిన ఉపాధి అవకాశాలుండవు కదా!

అయినప్పటికీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సిద్ధమై, అత్యుత్తమంగా రాయాలని నిర్ణయించుకున్నాను!

రీక్ష రాయాలని నిశ్చయించుకున్నాక నా మేనేజ్‌మెంట్‌ తరగతుల్లో సంపాదించిన పరిజ్ఞానంపై ఆధారపడ్డాను. Why winners winగురించి చాలా సెషన్లు జరిగేవి. వీటన్నిటిలోనూ ఒక వాస్తవం కనపడేది. విజేతలందరూ తామెంచుకున్న రంగాల్లో నిపుణులు. బాగా కష్టపడతారు. మౌలికాంశాలను విస్మరించరు.

విపరీతమైన పోటీ ఉండే సివిల్స్‌ పరీక్ష రాయదల్చినపుడు అభ్యర్థికి సరైన వాతావరణం, సరైన mentor ఉండాలి. ఢిల్లీలో కొన్ని ఇన్‌స్టిట్యూషన్లు చూశాను కానీ హైదరాబాద్‌ వాతావరణమే సౌకర్యంగా ఉంటుందనిపించింది. అన్నిటికీ మించి ఒక Mentorను ఎంచుకోవటం ముఖ్యమనేది తెలిసింది. అంటే... మన ఎదుగుదలపై నిజమైన ఆసక్తి ఉండి శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రేరణను అందించగలిగే వ్యక్తి! ఆ వ్యక్తి తండ్రి కావొచ్చు, పొరుగు వ్యక్తి, అధ్యాపకుడు, స్నేహితుడి తండ్రి.. ఎవరైనా కావొచ్చు. స్నేహితుల సలహా మేరకు బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణను కలిశాక, నా mentorను ఆయనలో గుర్తించాను.

సుదీర్ఘంగా సాగిన కౌన్సెలింగ్‌లో ఆప్షనల్స్‌ను ఎంచుకోవటం చాలా కీలకమని ఆయన వివరించారు. లాభనష్టాలను బేరీజు వేసుకుని, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలను ఎంచుకున్నాను. మొదటి సబ్జెక్టు- పరీక్ష తీరు, జనరల్‌స్టడీస్‌ను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. రెండో సబ్జెక్టు- సమాజాన్నీ, దాని సమస్యలను ఆకళింపు చేసుకోవటానికి ఉపకరించింది. అదీ గాక రుజువైన 'ట్రాక్‌ రికార్డు', తక్కువ సమయంలో చాలామంది విద్యార్థులు అర్హత సాధించిన చరిత్ర ఈ సబ్జెక్టులకుంది. ఈ ఆప్షనల్స్‌ను తీసుకుని తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించిన కార్తికేయ మిశ్రా (IIM Ahmedabad)నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.

ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు రెంటికీ ఉమ్మడి విధానంలో శిక్షణ తరగతులకు హాజరయ్యాను. ఐదు నెల్లకంటే ఎక్కువ సమయం కోచింగ్‌కి హాజరవ్వటానికి కేటాయించదల్చలేదు. ఎందుకంటే... ఈ పరీక్షకు spoon feeding కంటే స్వీయ సన్నద్ధతే ముఖ్యమని నాకు తెలుసు. అందుకే ఐదు నెల్ల శిక్షణ తర్వాత ప్రిలిమినరీకి సొంత టైమ్‌ టేబుల్‌ తయారు చేసుకున్నాను.

నా మొదటి ప్రయత్నంలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విషయంలో చాలా కృషి చేయాల్సివచ్చింది. ప్రిలిమినరీ కోసం సూక్ష్మ అంశాలను సైతం అవగాహన చేసుకోవాలి కదా! (ఆ ఏడాది ప్రిలిమ్స్‌లో ఒక ఆప్షనల్‌, జనరల్‌ స్టడీస్‌ ఉన్నాయి). ఆప్షనల్‌ కవర్‌ చేశాక, జనరల్‌ స్టడీస్‌మీద దృష్టి పెట్టాను.

ప్రిలిమినరీ నెగ్గాను.

