ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Friday 22 February 2013

ఎంసెట్‌ నగారా


ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్రుతతో ఎదురు చూస్తోన్న ఎంసెట్‌ ప్రకటన వెలువడింది. ఎంపీసీ విద్యార్థుల విషయంలో స్పష్టతతో, బైపీసీ విద్యార్థులకు సంశయం కొనసాగిస్తూ ఈ నోటిఫికేషన్‌ రూపొందింది. మంచి భవితకు బాట కోసం ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధన అత్యవసరం. దీనికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాల్సిన తరుణమిది!

పోటీ పరీక్ష ఏదైనా దానికి తయారయ్యే విధానం, మానసిక సంసిద్ధత.. ఈ రెండు అంశాల మేరకే ఫలితాలుంటాయి. కష్టపడి చదవడం తప్పనిసరే కానీ, నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడటం ముఖ్యం. అప్పుడే గెలుపు సులభమవుతుంది. కానీ చాలామంది విద్యార్థులు ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వక నష్టపోతున్నారు.

ప్రణాళికకు అంత ప్రాధాన్యం ఎందుకో ఒక్క ఉదాహరణ ద్వారా చూద్దాం.
ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని అనుకుందాం. ఒక విద్యార్థి హిందీలో 90 మార్కులు, మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 92 మార్కులు తెచ్చుకున్నాడని అనుకుందాం. వేరొక విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో 99 లేదా 100 మార్కులు తెచ్చుకుంటూ ఒక సబ్జెక్టులో హిందీ కాకుండా 90 మార్కులు సాధించాడని అనుకుందాం.

ఈ ఇద్దరిలో మొదటి విద్యార్థికి 10 గ్రేడ్‌ పాయింట్‌ అంటే 10/10, రెండో విద్యార్థికి 9.8 గ్రేడ్‌ పాయింట్‌ అంటే 9.8/10 వచ్చినట్లు అవుతుంది. మార్కులపరంగా చూస్తే మొదటి విద్యార్థి మార్కులు కేవలం 550/600. మరి రెండో విద్యార్థి మార్కులు 590/600 వరకూ ఉండే అవకాశముంది. మరి ఈ ఇద్దరిలో తేడా అంటే ప్రణాళిక మాత్రమే.

మారిన గ్రేడింగ్‌ విధానం అర్థం చేసుకుని ప్రాధాన్యం గుర్తించి చదివిన విద్యార్థి 10/10 తెచ్చుకుంటే అవగాహన లేక ప్రణాళిక లేకుండా చాలా కష్టపడి కూడా రెండో విద్యార్థి తెచ్చుకున్నది 9.8/10 మాత్రమే. కాబట్టి మార్కులు సాధించాలంటే కష్టపడాల్సిందే. అయితే అవగాహనతో సరైన ప్రణాళికతో కష్టపడి చదివితే కచ్చితంగా మేటి ర్యాంకుకు అవకాశం ఉంటుంది.


ప్రకటన ప్రకారం...
ఇంజినీరింగ్‌, మెడికల్‌, డెంటల్‌, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్‌, ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతిల ప్రవేశానికి ఎంసెట్‌ ర్యాంకు ఉపయోగపడుతుంది.

ఈ పరీక్ష రాయడానికి నిబంధనలు చూస్తే... భారతీయులై, ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు లేదా సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు అర్హులు. రిజర్వేషన్‌ కేటగిరీలలో ఉన్న విద్యార్థులకు 40 శాతం మార్కులు సరిపోతాయి.

* బయోటెక్నాలజీలో చేరాలంటే బైపీసీ విద్యార్థులు లెక్కలులో బ్రిడ్జి కోర్సు పరీక్ష పాసై ఉండాలి.
* ఇంజినీరింగ్‌, ఫార్మసీలైతే విద్యార్థికి డిసెంబరు 31, 2013 లోపు 16 సంవత్సరాలు పూర్తి అయివుండాలి. గరిష్ఠ వయః పరిమితి లేదు.

