ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 6 February 2012

డీఎస్‌సీలో విజయానికి మెలకువలు!



భావి పౌరులను తీర్చిదిద్దే సదవకాశం; ఒత్తిడికి దూరంగా విధుల నిర్వహణ; వేతనాలూ, సెలవుల పరంగా ఆకర్షణ... కలగలిపితే ఉపాధ్యాయ కొలువు! దాదాపు మూడేళ్ళ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటన వెలువడింది. ఉద్యోగార్థుల ఎదురుచూపులు ఫలించాయి. వీరి తక్షణ కర్తవ్యం- మే 2,3 తేదీల్లో జరిగే డీఎస్‌సీ రాతపరీక్షలో గరిష్ఠ మార్కుల సాధన. దీనికోసం దృఢ సంకల్పంతో అధ్యయనం ప్రారంభించాలి!




ఎస్‌జీటీ... తక్కువే పోటీ
టెట్‌లో దాదాపు 45 వేలమంది ఉత్తీర్ణత సాధించారని అంచనా. ప్రభుత్వం నియమించనున్న ఎస్‌జీటీ ఉద్యోగాలు 11,602. ఈ పోస్టులకు డి.ఇడి అభ్యర్థులు మాత్రమే అర్హులు కాబట్టి పోటీ చాలా పరిమితంగానే ఉంటుంది. అంటే 1:10 కంటే తక్కువే. ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదనుకుంటే వెంటనే మూడు నెలల ప్రణాళిక రచించుకుని ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.
ఎస్‌జీటీ పరీక్షా పద్ధతిలో గణనీయమైన మార్పులు చేశారు. ముందుగా మారిన పరీక్షా పద్ధతినీ, అందులోని సబ్జెక్టుల ప్రాధాన్యాన్నీ తెలుసుకుని దీనికనుగుణంగా సిద్ధం కావాల్సివుంటుంది.

ఉపాధ్యాయ అభ్యర్థులు ఇప్పటికే టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో ఉత్తీర్ణత సాధించివుంటారు కాబట్టి జరగబోయే డీఎస్‌సీ వీరికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కారణం- టెట్‌ సిలబస్‌కూ, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) సిలబస్‌కూ కొద్దిపాటి తేడా తప్ప చెప్పుకోదగ్గ మార్పులు లేవు.

కొత్తగా ఎస్‌జీటీకి ప్రిపరేషన్‌ కొనసాగించే అభ్యర్థులు జి.కె., వర్తమాన అంశాలు, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌లపై సిద్ధం కావాల్సివుంటుంది.

'పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌' డి.ఇడి సిలబస్‌లో పేపర్‌-4గా అభ్యసించినదే. మిగిలిన తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్‌, సోషల్‌ కంటెంట్‌ (1-8 తరగతులు, రాష్ట్ర సిలబస్‌), మెథడాలజీ, డి.ఇడి సిలబస్‌ను సునిశితంగా అధ్యయనం చేయాలి.

డీఎస్‌సీ పరీక్ష కోణంలో...
* టెట్‌లో చదివిన అనేక అంశాలను మళ్ళీ డీఎస్‌సీ పరీక్ష కోణంలో చదవాలి. టెట్‌ సిలబస్‌లో లేని అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

* గత డీఎస్‌సీలో కంటెంట్‌ 7వ తరగతి సిలబస్‌ వరకే ఉండేది. ఈసారి 8వ తరగతి సిలబస్‌ కూడా చదవాలి. టెట్‌ ప్రశ్నపత్రంలో జ్ఞానాన్ని పరీక్షించేవి మాత్రమే కాకుండా అవగాహన, అనువర్తనలకు సంబంధించిన ప్రశ్నలూ అడిగారు. కాబట్టి డీఎస్‌సీ సన్నద్ధత కూడా ఆ కోణంలో ఉండేలా జాగ్రత్త వహించాలి.

* కంటెంట్‌ కోసం... ఇప్పటికే టెట్‌ కోసం అభ్యసించిన విషయాలను ఇప్పుడు డీఎస్‌సీ పరీక్ష కోణంలో చదవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల తీరు అవగాహనకు వస్తుంది.
* కఠినమైన/కొత్త అంశాలకు తగిన సమయం కేటాయించి చదవాలి.
* మెథడాలజీ కూడా టెట్‌లో చదివిందే కాబట్టి గతంలోని పొరపాట్లను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.

పదో తరగతి స్థాయి వరకూ...
* తెలుగు, ఆంగ్లం భాషలకు సంబంధించి భాషా ప్రావీణ్యం, భాషాంశాలు, భావప్రసారం, భాషణ నైపుణ్యం, భావావగాహన సామర్థ్యాలను పదోతరగతి స్థాయి వరకూ అభ్యసించాలి.
* బోధనా పద్ధతుల కోసం ఏపీ రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన డి.ఇడి సిలబస్‌ దృష్టిలో ఉంచుకుని వివరణాత్మకంగా, సమగ్రంగా అభ్యసించాలి.
* సిలబస్‌ 8వతరగతి వరకే అయినప్పటికీ ప్రశ్నల స్థాయి పదో తరగతి వరకూ ఉంటుంది. అంటే ప్రశ్నల కఠినతా స్థాయి కొంత ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్నీ అంశాల వారీగా, విశ్లేషణాత్మక ధోరణిలో చదవాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. తొలిదశలో ప్రేరణను పరీక్ష జరిగేవరకూ నిలుపగలిగి సాధన చేస్తే ఎస్‌జీటీ ఉద్యోగం మీ సొంతమే!






No comments:

Post a Comment