ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Tuesday 27 September 2011

ఐఐటీలో పీజీ 'జామ్‌' జామ్ గా!

ఐటీ జామ్‌ 2012 పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది.

ఈసారి జామ్‌ పరీక్షలో గమనించాల్సిన మార్పు ఏమిటంటే... గతంలోకంటే మూణ్ణెల్లు ముందుగా పరీక్షను నిర్వహించనున్నారు.

ఏటా సాధారణంగా మే నెలలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 12, 2012న దేశవ్యాప్తంగా జామ్‌ జరగనుంది. దీనివల్ల డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు చాలా తక్కువ సమయం లభిస్తుంది. మంచి ప్రణాళికతో, సమయపాలనతో చదివితేనే జామ్‌లో మంచి ర్యాంకు దక్కించుకోగలరు.

ఏటా ఏదో ఒక ఐఐటీ కొత్త పీజీ కోర్సులను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ బాంబే కెమిస్ట్రీలో ఎం.ఎస్సీ - పీహెచ్‌డీ డ్యుయల్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. నాలుగేళ్ల ఎం.ఎస్సీ ఫిజిక్స్‌ - ఎం.టెక్‌. మెటీరియల్‌ సైన్స్‌ (నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో) కోర్సును కూడా ఐఐటీ బాంబే ప్రవేశపెట్టింది. ఐఐటీ బాంబేతోపాటు ఢిల్లీ, హైదరాబాద్‌, గౌహతి, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, రూర్కీ ఐఐటీలు జామ్‌ ద్వారా ఎం.ఎస్‌సి., ఎం.ఎస్‌సి- పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ, ఇతర ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కల్పిస్తున్నాయి.


పరీక్ష ఎలా ఉంటుంది?
ఐఐటీ జామ్‌లో మొత్తం 8 పేపర్లుంటాయి. అవి... బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథమేటిక్స్‌, మేథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌. వీటిలో ప్రతిభ ఆధారంగా మొత్తం 33 రకాల పీజీ, డ్యుయల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అభ్యర్థులు ప్రవేశం కోరుకుంటున్న కోర్సును బట్టి ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవాలి. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష వ్యవధి మూడు గంటలు. బయోటెక్నాలజీ, ఎంసీఏ కోర్సుల ప్రశ్నపత్రాలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. కెమిస్ట్రీ, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథ్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ పేపర్‌లు ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. ఈ పేపర్లలో 30 శాతం ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, 70 శాతం సబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. తప్పు సమాధానాలకు (ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు) నెగటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. అందువల్ల ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు కచ్చితంగా సరైన సమాధానం తెలిస్తేనే రాయడం మంచిది.

* బయోటెక్నాలజీ ఎంట్రెన్స్‌ పేపర్‌లో 44 శాతం ప్రశ్నలు బయాలజీ, 20 శాతం కెమిస్ట్రీ, 18 శాతం ఫిజిక్స్‌, 18 శాతం మేథమేటిక్స్‌ ప్రశ్నలుంటాయి. మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ కోర్సును బాంబే, రూర్కీలోని ఐఐటీలు మాత్రమే అందిస్తున్నాయి. అందువల్ల ఈ బయోటెక్నాలజీ సబ్జెక్టుకు పోటీ అధికంగా ఉంటుంది.

* ఇతర పేపర్లకు 30 శాతం మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. వీటికి ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. ఈ ప్రశ్నల మొత్తానికి 90 మార్కులు వెయిటేజ్‌ ఉంటుంది. మిగిలిన 70 శాతం ప్రశ్నలు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. వీటికి 210 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

ఏ ఐఐటీలో ఏ కోర్సు?
* ఐఐటీ బాంబే ఎనర్జీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.

* ఐఐటీ ఖరగ్‌పూర్‌ కెమిస్ట్రీ, జియోఫిజిక్స్‌, జియోలాజికల్‌ సైన్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌లలో ఎం.ఎస్సీ, పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.

* ఐఐటీ హైద్రాబాద్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో ఎం.ఎస్‌సి. కోర్సును నిర్వహిస్తోంది.

* ఎంసీఏ ప్రోగ్రామ్‌ను ఐఐటీ రూర్కీ మాత్రమే అందిస్తోంది.

* ఐఐటీ బాంబే గత ఏడాది నుంచి బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌లో ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది.

ఇతర ఐఐటీల్లో ప్రోగ్రామ్‌లు, వాటికి అవసరమైన అర్హతల వివరాలు జామ్‌ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

ప్రాథమిక అంశాలపై పట్టు...
కోర్సులతోపాటు ప్రవేశ పరీక్షల్లో కూడా ఐఐటీలు ఉన్నత ప్రమాణాలు పాటిస్తాయి. జామ్‌ ప్రశ్నపత్రాలు విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్ధ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన అభ్యర్థులు జామ్‌లో విజయం సాధించడం తేలిక. అభ్యర్థులు ముందుగా 10+2 సిలబస్‌తో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ప్రాథమిక భావనలపై అవగాహన కోసం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలుగు అకాడమీ పుస్తకాలను చదవచ్చు. తర్వాత బీఎస్సీ సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ ఎంట్రెన్స్‌లో ఎంబైపీసీ నేపధ్యం గల విద్యార్థులు ఎక్కువగా మంచి ర్యాంకులను సాధిస్తున్నారు. బయాలజీతోపాటు మేథ్స్‌ మీద కూడా వీరికి పట్టు ఉండటం దీనికి ప్రధాన కారణం. అందువల్ల బయాలజీ విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీతోపాటు మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులను కూడా బాగా నేర్చుకోవాలి. బీఎస్సీలో బీజడ్‌సీ చదివిన అభ్యర్థులు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌, మాలెక్యులర్‌ బయాలజీ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ఒకవేళ డిగ్రీలో ఆధునిక బయాలజీ స్పెషలైజేషన్లు (బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ మొదలైనవి) తీసుకున్నట్లయితే, బోటనీ, జువాలజీ సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి.