* మెడికల్‌ విభాగంలో అయితే డిసెంబరు 31, 2013లోపు విద్యార్థి 17 సంవత్సరాలు పూర్తిచేసి ఉండాలి. అలా కాని పక్షంలో ప్రవేశ అర్హత లభించదు. అలాగే గరిష్ఠ వయః పరిమితి జనరల్‌ కేటగిరి అయితే 22 ఏళ్ళు, రిజర్వేషన్‌ కేటగిరి అయితే 25 సంవత్సరాలు.

ఎలా సంసిద్ధమవ్వాలి?

ఇంటర్‌ పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షల ఆఖరు తేదీ మార్చి 19 వరకూ ఇంటర్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది.

ఇంటర్‌లో మూడు రకాల ప్రశ్నలుంటాయి. LAQ, SAQ, VSAQవీటిలో సాధారణ విద్యార్థులు LAQ, SAQలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి చదువుతారు. కచ్చితంగా మంచి మార్కులు లేదా నూరు శాతం మార్కులు సాధించాలనే ధ్యేయంతో ఉన్నవారు అధికంగా VSAQలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే అకాడమీ పుస్తకాలు చదవడంతో బాటు ఆబ్జెక్టివ్‌ ఓరియెంటేషన్‌లో కూడా తయారీ కావాలి.

అకాడమీ పుస్తకాలు చదవడం అంటే చివర్లో ఉన్న ప్రశ్నలు జవాబులు మాత్రమే కాకుండా పాఠ్యాంశం కూడా పూర్తిగా కనీసం ఒక్కసారైనా చదివి ఉండాలి. సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యేవరకూ ఈ సిలబస్‌కు పరిమితమై ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళాలి.

కాలవ్యవధి స్వల్పంగా ఉంది కాబట్టి రాని అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చదవడం సరికాదు. దానికి బదులు- వచ్చిన అంశాలనే ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేసుకుంటూ వెళితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షలో కూడా వేగం పెరుగుతుంది.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల తర్వాత ఎంపీసీ విద్యార్థులు అయితే జేఈఈ- మెయిన్స్‌కు తయారవుతుంటారు. 10 రోజుల్లో జూనియర్‌ సిలబస్‌ పూర్తి చేసుకుని మిగిలిన వారం రోజులూ గ్రాండ్‌ టెస్టులు నిర్వహించుకోవడం మేలవుతుంది.

ఆ తర్వాత ఎంసెట్‌, బిట్‌శాట్‌ రెండు పరీక్షలకూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ రెండింటినీ పునశ్చరణ చేసుకుంటూ నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువగా రాయాలి. ఎంసెట్‌లో రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి జవాబు తెలియనప్పటికీ ప్రతి ప్రశ్నకూ ఏదో ఒక జవాబు రాసే చాన్స్‌ తీసుకోవచ్చు. ఏప్రిల్‌ ఆఖరు వారం నుంచి గ్రాండ్‌ టెస్టులు రాయడం ప్రారంభించాలి.

బైపీసీ విద్యార్థులు అయితే మార్చి 19 తర్వాత కనీసం 20 రోజులు ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణ చేసుకోవాలి. సిలబస్‌ను చిన్న భాగాలుగా విభజించి నమూనా పరీక్షల రూపంలో అభ్యాసం చేయాలి. బయాలజీ విద్యార్థులు అధికశాతం నష్టపోవడానికి కారణాలు.. సబ్జెక్టుపై అవగాహన లేక కాదు! వాటిని ప్రశ్నల రూపంలో తర్ఫీదు పొందకపోవడమే. అందుకే వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. ఇక్కడ కూడా రుణాత్మక మార్కుల్లేవు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు గుర్తించకుండా వదిలి వేయాల్సిన అవసరం లేదు.

ఎంపీసీ లేదా బైపీసీ ఏ విభాగం అయినా మన అకాడమీ పుస్తకాలకు మాత్రమే పరిమితమైనా ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన తయారీ ఏ విద్యార్థికయినా విజయం సాధించిపెడుతుంది!

(పూర్తి కథనం కోసం www.eenadu.net లో చదువు విభాగం చూడండి..)

No comments:

Post a Comment