ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 3 January 2012

పోటీ పరీక్షల్లో గెలుపు మలుపు... జనరల్‌ స్టడీస్‌

పీపీఎస్ సీ పరీక్ష ఏదైనా తప్పనిసరిగా ఉండే పేపర్ జనరల్ స్టడీస్. దీని ప్రాధాన్యం, దీనికెలా సిద్ధం కావాలో తెలుసుకుందామా?

ఇటీవల జరిగిన డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌, డీఏఓ, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌, ఏఈఈల తుది ఎంపికలో జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌) పేపరే నిర్ణాయకంగా మారింది! గెలుపును అంతిమంగా నిర్దేశించే పేపర్‌ ఇది.

ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఈ పేపర్‌ పెద్ద సమస్యగా, ప్రతిబంధకంగా మారింది. వారు ఇప్పటివరకు జీఎస్‌ ఉన్న పరీక్షలు రాయకపోవడమే దీనికి కారణం. అంతేకాక పదో తరగతి తరవాత జీఎస్‌కు సంబంధించిన ప్రధాన సబ్జెక్టులు (చరిత్ర, భూగోళ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ..) తిరిగి ఎక్కడా చదవకపోవటంతో ఈ పేపర్‌ కొత్తగా, కష్టంగా అనిపిస్తుంది.

సాంకేతిక సబ్జెక్టుల్లో కానీ వృత్తిపరమైన సబ్జెక్టుల్లో కానీ, తమ అకడమిక్‌ విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల్లో చాలామంది అభ్యర్థులు మంచి స్కోరు సాధించగలిగారు. కానీ, జీఎస్‌లో సరైన స్కోరు సాధించక విజయానికి దూరమయ్యారు! అందుకే ఈ పేపర్‌పై నిర్లక్ష్యం పనికిరాదు.

జనరల్‌ స్టడీస్‌లోని 150 ప్రశ్నలు బహుళ ఐచ్ఛిక విధానంలో ఉంటాయి. ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల జీఎస్‌ ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే సబ్జెక్టుల పరిధి.. ప్రశ్నల స్థాయి కొంతవరకు తెలుస్తుంది. దాన్ననుసరించి ఆయా సబ్జెక్టులను కొన్నింటిని ఇంటర్‌స్థాయి వరకు, కొన్నింటిని డిగ్రీస్థాయి వరకు చదవాలి. నిత్యజీవితంలో వాటి అనువర్తనాలపై, ప్రాధాన్యతలపై దృష్టి సారించాలి.

భారతదేశ చరిత్ర
భారతదేశ చరిత్రను డిగ్రీ స్థాయిలో చదవాలి. ఇంగ్లిషు మీడియం అభ్యర్థులు ఆంగ్లంలో ప్రామాణిక గ్రంథాలనూ, తెలుగు మీడియం వారు తెలుగు అకాడమీ డిగ్రీ స్థాయి పుస్తకాలనూ చదవాలి. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రించిన 'భారత స్వాతంత్య్ర పోరాటం' వంటివీ అధ్యయనం చేయాలి. ముందు చెప్పినట్లు మొదట ప్రశ్నల స్థాయి తెలుసుకుంటే ఏ స్థాయిలో చదవాలో అర్థమవుతుంది. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రల్లో ఒక్కొక్క టాపిక్‌ నుంచి రాగల ప్రశ్నలను కూడా ఊహించి చదవవలసి ఉంటుంది. ఆంధ్రుల చరిత్ర కూడా ముఖ్యమే. ముందుగా స్కూలు పుస్తకాలు చదివి, ఆపై డిగ్రీ పుస్తకాలు చదివితే పట్టు సాధించవచ్చు.

భూగోళశాస్త్రం

ఇటీవల ఈ పేపర్‌ నుంచి వచ్చిన ప్రశ్నల సరళిలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రశ్నలు ఎక్కువగా పటాల అధ్యయనం (మ్యాప్‌ స్టడీ) ఆధారంగా ఉంటున్నాయి. ప్రపంచ పటంలోని వివిధ ఖండాలు, దేశాలు, సముద్రాలు, పర్వతాలు, సరస్సులు మొదలైనవాటి ఉనికిని పరిశీలించి వాటి ఎల్లలపై పట్టు సాధించాలి. భారతదేశ పటంలో కూడా ప్రధాన భూస్వరూపాల విస్తరణ, రాష్ట్రాల సరిహద్దులు, నదీ ప్రవాహాలను- అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలను గమనిస్తూ చదవాలి. ఆ తరవాత ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసేప్పుడు ఖండాల, దేశాల ప్రధాన భూస్వరూపాలను, నదులను, వ్యవసాయ పంటలను, ఖనిజ వనరులను, పరిశ్రమలను, ప్రజల జీవన విధానాలను తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే భారతదేశ- ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలను వాటి భౌతిక, ఆర్థిక, సామాజిక కోణాల్లో అధ్యయనం చేయాలి.

