ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 6 March 2012

మేటి సంస్థల్లో పీజీ కోసం ఉమ్మడి బయోటెక్‌ పరీక్ష!

త్యుత్తమ విద్యాసంస్థల్లో బయోటెక్నాలజీ చదివిన అభ్యర్థులకు మంచి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
 
న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అనేక ప్రముఖ సంస్థల్లో బయోటెక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష (కంబైన్డ్‌ బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌- సీబీఈఈ)ను నిర్వహిస్తోంది.

దేశంలోని 32 ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ పరీక్ష ఆధారంగా ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. సరైన ప్రణాళిక రూపొందించుకొని కృషి చేస్తే మంచి యూనివర్సిటీలో సీటు సాధించవచ్చు.

బయోటెక్నాలజీలో ఉన్నత స్థాయి పరిశోధనలు నిర్వహిస్తోన్న దేశాల్లో భారత్‌ అగ్రశ్రేణిలో ఉంది. మానవ జీనోమ్‌ ప్రాజెక్టు, మూలకణ పరిశోధన, జన్యు పరివర్తిత పంటలకు సంబంధించి మనదేశంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ) ఏర్పాటైంది.

  బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేయాలనుకునే విద్యార్థులు ఈ విభాగం అనేక రకాల ఫెలోషిప్‌లను అందిస్తోంది. సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని పరిశోధన సంస్థల్లో కూడా బయోటెక్నాలజీ సంబంధిత పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలో ప్రవేశానికి తొలిమెట్టు లాంటిది జేఎన్‌యూ బయోటెక్‌ ఎంట్రన్స్‌ పరీక్ష. దీని ద్వారా మంచి సంస్థలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తే... సీఎస్‌ఐఆర్‌, డీబీటీ ఫెలోషిప్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తేలిక.


సీబీఈఈ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లోని బయోటెక్నాలజీ కోర్సుల్లో సుమారు 400 సీట్లు భర్తీకానున్నాయి. వీటిలో ప్రవేశం పొందినవారికి నెలకు రూ.800 నుంచి రూ.1200 వరకు ఫెలోషిప్‌ లభిస్తుంది. ఎంపిక సీబీఈఈలో ర్యాంకు ఆధారంగానే ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులో యూనివర్సిటీల ఆప్షన్స్‌ను గుర్తించాలి. జులై మొదటి లేదా రెండోవారంలో అభ్యర్థుల ర్యాంకు, ఆప్షన్స్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

బయోటెక్నాలజీ అభ్యర్థులకు విదేశాల్లో కూడా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలుంటాయి. మనదేశంలో బెంగళూరు బయోటెక్‌ పార్క్‌, లక్నో బయోటెక్‌ పార్క్‌, గుర్గావ్‌ బయోటెక్‌ పార్క్‌, హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ, ఐసీఐసీఐ నాలెడ్జ్‌ పార్క్‌... ఇలా అనేక కేంద్రాలు ఏర్పడుతున్నాయి. బయోటెక్నాలజీ అభ్యర్థులకు వీటిలో ఉద్యోగ అవకాశాలుంటాయి.

సీబీఈఈ ద్వారా అభ్యర్థులు బయోటెక్నాలజీలో ఆధునిక స్పెషలైజేషన్లను కూడా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు గోవా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. మెరైన్‌ బయోటెక్నాలజీ కోర్సును నిర్వహిస్తున్నాయి. సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీని అందిస్తోంది. అస్సాంలోని తేజ్‌పూర్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌సి. మాలెక్యులర్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ ఉంది. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సంస్థలు ఈ ప్రత్యేక కోర్సులను నిర్వహిస్తున్నాయి. బయోటెక్‌ కోర్సులు చేసినవారికి ప్రైవేటు రంగంలో స్థాపించిన బెంగళూరు, లక్నో, గుర్గావ్‌లలోని బయోటెక్‌ పార్కులు, హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ, ఐసీఐసీఐ నాలెడ్జ్‌ పార్క్‌ లాంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది?
సీబీఈఈ పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి.

* పార్ట్‌ - ఎ: దీనిలో +2 స్థాయిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, బయాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 60 మార్కులకు ఈ విభాగం ఉంటుంది. తప్పు సమాధానానికి అరమార్కు తీసేస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో 40 ప్రశ్నలకు అభ్యర్థులు అందరూ సమాధానాలు గుర్తించాలి. సెక్షన్‌-2 (20 ప్రశ్నలు), సెక్షన్‌-3 (20 ప్రశ్నలు)లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. బయాలజీ విద్యార్థులు సెక్షన్‌-3, మేథ్స్‌ అభ్యర్థులు సెక్షన్‌-2లోని ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు.

* పార్ట్‌ - బి: ఇందులో డిగ్రీ స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. మొత్తం 180 మార్కులకు ఈ పేపర్‌ ఉంటుంది. ఫిజిక్స్‌ + మేథ్స్‌ నుంచి 40 ప్రశ్నలు, బయాలజీ (బోటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ) నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. 60 ప్రశ్నలకంటే ఎక్కువగా సమాధానాలు గుర్తించకూడదు. ఒకవేళ గుర్తించినా వాటిని పరిగణనలోకి తీసుకోరు. మొదటి 60 ప్రశ్నలనే మూల్యాంకనం చేస్తారు. తప్పు సమాధానానికి ఒక మార్కు తీసేస్తారు.

