ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday 28 December 2011

సాధన చేస్తే... సాయుధ పోలీస్‌

కేంద్ర సాయుధ పోలీసు బలగాల నియామకానికి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. వివిధ విభాగాల్లో 49 వేల కానిస్టేబుల్‌ పోస్టుల నియామకానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌.ఎస్‌.సి.) రంగం సిద్ధం చేసింది.

ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌, రైఫిల్‌మ్యాన్‌, తదితర ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ విభాగాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అన్ని పోస్టులను జనరల్‌ డ్యూటీ కేటగిరీలో భర్తీచేయనున్నారు.

అభ్యర్థులు సరైన ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే పదోతరగతితోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు.

కేంద్ర సాయుధ బలగాల్లో పోస్టుల సంఖ్య నుంచి, నియామక ప్రక్రియ మొత్తాన్ని ఎస్‌ఎస్‌సీ పకడ్బందీగా రూపొందించింది. ఖాళీల నోటిఫికేషన్‌తోపాటు శారీరక సామర్థ్య పరీక్షల తేదీల దగ్గర్నుంచి, రాతపరీక్ష ప్రణాళిక, వైద్యపరీక్ష తేదీలు, తుది ఫలితాల వెల్లడి వరకు స్పష్టమైన నియామక ప్రక్రియను వెల్లడించడం అభ్యర్థులకు కలిసొచ్చే విషయం. ఈ విధానం ద్వారా అభ్యర్థులకు సమయం వృధా కాకుండా ఉంటుంది.

మొత్తం పోస్టుల్లో ఐదువేల పైచిలుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో 80 శాతం పోస్టులను రాష్ట్ర అభ్యర్థులకు కేటాయిస్తారు.

శారీరక సామర్థ్య పరీక్ష పురుష అభ్యర్థులకు...
* లాంగ్‌జంప్‌: 11 ఫీట్లు (మూడు అవకాశాలు ఇస్తారు)
* హైజంప్‌: 3 1/2 ఫీట్లు (మూడు అవకాశాలు ఉంటాయి)

మహిళా అభ్యర్థులకు...
* లాంగ్‌ జంప్‌: 9 ఫీట్లు (మూడు అవకాశాలు ఉపయోగించుకోవచ్చు)
* హైజంప్‌: 3 ఫీట్లు (మూడు అవకాశాలు ఇస్తారు)
రాతపరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100. విభాగాల వారీగా ప్రశ్నలు...
* పార్ట్‌-ఎ (జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌): ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. 25 మార్కులు కేటాయించారు.
* పార్ట్‌- బి (జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌): ఇందులో కూడా 25 మార్కులకు 25 ప్రశ్నలుంటాయి.
* పార్ట్‌-సి (ఎలిమెంటరీ మేథమేటిక్స్‌): ఇందులో ప్రశ్నల సంఖ్య 25, కేటాయించిన మార్కులు 25.
* పార్ట్‌-డి (హిందీ లేదా ఇంగ్లిష్‌): అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషను ఎంచుకోవచ్చు. గ్రామర్‌ అంశాలతోపాటు అభ్యర్థి భాషా సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 25 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయించారు.

రాతపరీక్షను అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌ భాషలో రాయవచ్చు. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు తెలుగు మీడియంలో ప్రిపరేషన్‌ కొనసాగించవచ్చు. ఇంగ్లిష్‌లో ప్రశ్నను అర్థం చేసుకొని సమాధానం గుర్తించగలిగితే సరిపోతుంది. పరీక్ష ఇంగ్లిష్‌ మీడియం కదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

రాత పరీక్షకు ఎలా?
*జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో పదాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం, దాన్ని విశ్లేషించడం, దిశలు, రక్తసంబంధాలు, వెన్‌చిత్రాలు, బొమ్మల పోలిక, నంబర్‌ సీరీస్‌, ర్యాంకింగ్‌; లాజికల్‌ రీజనింగ్‌లో... డాటా సఫిషియన్సీ, డెసిషన్‌ మేకింగ్‌, జడ్జిమెంట్‌, స్టేట్‌మెంట్‌-కంక్లూజన్స్‌, తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

