ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Wednesday 14 September 2011

మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మెరుగైన విద్యాసంస్థలు

దేశంలో అనేక కార్పొరేట్‌ విద్యా సంస్థలు సాధారణ యూనివర్సిటీలకంటే నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఆధునిక సౌకర్యాలు, మంచి ప్లేస్‌మెంట్లతో ఐఐఎంలకు దీటుగా మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి.

అలాంటి కొన్ని సంస్థల గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం.

ఇదో కోవలోకి వచ్చే మరికొన్ని...

* ఎస్‌పీ జైన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబయి (ఎస్‌పీజేఐఎంఆర్‌);
* మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్ స్టిట్యూట్‌ (ఎండీఐ), గుర్గావ్‌;
* భారతీదాసన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఐఎం), తిరుచిరాపల్లి.


ఈ సంస్థల్లో అందిస్తోన్న మేనేజ్‌మెంట్‌ కోర్సులు, వాటి ప్రత్యేకతలు, ప్రవేశ వివరాలు తెలుసుకుందాం.

అంతర్జాతీయ గుర్తింపు సంస్థల అక్రెడిటేషన్‌తో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోన్న అరుదైన సంస్థ ఎండీఐ, గుర్గావ్‌. ఈ సంస్థకు లండన్‌లోని అసోసియేషన్‌ ఆఫ్‌ ఎంబీఏస్‌ (ఏఎంబీఏ) గుర్తింపు ఉంది. ఉన్నత అర్హతలు, అనుభవం గల జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్‌ల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. పారిశ్రామికంగా మంచి గుర్తింపు పొందిన గుర్గావ్‌లో ఈ సంస్థ ఉండటం సంస్థకు, విద్యార్థులకు సానుకూల అంశం.

ఎండీఐలో ఆధునిక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అనేక పార్ట్‌టైమ్‌, పీజీపీఎం, డాక్టొరల్‌ ప్రోగ్రామ్‌లు చేయవచ్చు. ముఖ్యమైన ప్రోగ్రామ్‌లు కొన్ని...

* పీజీపీ ఇన్‌ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌
* పీజీపీ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌
* పీజీపీ ఇన్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌
* పీజీపీ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ మేనేజ్‌మెంట్‌
* ఫెలో/ ఎగ్జిక్యూటివ్‌ ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌
* నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎగ్జిక్యూటివ్‌ పీజీడీఎం)
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌

ఎండీఐ అందిస్తోన్న మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ, ఎన్‌బీఏ గుర్తింపు ఉంది. నేషనల్‌ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్‌ సహకారంతో పీజీపీ - హెచ్‌ఆర్‌ను నిర్వహిస్తోంది. పరిశోధనలకు కూడా ఈ సంస్థ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, కార్పొరేట్‌ గవర్నన్స్‌, తదితర అంశాల్లో పరిశోధనలు చేయవచ్చు. కంపెనీల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగుల కోసం అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తోంది.

అనేక విదేశీ బిజినెస్‌ స్కూళ్లతో స్టూడెంట్‌ ఎక్చేంజ్‌ ప్రోగ్రామ్‌లను ఎండీఐ నిర్వహిస్తోంది. వీటిలో పాల్గొనడానికి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్‌లతోపాటు ఎండీఐ మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు, ఒ.పి. జిందాల్‌ స్కాలర్‌షిప్‌లు పొందవచ్చు.

* పీజీపీఎం (2012-14)లో ప్రవేశానికి ఎండీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. క్యాట్‌ 2011 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆదారంగా ఎండీఐలో ప్రవేశం లభిస్తుంది.

* అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎండీఐ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఫిబ్రవరి- ఏప్రిల్‌ 2012లో గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

* దరఖాస్తులకు చివరితేదీ 20 అక్టోబరు 2011.

బీఐఎం, తిరుచిరాపల్లి
ప్రధాన స్రవంతి యూనివర్సిటీలకు చెందిన మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ప్రముఖమైనది... భారతీదాసన్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బీఐఎం- తిరుచిరాపల్లి). టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓగా పనిచేసిన ఎస్‌. రామదొరై పాలనా నేతృత్వంలో బీఐఎం కొనసాగుతోంది. మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, సిస్టమ్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లతో ఎంబీఏ కోర్సును బీఐఎం అందిస్తోంది. ఐఐఎంలు, ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల నిపుణులతో శిక్షణ అందిస్తోంది.
యూనివర్సిటీలో భాగంగా ఉన్నప్పటికీ ప్రత్యేక బిజినెస్‌ స్కూల్‌ మాదిరిగా బీఐఎం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతోంది. భారతీదాసన్‌ యూనివర్సిటీ పరిధిలో స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా గుర్తింపు పొందింది. మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, మార్పులు, చేర్పులలో ప్రభుత్వ రంగ కంపెనీ బీహెచ్‌ఈఎల్‌, సీఐఐ పాలుపంచుకుంటున్నాయి. విద్యార్థులకు బీహెచ్‌ఈఎల్‌ ప్రాజెక్టులను కూడా ఇస్తోంది. అనేక కార్పొరేట్‌ కంపెనీల్లో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు చేసే అవకాశం ఉంటుంది. క్యాట్‌ 2011 స్కోర్లను మాత్రమే బీఐఎం పరిగణనలోకి తీసుకుంటుంది. క్యాట్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ వివిధ కేటగిరీల అభ్యర్థులకు ఇలా ఉండాలి... ఓసీ-90; బీసీ-75; ఎంబీసీ-60; ఎస్సీ-50, ఎస్టీ-50.

* కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. అభ్యర్థులు క్యాట్‌ 2011 పరీక్ష తప్పనిసరిగా రాయాలి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో బీఐఎంకు దరఖాస్తు చేయవచ్చు. ఐఎంఎస్‌ లెర్నింగ్‌ సెంటర్లలో కూడా దరఖాస్తులు లభిస్తాయి. 1 డిసెంబరు 2011 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.

చివరితేదీ 30 జనవరి 2012.


'రిటైల్‌' ప్రత్యేకతకు 'లీబా' - చెన్నై
నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ కోర్సులను మరో రెండు అగ్రశ్రేణి ప్రైవేటు సంస్థలు... లయోలా ఇన్  స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (లీబా- చెన్నై), జేవియర్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (భువనేశ్వర్‌).

* వ్యాపార రంగంలో జాతీయ, అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సమర్థులైన నిపుణులను తయారుచేయడానికి మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించిన సంస్థ లయోలా ఇన్ స్టిట్యూట్‌. జనరల్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, సిస్టమ్స్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, రిటైలింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్పెషలైజేషన్లతో పీజీడీఎం కోర్సులను నిర్వహిస్తోంది. ఎక్స్‌.ఎల్‌.ఆర్‌.ఐ. - ఎక్స్‌ఏటీ ఆధారంగా ఎంపిక చేస్తుంది. తర్వాత జీడీ, ఇంటర్వ్యూ ఉంటాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కావచ్చు.

* జేవియర్‌ ఇన్ స్టిట్యూట్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఎం, రూరల్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్లతో పీజీడీఎం, ఫెలోప్రోగ్రామ్‌లను ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. తొలిదశలో క్యాట్‌ లేదా జేవియర్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటాయి. వీటితోపాటు అకడమిక్‌ రికార్డు, పని అనుభవం కూడా ఎంపికలో కీలకంగా పనిచేస్తాయి. అభ్యర్థులు ఎక్స్‌ఐఎంబీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేయవచ్చు.

చివరితేదీ 21 నవంబరు 2011.

No comments:

Post a Comment