తర్వాత వెంటనే ఆంత్రపాలజీపై మనసు కేంద్రీకరించాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలకు సంబంధించి writing practiceఎంతో చేశాను. మౌలిక పాఠ్యపుస్తకాలపై, ఆప్షనల్స్‌ స్టడీ మెటీరియల్‌పై ఆధారపడ్డాను. జనరల్‌స్టడీస్‌లో పదాల పరిమితి, ప్రశ్నపత్రం తీరు ముందుగా తెలియదు కాబట్టి ఆ ప్రిపరేషన్‌ను ఆ open ended గానే సాగించాను. అదృష్టవశాత్తూ ఆప్షనల్స్‌లో ఎక్కువ ప్రశ్నలు అంచనాల మేరకే వచ్చాయి. తేలిగ్గానే వాటికి జవాబులు రాశాను.

మెయిన్స్‌ ఫలితాలు వచ్చాక ఇంటర్వ్యూకు సిద్ధమయ్యాను. బయోడేటా, కరంట్‌ అఫైర్స్‌పై సన్నద్ధమవ్వాలనే సూచన పాటించాను. రెండు నమూనా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. 'ఏం చెపుతున్నావన్నది కాకుండా ఎలా చెపుతున్నావన్నదే ప్రధానం' అని నా mentorపదేపదే చెప్పారు. నిజాయతీగా ప్రవర్తించటం కూడా ముఖ్యమనేది మరో అంశం. ఈ వ్యూహం ఫలించి నా తొలి ప్రయత్నంలో 90వ ర్యాంకు సాధించాను. (ఆప్షనల్స్‌లో బాగా స్కోర్‌ చేశాను. ఇంటర్వ్యూలో 330కు 230 మార్కులు వచ్చాయి.) ఐఏఎస్‌కు అర్హత పొందుతానని భావించాను. అయితే 'రిస్క్‌' తీసుకోవద్దన్న సలహా మేరకు మళ్ళీ ప్రిలిమినరీకి సిద్ధమయ్యాను. అదే మంచిదైంది. ఎందుకంటే... మూడు మార్కుల తేడాతో ఐఏఎస్‌ తప్పిపోయి, ఐపీఎస్‌ వచ్చింది.


ఆగస్టులో ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చాయి. అక్టోబర్లో మెయిన్స్‌. రెండోసారి మెయిన్స్‌ రాయటం మొదటిసారంత కష్టమనిపించలేదు. తొలి ప్రయత్నంలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడింది. జనరల్‌స్టడీస్‌ కోసం ప్రాథమికాంశాలను మరోసారి సరిచూసుకున్నాను; కరంట్‌ అఫైర్స్‌ చదువుతూపోయాను. మెయిన్స్‌ రాసి, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ పోలీస్‌ అకాడమీ (హైదరాబాద్‌)లో ప్రవేశించాను.

పోలీస్‌ సర్వీసెస్‌లో శిక్షణ అద్భుతమైన అనుభవం. శారీరకంగా, మానసికంగా అవసరమైన క్రమశిక్షణను ఇది అందిస్తుంది. నా శిక్షణను చాలా ఆస్వాదిస్తూ వచ్చా. మార్చిలో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించారు. ఐపీఎస్‌ కఠోర శిక్షణ మూలంగా ఇంటర్వ్యూకు తక్కువ సమయం చిక్కినా స్వీయ క్రమశిక్షణ నా ప్రిపరేషన్‌ ప్రణాళికకు సహాయపడింది. ఇంటర్వ్యూలో factual based questionsఅడిగారు. అడిగిన ప్రశ్నలకు న్యాయం చేసేలా జవాబులు చెప్పాననుకుంటున్నాను. అందుకే దేశంలో అత్యుత్తమ పది ర్యాంకర్లలో ఒకడిగా నిలిచాను. అభ్యర్థులందరికీ నా సలహా ఒకటే. పరీక్షపై సరైన దృక్పథం పెంచుకోండి. అది పరీక్షలో మీ ర్యాంకును/ విజయాన్ని నిర్ణయిస్తుంది!

email: krishna.bhaskar@gmail.com