*జనరల్‌ నాలెడ్జ్‌ - జనరల్‌ అవేర్‌నెస్‌:
ఇందులో కరెంట్‌ అఫైర్స్‌తోపాటు జనరల్‌ నాలెడ్జ్‌ మిలితమై ఉండే జనరల్‌ స్టడీస్‌లోని హిస్టరీ, జాగ్రఫీ నుంచి కొన్ని ప్రశ్నలు, పాలిటీ నుంచి భారత రాజ్యాంగం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని మార్పులు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జనరల్‌ నాలెడ్జ్‌ పరంగా అంతర్జాతీయ సంస్థలు, అవార్డులు, క్రీడలు, ప్రముఖ గ్రంథ రచయితలు, దేశాలు-రాజధానులు, భారతదేశంలో ప్రథములు, ఇండియన్‌ రైల్వేలు, విమానయానం, ప్రాచీన కట్టడాలు, ప్రముఖుల సమాధులు, ముఖ్యమైన తేదీలు, వివిధ మతాలు, దేశాల సరిహద్దులు, తదితర అంశాలను చదవాలి.

* చరిత్ర: భారత జాతీయోద్యమ చరిత్ర, వివిధ రాజవంశాలు, ఆయా రాజుల కాలంనాటి రాజకీయ పరిస్థితులు, కళలు, లిపులు, సాంస్కృతిక అంశాలు, జైన బౌద్ధమతాలు, సింధూ, ఆర్య నాగరికతలు అధ్యయనం చేయాలి.

* పాలిటీ: దీనిలో భారత రాజ్యాంగ చరిత్ర, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పాలనావ్యవస్థ, రాజ్యసభ, లోక్‌సభ, హైకోర్ట్‌, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రిమండలి, గవర్నర్‌ మొదలైన అంశాలు చదువుకోవాలి.

* జాగ్రఫీ: ఇందులో అక్షాంశాలు, రేఖాంశాలు, శీతోష్ణస్థితి, నీటిపారుదల వ్యవస్థ, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, అడవులు, వ్యవసాయం, తదితర అంశాలు ముఖ్యమైనవి.

* శాస్త్ర, సాంకేతిక రంగం: ఈ విభాగంలో అంతరిక్షం, రక్షణరంగం, అణుశక్తి, తదితర అంశాల నుంచి వర్తమాన విషయాలను అధ్యయనం చేయాలి. ఈ అంశాలతోపాటు పరీక్ష తేదీకి 4 నుంచి 5 నెలల ముందు జరిగిన వర్తమాన విషయాలు చూసుకోవాలి.

ప్రాథమిక గణితం
ఈ విభాగం నుంచి 25 మార్కులకు 25 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో సంఖ్యలు - వాటి ధర్మాలు, భాగాహారాలు, భిన్నాలు, కసాగు- గసాభా, శాతాలు, లాభనస్టాలు, కాలం - దూరం, రైళ్ళు, బారు వడ్డీ, చక్రవడ్డీ, క్యాలండర్‌, కాలం - పని, మొదలైన ప్రాథమిక స్థాయిలోని గణిత ప్రశ్నలు అడుగుతారు.

* ఇంగ్లిష్‌: ఇందులో కేవలం అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. Articles, Prepositions, Verbs, Helping Verbs, Tenses, Voice, Parts of Speechమొదలైన అంశాలతోపాటు Comprehension Passage లాంటి అంశాలు కూడా ప్రాక్టీస్‌ చేయడం మంచిది. ఈ విభాగం కోసం 8, 9, 10 తరగతులలోని గ్రామర్‌ అంశాలు చదివితే సరిపోతుంది.

అర్హతలు, వయోపరిమితి
జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు వయసు 1-8-2012 నాటికి 18 ఏళ్ల నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు 4 జనవరి 2012 నాటికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

శారీరక ప్రమాణాలు:
* పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. మహిళా అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
* చాతీ (పురుష అభ్యర్థులకు మాత్రమే) గాలి పీల్చకుండా ఉన్నప్పుడు 80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ.లు విస్తీర్ణం పెరగాలి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు
* జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌, అర్థమెటిక్‌ విభాగాలు అభ్యర్థులకు చాలా ముఖ్యమైనవి. ఉద్యోగ సాధనలో ఈ విభాగాలే కీలకం కాబట్టి వీటి ప్రిపరేషన్‌కు అధికంగా సమయం కేటాయించడం తప్పనిసరి.
* అర్థమెటిక్‌ విభాగం కోసం 1 నుంచి 25 వరకు ఎక్కాలు, వర్గాలు, గుణకారాలు, భాగహారాలు తక్కువ సమయంలో చేసేటట్లు సాధన అవసరం.
* గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన వివిధ ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.
* మౌలిక అంశాలు ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ, ముఖ్యమైన గణిత ఫార్ములాలు ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించరాదో తెలుసుకోవాలి.
* ప్రాథమిక తరగతుల నుంచి అంశాలవారీగా (జాగ్రఫీ, చరిత్ర, పాలిటీ) పాఠ్యాంశాలను విభజించి సొంత నోట్సు తయారుచేసుకోవాలి.
* జీకే, కరెంట్‌ అఫైర్స్‌తోపాటు జనరల్‌ స్టడీస్‌లోని ప్రతి విభాగంలో ఆబ్జెక్టివ్‌ బిట్లను సాధన చేయడం మంచిది.
* రాతపరీక్ష పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది కాబట్టి బేసిక్స్‌పై అధికంగా ప్రశ్నలు ఉంటాయి. పాఠశాల స్థాయి పుస్తకాలలోని అంశాలను బాగా చదవాలి.