సన్నద్ధత ఎలా?
సీబీఈఈ రాయబోతున్న అభ్యర్థులు పరీక్ష సిలబస్‌ను, ప్రశ్నల స్వభావాన్ని క్షుణ్నంగా తెలుసుకొని ప్రిపరేషన్‌ ప్రణాళిక తయారు చేసుకోవాలి. పరీక్షలో ఏ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది తెలుసుకోవడానికి పాత ప్రశ్నపత్రాలను చూడవచ్చు. అంశాల వారీగా మంచి మెటీరియల్‌ను సేకరించుకోవాలి. సబ్జెక్టులోని ప్రాథమిక భావనలపై పట్టు ఉంటేనే ఈ పరీక్షలో మంచి ర్యాంకు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది. సబ్జెక్టును వివరంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. చదివిన అంశాన్ని వాస్తవిక పరిస్థితులకు అన్వయించి లోతుగా అర్థం చేసుకోవాలి.

పార్ట్‌- ఎ: ఇందులో మంచి మార్కులు తెచ్చుకోవడానికి సీబీఎస్‌ఈ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పుస్తకాలు ఉపయోగపడతాయి. తెలుగు అకాడమీ ప్రచురించే ఇంటర్మీడియట్‌ పుస్తకాలు కూడా చదవచ్చు. డిగ్రీలో బీజడ్‌సీ తీసుకున్న అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సిలబస్‌ను కూడా చదవాలి. ఫిజిక్స్‌లో మెకానిక్స్‌, ఎలక్ట్రో స్టాట్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌, ఆప్టిక్స్‌; మ్యాథ్స్‌లో మాత్రికలు, డెరివేటివ్స్‌, కాలిక్యులస్‌, త్రికోణమితి మొదలైనవి ముఖ్యమైన అంశాలు.

పార్ట్‌-బి: దీని కోసం చదివేటప్పుడు బయాలజీ అభ్యర్థులు.... ఆధునిక బయాలజీలో బయో టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీఎస్సీలో వీటిని చదివుంటే బోటనీ, జువాలజీలపై శ్రద్ధపెట్టాలి. బయో కెమిస్ట్రీలో... మెటబాలిజమ్స్‌, ఎంజైమ్స్‌, ఇమ్యునాలజీ; మైక్రో బయాలజీలో జనరల్‌, ఇండస్ట్రియల్‌, అప్లయిడ్‌ మైక్రోబయాలజీ, మైక్రోబియల్‌ ఇంటరాక్షన్స్‌; మాలెక్యులర్‌ బయాలజీ, జెనెటిక్స్‌ సిలబస్‌లో మెండిలీయన్‌ జెనెటిక్స్‌, ట్రాన్‌స్క్రిప్షన్‌, టాన్స్‌లేషన్‌, ఆర్‌.డి.ఎన్‌.ఎ. టెక్నాలజీ, మాలెక్యులర్‌ టెక్నిక్స్‌ అంశాలను బాగా నేర్చుకోవాలి.

* వృక్షశాస్త్రంలో... వృక్ష శరీర ధర్మ శాస్త్రం, ఎకాలజీ, పరిణామం; జంతుశాస్త్రంలో... జంతు శరీర ధర్మశాస్త్రం, ఏనిమల్‌ బయోటెక్నాలజీ, పర్యావరణ జీవశాస్త్రం; ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో... రియాక్టివిటీ, రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపి; ఫిజికల్‌ కెమిస్ట్రీలో కెమికల్‌ కైనెటిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ద్రావణాలు; ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, ఎం.ఒ.టి. అంశాలు ముఖ్యమైనవి.

* భౌతిక శాస్త్రంలో విద్యుత్తు, ఆప్టిక్స్‌, తరంగాలు, అసిలేషన్స్‌, థర్మోడైనమిక్స్‌; గణితంలో డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, ఇంటెగ్రేషన్స్‌, కోర్డానేట్‌ జామెట్రీ అంశాలు ముఖ్యమైనవి.

ఎన్ని మార్కులు వస్తే...
సీబీఈఈ పరీక్ష మొత్తం 240 మార్కులకు ఉంటుంది. ఎ, బి విభాగాల్లో వచ్చిన మార్కులను కలిపి ర్యాంకును కేటాయిస్తారు. మంచి యూనివర్సిటీలో సీటు సాధించాలంటే 150పైనే మార్కులు తెచ్చుకోవాలి. ప్రశ్న పత్రం స్థాయి, పోటీని బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మరిన్ని మార్కులు స్కోర్‌ చేయవచ్చు. ఈ రెండు సబ్జెక్టుల నుంచే సుమారు 220 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల ర్యాంకును నిర్ణయించడంలో ఈ సబ్జెక్టులు చాలా కీలకం.


ఎం.ఎస్‌సి.తోపాటు అనేక సంస్థలు ఎం.టెక్‌. బయోటెక్నాలజీ, ఎం.ఎస్‌సి. అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, వెటర్నరీ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా సీబీఈఈ మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సీబీఈఈ మార్కుల ఆధారంగా అగ్రిబయోటెక్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

వీటికి కావలసిన అర్హతలు, ఇతర వివరాలు జేఎన్‌యూ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

- ఎస్. కిరణ్ కుమార్

No comments:

Post a Comment