కొన్ని ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో కూడా ఉంటాయి. అయితే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు 8- 12వ తరగతివి చాలా ఉపయోగకరం. తెలుగు మీడియం వారు కూడా వీటిని చదివి, ముఖ్యాంశాలను నోట్‌ చేసుకోవడం మేలు. 2001, 2011 జనగణనలపై, దేశంలోని గిరిజన తెగలపై కూడా ప్రశ్నలుంటాయి

జనరల్‌ సైన్స్‌

భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలలోని మౌలిక భావనలపై, మానవ శరీర ధర్మశాస్త్రం, ఆర్థిక వృక్షశాస్త్రం, వ్యవసాయ, పశు సంవర్ధక శాస్త్రం, సమాచార సాంకేతిక విజ్ఞానం, అణుభౌతిక శాస్త్రం, అంతరిక్ష పరిశోధనల అనువర్తనాలపై ప్రశ్నలుంటాయి. రసాయన శాస్త్రంలోని రసాయన నామాలు, వాటి వినియోగాలు, బహుళ ప్రాచుర్యం పొందిన ఔషధాలూ ముఖ్యమే. పాఠ్యాంశాల మౌలిక భావనలపై అవగాహన పెంచుకుని, ఆపై వాటి అనువర్తనాలు తెలుసుకోవలసి ఉంటుంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలపై, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ శాస్త్రజ్ఞులపై ప్రశ్నలుంటాయి. ఈ ఏడాది పోటీ పరీక్షల్లో హర గోవింద ఖొరానా, శ్రీనివాస రామానుజంలపై తప్పకుండా ప్రశ్నలుంటాయని గుర్తించి ఆ కోణంలో సిద్ధం కావాలి. జనరల్‌సైన్స్‌ సన్నద్ధతకు చాలావరకు హైస్కూలు పాఠ్యపుస్తకాలూ, కొన్ని అంశాలకు ఇంటర్‌ పుస్తకాలూ ఉపయోగపడతాయి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ
దేశంలో అమల్లో ఉన్న పథకాలు, వాటి లక్ష్యాలు, ఆర్థిక వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, విదేశీ వాణిజ్యం మొదలైనవి ముఖ్యం. ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కూడా ప్రశ్నలుంటాయి. మరికొన్ని పంచవర్ష ప్రణాళికల నుంచి వస్తాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చే సగం ప్రశ్నలు సమకాలీన, ఆర్థిక పరిస్థితులపై ఉంటాయని గమనించాలి. తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను చదవవచ్చు. అదనంగా ఏడాది కాలపు వార్తాపత్రికల నుంచి ఆర్థిక వ్యవస్థ సమాచారాన్ని సేకరించి చదవాలి. 11వ పంచవర్ష ప్రణాళిక ముగుస్తున్నందువల్ల దీనిలో సాధించిన ప్రగతి (మధ్యంతర సమీక్ష), 2011-12, త్వరలో ప్రవేశపెట్టబోయే 2012-13 వార్షిక బడ్జెట్‌లపై అవగాహన అవసరం. డిగ్రీస్థాయి తాజా ఎడిషన్ల పుస్తకాలను చదవాలి. భారత ప్రభుత్వం ప్రచురించే యోజన, కురుక్షేత్ర వంటి పత్రికలూ ఉపయోగమే. ఇంగ్లిషు మీడియంవారికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రామాణిక గ్రంథాలు ఉపకరిస్తాయి.

భారత రాజకీయ వ్యవస్థ

దీని అధ్యయనం అంటే భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవటమే. రాజ్యాంగంలో ముఖ్యమైన ప్రకరణాలను కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇటీవలి పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు ప్రకరణాల నుంచి యథాతథంగా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాయతీరాజ్‌సంస్థలపై ప్రత్యేక దృష్టి అవసరం.
దేశ రాజ్యాంగ పరిణామాలు కూడా ముఖ్యమే. ఉదా. లోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లు పార్లమెంటులో ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశ పెట్టబడినదనో లేదా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావలసిన మెజారిటీ ఎంత అనో ప్రశ్నలు అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌పరిణామాల దృష్ట్యా కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ప్రశ్నలు రావచ్చు.