శారీరక పరీక్షలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షల్లో లాంగ్‌ జంప్‌, హైజంప్‌ రెండూ క్లిష్టమైనవి. శ్రద్ధతో చేస్తే లాంగ్‌ జంప్‌ కోసం 15-20 రోజుల సాధన సరిపోతుంది.

* లాంగ్‌జంప్‌ కోసం: అభ్యర్థులు జంప్‌ చేసేటప్పుడు టేకాఫ్‌ బోర్డ్‌కు 10 నుంచి 20 అడుగుల దూరం తీసుకొని ప్రాక్టీస్‌ చేయాలి. అలా దూరం నుంచి పరుగెత్తుతూ రావడం వల్ల జంప్‌చేసే స్థాయి పెరుగుతుంది. ముందుగా దగ్గరగా స్టెప్స్‌ వేసుకుంటూ రన్నింగ్‌ చేస్తూ, టేకాఫ్‌ బోర్డ్‌ దగ్గరికి వచ్చే ముందు కాలి అంగల దూరం పెరగాలి. అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి ఒక్కో కాలుపై పట్టు ఉంటుంది. కొందరికి కుడి కాలుపై, కొందరికి ఎడమకాలుపై పట్టు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సాధన చేయాలి.

* హైజంప్‌ కోసం: అభ్యర్థులు ముందు నుంచీ సెలక్షన్స్‌ కోసం నిర్ణయించిన ఎత్తును ప్రాక్టీస్‌ చేయకుండా, తక్కువ ఎత్తులో, అంటే ముందుగా 2 ఫీట్లు, 2 1/2 ఫీట్లు, 3 ఫీట్లు అలా ఎత్తును పెంచుకుంటూ జంప్‌ చేయాలి. హైజంప్‌ పోల్‌పై ఉంచే కర్రను జంప్‌ చేసినప్పుడు తాకగానే కర్ర పడిపోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. హైజంప్‌ చేసేటప్పుడు పోల్స్‌కు కనీసం 3 అడుగుల దూరం నుంచి జంప్‌ చేసేట్టుగా చూసుకోవాలి. హైజంప్‌లో ఉన్న మూడు పద్ధతుల్లో సీజరింగ్‌, బెల్లీరోలింగ్‌, స్ట్రెయిట్‌జంప్‌... వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని సాధన చేయాలి.


దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ (ప్రింటెడ్‌ దరఖాస్తు ద్వారా) పద్ధతుల్లో దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అభ్యర్థులు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా చలానా రూపంలో ఫీజు చెల్లించాలి. ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టాఫీస్‌ ద్వారా సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ ఫీ స్టాంప్స్‌ రూపంలో ఫీజు చెల్లించాలి.

* దరఖాస్తు ఫీజు, జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.50. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆఫ్‌లైన్‌ ద్వారా పూర్తిచేసిన ధరఖాస్తులను ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు 'రీజనల్‌ డైరెక్టర్‌ (ఎస్‌ఆర్‌), స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఈవీకే సంపత్‌ బిల్డింగ్‌, సెకండ్‌ ఫ్టోర్‌, కాలేజ్‌ రోడ్‌ చెన్నై, తమిళనాడు- 600006' చిరునామాకు పంపించాలి. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి.

* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 4 జనవరి 2012.
* శారీరక సామర్థ్య పరీక్షలు: ఫిబ్రవరి- మార్చిలో
* రాతపరీక్ష తేదీ: 22-4-2012
* వైద్యపరీక్షలు: జూన్‌-జులై
* తుది ఫలితాల వెల్లడి: 30-9-2012.
 
- మాల్యాద్రి.

No comments:

Post a Comment