* బయోటెక్నాలజీ పరీక్ష సిలబస్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ అభ్యర్థులు ఇతర పరీక్షలు రాసేవారికంటే అధికంగా సమయం కేటాయించాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు రోజూ కనీసం ఐదారు గంటలు తప్పనిసరిగా ఏకాగ్రతతో చదవాలి.

* ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ రాసే విద్యార్థులు ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీతోపాటు మేథ్స్‌లో ఇచ్చిన సిలబస్‌ను కూడా అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. ఫిజిక్స్‌ పేపర్‌ రాసే అభ్యర్థులు ఫిజికల్‌ ఆప్టిక్స్‌, క్వాంటమ్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆసిలేషన్స్‌ అండ్‌ వేవ్స్‌, క్వాంటమ్‌ ఫిజిక్స్‌, స్పెక్ట్రోస్కోపీ, న్యూక్లియర్‌ అండ్‌ అటామిక్‌ ఫిజిక్స్‌, హీట్‌, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌ సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.

* ఎం.ఎస్‌సి. మేథమేటిక్స్‌ రాసే అభ్యర్థులు మేట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాలిక్యులేషన్స్‌, వెక్టార్‌, త్రికోణమితి, కోర్డానేట్‌ జామెట్రీ సబ్జెక్టులను బాగా సాధన చేయాలి. సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా చదవడం, అన్వయించడం చాలా ముఖ్యం.

ప్రణాళికతో ప్రారంభం...
జామ్‌ ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో ఐఐటీలు దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో అమల్లో ఉన్న సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల రాష్ట్రంలోని అభ్యర్థులు కేవలం డిగ్రీ కోర్సుల సిలబస్‌ మీదనే ఆధారపడితే సరిపోదు. జామ్‌ సిలబస్‌ను డిగ్రీ సిలబస్‌తో పోల్చి చూసుకోవాలి. డిగ్రీ సిలబస్‌లో లేని కొత్త అంశాలను వాటికి సంబంధించిన మెటీరియల్‌ను కూడా సేకరించి చదువుకోవాలి.

* దీర్ఘకాలిక ప్రిపరేషన్‌ ఉంటే జామ్‌లో సులభంగా విజయం సాధించవచ్చు. డిగ్రీ మొదటి ఏడాది నుంచే ప్రాథమిక భావనలపై దృష్టిపెడుతూ సబ్జెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలి. మౌలిక భావనలను అర్థం చేసుకుంటూ దాన్ని వాస్తవ పరిస్థితులకు అన్వయించుకోవడం అలవాటు చేసుకోవాలి.

* డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంటే, ముందుగా పరీక్ష స్వభావాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, సబ్జెక్టులో బలాబలాల ఆధారంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.

* డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు మార్చి- ఏప్రిల్‌లో బీఎస్సీ పరీక్షలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొదటి నుంచీ జామ్‌ ప్రిపరేషన్‌కు కొంత సమయం కేటాయిస్తే మంచిది. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిమీద పట్టు సాధించాలి.


సాధన తప్పనిసరి...
జామ్‌ డిస్క్రిప్టివ్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రంలోనే జవాబులు రాయడానికి కూడా నిర్దిష్ట స్థలం కేటాయిస్తారు. ఆ కేటాయించిన స్థలంలోనే జవాబును సమగ్రంగా రాయాలి. అందువల్ల మీరు నేర్చుకున్న అంశాలను సంగ్రహంగా నిర్దిష్ట స్థలంలో రాయడం సాధన చేయాలి. తక్కువ పాయింట్లతో ఎక్కువ సమాచారాన్ని పొందుపరచడం నేర్చుకోవాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదివిన విద్యార్థులు అనేకమంది జామ్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అందువల్ల మాధ్యమం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయడం, వ్యాసరూప ప్రశ్నలు రాయడం నేర్చుకుంటే సరిపోతుంది.

* ఎంత సమయం చదివారనే దానికంటే, సబ్జెక్టును ఇష్టపడి ఏకాగ్రతతో చదవడం ముఖ్యం. సానుకూల దృక్పథంతో శ్రమిస్తే తప్పనిసరిగా జామ్‌లో మంచి ర్యాంకు సాధించవచ్చు.

ఈ మెలకువలను అందించిన రచయిత... ఎస్‌.కిరణ్‌కుమార్‌.

2 comments:

  1. please make pdf files to download education related information. please keep all pdf files relating to sunday english by sureshan and monday english topics published on the chaduvu by sureshan from the inception to download and learn English

    ReplyDelete
  2. డియర్ రాఘవా,
    సురేశన్ గారి spoken English పాత వ్యాసాలు నెట్ ఎడిషన్లో అందుబాటులోనే ఉన్నాయి.

    చదువులో వచ్చే ఆర్టికల్స్ కొత్తవాటిని ఎప్పటికప్పుడు ఈ బ్లాగులో ఇస్తున్నాం. ప్రతిభలో, చదువులో వచ్చే ఇంగ్లిష్ వ్యాసాలను మీరు ఎప్పటికప్పుడు ఈ-పేపర్ నుంచి క్లిపింగ్స్ గా preserve చేసుకునే అవకాశం ఉంది కదా! మొదటి వ్యాసం నుంచీ కావాలంటే మీరు గ్రంథాలయాల నుంచి సేకరించుకోవాల్సిందే.

    ReplyDelete