డి.డి. బసు రచించిన 'ఇంట్రడక్షన్‌టు కాన్‌స్టిట్యూషన్‌' తాజా ఎడిషన్‌ఉపయుక్తం. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ వారి 'భారత రాజ్యాంగం' చదవాలి. అదనంగా ప్రకరణల వారీగా ప్రచురితమైన రాజ్యాంగాన్ని సంక్షిప్తంగా చదివి ముఖ్య ప్రకరణలను గుర్తుంచుకోవాలి. పంచాయతీరాజ్‌వ్యవస్థ నుంచీ, ఆంధ్రప్రదేశ్‌పంచాయతీరాజ్‌చట్టం నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.

విపత్తుల నిర్వహణఈ అంశాన్ని ఏపీపీఎస్సీ ఈ ఏడాదే ప్రవేశపెట్టింది. కాబట్టి దీన్నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఇందులోని కొన్ని అంశాలను (భూకంపాలు, తుపానులు, సునామీలు...) భౌతిక భూగోళ శాస్త్రంలో కూడా చదువుతాం. కానీ ఇక్కడ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇవి సంభవించే ప్రాంతాలను తెలుసుకోవటం ముఖ్యం. వీటితో పాటు కృత్రిమంగా మానవుల తప్పిదాలు, అకృత్యాల వల్ల సంభవించే విపత్తులనూ- నివారణ మార్గాలనూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటి అధ్యయనానికి సీబీఎస్‌సీ సిలబస్‌చదవాలని ఏపీపీఎస్సీప్రత్యేకంగా సూచించింది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులైనా వీటిని ఇంగ్లిషులో చదివి అర్థం చేసుకోవాలి.

వర్తమాన విషయాలు
ఏడాది కాలం నుంచి జరిగిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపై ప్రశ్నలుంటాయి. కొన్ని సమస్యల మూలాలనూ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ అంశం చదివినా దాని పుట్టు పూర్వోత్తరాలతో సహా అధ్యయనం చేయాలి.

ఒక తెలుగు పత్రికనూ, హిందూ లాంటి జాతీయ వార్తాపత్రికనూ తప్పక చదవాలి. అనేక రంగాల నుంచి విభిన్న కోణాల్లో ప్రశ్నలు అడుగుతుంటారు. క్రీడలు; జాతీయ, అంతర్జాతీయ సదస్సులు; శిఖరాగ్ర సమావేశాలు; జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు; ముఖ్యమైన వ్యక్తులు, ప్రాంతాలు; విజ్ఞాన ఆవిష్కరణలు; రక్షణ రంగానికి చెందిన క్షిపణులు; జలాంతర్గాములు; రాజకీయ-సాంఘిక ఉద్యమాలను అధ్యయనం చేయాలి. వర్తమాన ఆర్థిక, రాజకీయ భౌగోళిక, సాంస్కృతిక అంశాలను క్షుణ్ణంగా చదవాలి. వార్తాపత్రికలతో పాటు పరీక్షాపద్ధతిలో సమగ్రంగా అందించే ప్రామాణిక మ్యాగజీన్‌చదవటం కూడా మంచిదే.


మానసిక సామర్థ్యం
రీజనింగ్‌కు సంబంధించిన మౌలిక అంశాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. వాటికి సంబంధించిన అనేక ప్రశ్నలను భిన్న కోణాల్లో సాధించవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలుండే నమూనా పేపర్లను అభ్యాసం చేయాలి. దీనికి బ్యాంకు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఎంతో ఉపయోగకరం. బ్యాంక్‌పుస్తకాల రీజనింగ్‌పేపర్‌లోని ప్రశ్నలను సాధ్యమైనంత ఎక్కువగా అభ్యాసం చేయాలి. మానసిక సామర్ధ్య ప్రశ్నలు సాధించడమనేది అభ్యర్థుల ప్రజ్ఞ, సాధనలపై ఆధారపడి ఉంటుంది. ఆ దిశలో సన్నద్ధత సాగించాలి.

-  ఎ. ఎం. రెడ్డి

No comments:

Post a Comment